Friday, May 17, 2024

TS | నేను ఉండగా కేసీఆర్ మళ్లీ సీఎం ఎలా అవుతారో చూస్తా : రేవంత్

కొత్తగా ఎన్నికైన కానిస్టేబుల్ అభ్యర్థులకు బుధవారం ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో నిరుద్యోగులు ఎవరూ అధైర్య పడొద్దని.. త్వరలోనే సమస్యలన్నీ పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. తెలంగాణ కోసం పోరాడిన యువత ఈ రోజు ఉద్యోగాలు సాధించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ‘సీఎంగా ప్రమాణం చేసినప్పుడు ఎంత ఆనందం కలిగిందో.. ఇప్పుడు కూడా అంతే సంతోషంగా ఉంది. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నుంచి యువతను గట్టెక్కిస్తున్నాం. గత ప్రభుత్వానికి తొమ్మిదన్నరేళ్లలో ఉద్యోగాలు భర్తీ చేయాలనే ఆలోచనే రాలేదు. అధికారులతో సమీక్షించి ఉద్యోగాల భర్తీకి అన్నీ ఆటంకాలు తొలగించాం.’ అని పేర్కొన్నారు.

పదేళ్లు నేనే సీఎం..

నిరుద్యోగ యువకుల సమస్యలు పరిష్కరించేందుకు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. పదేళ్లు ఈ బాధ్యతలోనే ఉండి మీ కోసం 24 గంటలు కష్టపడి పనిచేస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘నిరుద్యోగ యువకులారా ఈ రాష్ట్రం మీదే. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న మీరు, మీకోసం పని చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు ఆశీర్వదిస్తే మరో పదేళ్లు ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది. కేసీఆర్ మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం అంటున్నారు. ఎలా వస్తారో నేనూ చూస్తా.’ అని సవాల్ విసిరారు

కేసీఆర్ వ్యాఖ్యలకు రేవంత్ కౌంటర్

నల్గొండ సభలో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా కౌంటర్ ఇచ్చారు. పాలిచ్చె బర్రెను ఇంటికి పంపి.. దున్నపోతును తెచ్చుకున్నారని కేసీఆర్ అన్నారని.. అయితే, కంచర గాడిదను ఇంటికి పంపి.. రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారని ఇవాళ అసెంబ్లీలో ఓ అటెండర్ తనకు చెప్పినట్లు సీఎం తెలిపారు.

- Advertisement -

‘స్వరాష్ట్రం వచ్చాక బాధలు తీరుతాయని నిరుద్యోగులు ఆశించారు. అయితే, కేసీఆర్ పాలనలో వారి ఆశలు అడియాశలయ్యాయి. ఉద్యోగాల భర్తీపై అధికారులతో సమీక్షించి అన్ని ఆటంకాలు తొలగించాం. నియామక పత్రాలు ఇంటికే పంపొచ్చు కదా? అని హరీష్ రావు అంటున్నారు. ఉద్యోగాలు పొందిన మీ కళ్లలో ఆనందం చూస్తేనే నాకు నిద్ర పడుతుంది. మీ ఆనందాన్ని మేమూ పంచుకుంటాం. కుటుంబ సభ్యులకే కేసీఆర్ పదవులు, ఉద్యోగాలు ఇచ్చారు. రాష్ట్ర యువత ఏం పాపం చేసిందని ఉద్యోగాలు ఇవ్వలేదు. శాసనసభకు రమ్మంటే ఆయన రాలేదు. నల్గొండ వెళ్లి బీరాలు పలికారు. కృష్ణాలో నీటి వాటాలపై సీఎంగా కేసీఆర్ పెట్టిన సంతకాలు తెలంగాణ ప్రజల మరణ శాసనాలు. అవి మన పాలిట గుదిబండగా మారాయి. మళ్లీ నీళ్ల అంశాన్నే ఎత్తుకుంటున్నారు. ఢిల్లీతో కొట్లాడుదామంటే కేసీఆర్ ఇంటి నుంచి బయటకు రావట్లేదు. మేడిగడ్డ మేడిపండు చందంగా మారింది. పొట్ట విప్పితే అన్నీ పురుగులే ఉన్నాయి.’ అంటూ రేవంత్ మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement