Friday, April 26, 2024

ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లిన కోహ్లీ, రోహిత్‌

వన్డే ఇంటర్నేషనల్‌ ర్యాంకులను అంతర్జాతీయ క్రికెట్‌ మం డలి (ఐసీసీ) బుధవారం ప్రకటించింది. టీమిండియా స్టార్‌ కోహ్లీ, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వన్డే ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లారు. స్వదేశంలో శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో అద్భుత ప్రదర్శన చేసిన ఈ ఇద్దరు తమ ర్యాంకులను మెరుగుపరచుకున్నారు. విరాట్‌ కోహ్లీ రెండు స్థానాలు ఎగబాకి ఆరోస్థానానికి చేరుకున్నాడు. మరో వైపు రోహిత్‌ ఒక స్థానం మెరుగుపర్చుకుని ఎనిమిదో స్థానంలో నిలిచాడు. కాగా తొలి మ్యాచ్‌లో హిట్‌ మ్యాన్‌ .. 67 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేశాడు. ఇక వన్‌డౌన్‌ బ్యాటర్‌గా వచ్చిన విరాట్‌… 87 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 113 పరుగులు సాధించాడు.

తద్వారా వన్డేల్లో 45వ సెంచరీ, ఓవరాల్‌గా అంతర్జాతీయకెరీర్‌లో 73వ శతకం తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ అద్భుత ప్రదర్శనతోనే తమ ర్యాంకుల్లో ముందుకెళ్లారు. ఇక ఈ ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం అగ్రస్థానంలో ఉన్నాడు. తర్వాతి స్థానాల్లో రాసి వాన్‌ డెర్‌ డసెన్‌ (సౌతాఫ్రికా), ఇమామ్‌ ఉల్‌ హక్‌ (పాకిస్థాన్‌, క్వింటన్‌ డి కాక్‌ (సౌతాఫ్రికా), డేవిడ్‌ వార్నర్‌ (ఆస్ట్రేలియా) ఉన్నారు. ఇక లంకతో తొలి వన్డేలో ఘన విజయం సాధించిన టీమ్‌ ఇండియా సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement