Wednesday, May 15, 2024

Delhi | ఢిల్లీ తెలంగాణ భవన్‌లో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మహాత్మా గాంధీ జయంతి ఘనంగా జరిగింది. సోమవారం భవన్ ప్రాంగణంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో జాతిపిత 154వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఢిల్లీలోని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కె.ఎం. సాహ్ని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి బాపూజీ చిత్రపటానికి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కె.ఎం. సాహ్ని మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రానికి, జాతి నిర్మాణం కోసం గాంధీజీ ఎన్నో త్యాగాలు చేశారన్నారు. అనంతరం రెసిడెంట్ కమిషనర్ డా.గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ జీవన విధానం ప్రతి ఒక్కరికి ఆదర్శమని… సత్యం, అహింస అనే ఆయుధాలతో ఆయన అనేక విజయాలు సాధించారని అన్నారు.

దక్షిణాఫ్రికాలో లా ప్రాక్టీస్ చేసే సమయంలో నల్ల జాతియులపై చూపిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా గాంధీ పోరాటం చేసి విజయం సాధించారని, అనంతరం భారతదేశంలో భారతీయులు పడుతున్న బాధలను, ఎదుర్కొంటున్న వివక్షను గమనించి స్వరాజ్యం దీనికి పరిష్కారమని భావించి ఎన్నో శాంతి ఉద్యమాలు చేసి స్వాతంత్య్రం సాధించారని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ సంజయ్ జాజు, ఇతర భవన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement