Sunday, March 24, 2024

Big story | కొల్లేరును కొల్లగొడుతున్నారు.. చేపల చెరువులుగా మార్పు

అమరావతి, ఆంధ్రప్రభ : కొల్లేరు అభయారణ్యం ఇప్పుడు ఆక్రమణలకు నెలవుగా మారుతోంది. కొంతమంది స్వార్థపూరిత వ్యక్తులు దళారులుగా మారి ఈ ఘాతుకానికి వడిగడుతున్నారు. ప్రతి ఏటా కొల్లేరులో ఈ తంతు జరగడం పరిపాటే. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి. కొల్లేరు సరస్సు ఏలూరు, దెందులూరు, కైకలూరు ప్రాంతాల్లో విస్తరించి ఉంది. ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులతోపాటు కొంత మంది దళారులకు ఇది సిరులు కురిపిస్తోంది. ప్రస్తుతం కొల్లేరు అభయారణ్యంలో తవ్వకాలు మళ్లి ప్రారంభమయ్యాయి. అయితే, మీడియా కొన్ని చోట్ల జరుగుతున్న ఈ తంతును బయటకు తీసుకురావడంతో దళారులు కొంచెం వెనక్కు తగ్గారు. ఈ ఆక్రమణలను జరగకుండా చూడాల్సిన రెవెన్యూ, అటవీ శాఖ అధికారు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మరికొందరైతే లంచాల మత్తుకు బానిసై కొల్లేరు అభయారణ్యాన్ని ధ్వసం చేసే ప్రక్రియకు సహకారం అందిస్తున్నారు.

- Advertisement -

కబ్జాలో 15 వేల ఎకరాలు

కొల్లేరులో ఇటీవలికాలంలో వరుసగా జరుగుతున్న అక్రమ తవ్వకాలపై పెద్దఎత్తున దుమారం రేగుతోంది. ఒకప్పుడు ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుగా పేరుపొందిన కొల్లేరులో గత ఏడాదినాటికి దాదాపు 12 వేల ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా కోరల్లో చిక్కుకుంది. ఈ ఏడాదిలో ఎంత కబ్జాకు గురైందన్న వివరాలు తెలియాల్సి ఉంది. ఈ కబ్జా భూమంతా చేపల చెరువుల రూపంలో ఆక్రమణల్లోకి వెళ్లిపోయింది. జిరాయితీ భూములనూ కలిపి లెక్కిస్తే ఈమొత్తం 15,742 ఎకరాల్లో చేపల చెరువుల ఆక్రమణలు ఏర్పడ్డాయి. అంతర్జాతీయ ప్రాముఖ్యం ఉన్న ఈ సరస్సు అదృశ్యమవుతున్నా స్వార్థం కోసం కొందరు ప్రజా ప్రతినిధులు, మరికొందరు దళారులు కలిసి రూ. కోట్ల మేర వ్యాపారం చేస్తున్నారు.

స్వరూపం మారుతున్న సరస్సు

సరస్సు స్వరూపం మార్చేసి కాలుష్య కాసారంగా మారుస్తున్నారు. గ్రేట్‌ పెలికాన్‌ వంటి 189 రకాల పక్షులు, 61 రకాల ప్రత్యేక మత్స్యజాతులు, 17 రకాల రొయ్యలకు. నీటి సంబంధమైన 17 వృక్షజాలాలకు కొల్లేరు నెలవని పేరున్నా ఆక్వాకల్చర్‌ దాన్నంతా విధ్వంసం చేస్తోంది. 15 రకాల అరుదైన చేపల జాతులు ఇప్పటికే అంతరించిపోయాయి. ఏలూరులో రెండేళ్ల కిందట సంభవించిన వింత వ్యాధికి కొల్లేరు ఆక్వాసాగులో వాడుతున్న విష పదార్ధాలే కారణమని జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో కేసు నమోదైంది. ఆ నేపథ్యంలోనే జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశాల మేరకే తాజా కొల్లేరు ఆక్రమణల అంశం అధికారికంగా వెలుగుచూసింది.

2006లో సుప్రీం సాధికార కమిటీ ఏర్పాటు

కొల్లేరు ఆక్రమణలపై 2006లో సుప్రీం కోర్టు సాధికార కమిటీని నియమించింది. ఆ సాధికార కమిటీ కొల్లేరు సరస్సు ఆక్రమణలను స్వయంగా పరిశీలించింది. అప్పట్లో కొల్లేరు సరస్సులో దాదాపు 50 వేల ఎకరాల్లో ప్రభుత్వం జిరాయితీ, డీ ఫాం భూముల్లో చట్టానికి విరుద్ధంగా సాగుతున్న చేపల చెరువులను బాంబులు పెట్టి ధ్వంసం చేసింది. ఆపరేషన్‌ కొల్లేరు పేరుతో ఆక్రమణలను ధ్వంసం చేసి మళ్లి కొల్లేరు మంచినీటి సరస్సును పునరుద్ధరించాలనే ఉద్దేశ్యంతో ఆ కార్యక్రమం చేపట్టారు. ప్లస్‌ 5 కాంటూరులోపు ఉన్న ప్రాంతమంతటినీ కొల్లేరు అభయారణ్యంగా రక్షించాలని జీవో 120 ప్రకారం ఉత్తర్వులు ఇచ్చారు. సుప్రీం కోర్టు దీన్ని ఖరారు చేసింది. ఈ పరిధిలో 83,982.70 ఎకరాల భూమి ఉందని ప్రభుత్వం గుర్తించింది. అక్కడ ఏ ప్రభుత్వ, ప్రైవేటు, డీ ఫాం భూముల్లో చేపల చెరువులు తవ్వకూడదు. కొల్లేరును సంరక్షించాల్సిన బాధ్యత అటవీ శాఖదే అని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.

15,742 ఎకరాల్లో మళ్లి చెరువులు

సాక్షాత్తూ సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని చర్యలు చేపట్టిన తరువాత కూడా కొల్లేటిని కాపాడలేక పోతున్నారు. కొల్లేరు అభయారణ్యం పరిధిలో 2006 తర్వాత 2022 వరకూ 15,742 ఎకరాల్లో మళ్లి కొత్తగా చేపల చెరువులు తవ్వారని సమాచారం. ఇన్నాళ్లూ ఆక్రమణలు పెరుగుతున్నాయని అనధికారిక అంచనాలే తప్ప అధికారికంగా ఈ స్థాయి అక్రమణలు వెలుగు చూడలేదు. తాజాగా జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో ఉన్న ఒక కేసులో ప్రభుత్వాన్ని వివరణ కోరగా నాటి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా కొల్లేరు తాజా పరిస్థితిపై 2021 డిసెంబరులో ఒక నివేదిక సమర్పించారు. ఆనివేదికలోనే 2006 కొల్లేరు ఆపరేషన్‌ తరువాత మళ్లి 15,742 ఎకరాలను ఆక్రమించుకుని చెరువులు తవ్వేశారని, అందులో 11,867 కరాలు ప్రభుత్వ భూమి అని స్పష్టంగా పేర్కొన్నారు. సుప్రీం కోర్టు ఆక్రమణలను ధ్వసం చేయించి ఒక రూపు తెచ్చిన తరువాత రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కొల్లేరు కాపాడే విషయంలో శ్రద్ధ చూపలేకపోతున్నాయని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

నేతలు.. అధికారులు కుమ్మక్కు

అక్రమార్కులకు కొల్లేరు కొంగు బంగారంగా తయారైంది. కొల్లేరు వాసుల పేరు చెప్పి బయటి వ్యక్తులు వేల రూపాయల లీజుకు చేపల, రొయ్యల చెరువులు సాగు చేస్తూ రూ. కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. వేల ఎరాల సర్కారు భూములను.. అదీ ఎంతో విలువైన సరస్సు ప్రాంతాన్ని ఆక్రమించేశారు. ఆ పార్టీ, ఈ పార్టీ అని లేదు. ఎవరు అధికారంలో ఉన్నా కొందరు ఎమ్మెల్యేలు కొల్లేరు కబ్జాలకు వత్తాసు పలుకుతున్నారనేది ఇక్కడ బహిరంగ రహస్యమే. ప్రస్తుతం ఇప్పుడు కూడా రాజకీయ నేతల పాత్ర చర్చనీయాంశంగా మారింది. కొత్త చెరువలను తవ్విండచంలో, అధికారులు జోక్యం చేసుకోకుండా ఒత్తిడి చేయడంలో వారు బాగా ప్ర భావం చూపుతున్నారు.

ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఇంకా కొందరు స్థానికులకు లీజుల సొమ్ము వాటాలుగా పోగా మిగిలింది ఆ ఊళ్ల వాళ్లు పంచుకుంటున్నారు. రెవెన్యూ అధికారులు కొందరు ప్రయోజనాలు పొందుతున్నా కొల్లేరులో తమ పాత్ర లేదని, అంతా అటవీ అధికారుల బాధ్యతే అని పేర్కొంటున్నారు. అటవీ శాఖ అధికారులు మాత్రం నామమాత్రపు కేసులు పెడుతున్నారు తప్ప ఆక్రమణలను పూర్తిగా తొలగించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. చెరువు గట్టును కొద్దిగా ధ్వంసం చేయడం, వాహనాలు సీజ్‌ చేసి కేసులు పెట్టడానికే అటవీశాఖ పరిమితమవుతుంది. తర్వాత నెమ్మదిగా ఆగట్టు పూడ్చుకుని యథేచ్చగా చెరువులు సాగు చేసుకుంటున్నా ఎవరూ ఏమీ చేయలేని పరిస్తితి ఏర్పడింది.

ఏటా పెరుగుతున్న ఆక్రమణలు

కొల్లేరు ఆపరేషన్‌ తర్వాత మళ్లి నెమ్మదిగా మొదలైన చెరువల ఆక్రమణలు ఇటీవల కొన్నేళలుగా విశ్వరూపం దాలుస్తున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ ప్రాంతంలో ఆక్రమణల తీరు ఇలా ఉంది.

(ఎకరాల్లో)
సంవత్సరం ప్రభుత్వ భూమి జిరాయితి మొత్తం ఆక్రమణలు
2006-07 0 3.03 3.03
2007-08 0 0 0
2008-09 170 258.71 428.71
2009-2010 307.95 471.31 779.26
2010-2011 321.61 355.24 676.85
2011-2012 182.21 40.88 223.09
2012-2013 237.83 122.45 360.28
2013-2014 28.62 22.53 51.15
2014-2015 586.80 193.88 780.68
2015-2016 361.37 33.48 394.85
2016-2017 737.83 172.51 910.34
2017-2018 2,329.59 244.69 2,574.28
2018-2019 2,428.97 25.71 2,454.28
2019-2020 1,665.47 95.27 1,760.74
2020-2021 1,305.45 1,009.33 2,314.78
2021-2022 1,204.12 825.24 2,029.36
మొత్తం 11,867.82 3,874.26 15,742.08

Advertisement

తాజా వార్తలు

Advertisement