Monday, March 18, 2024

Big story | రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతున్న కంటి వెలుగు.. 55.79 శాతం మందికి పరీక్షలు పూర్తి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి దృష్టి లోపాలను నివారించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలు రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అంధత్వ రహిత సమాజాన్ని నిర్మించాలనే గొప్ప సంకల్పంతో జనవరి 19 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ద్వారా కంటి సమస్యలు దూరమవుతున్నాయని ప్రజలు సంబరపడుతున్నారు. 18 సంవత్సరాలు పైబడిన వారికి కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి కళ్లద్దాలు ఉచితంగా పంపిణీ చేస్తుండటంతో తీసుకున్న వారు మురిసిపోతున్నారు.

కంటి చూపు సరిగా కనిపించక ఇబ్బందులు పడుతున్న మాకు తమ దగ్గరికే వచ్చి కంటి వెలుగు శిబిరాలు ఏర్పాటు చేసి కంటి పరీక్షలు నిర్వహించి తమ జీవితాల్లో వెలుగు నింపుతున్న ముఖ్యమంత్రి సల్లగుండాలని దీవెనలిస్తున్నారు. ఈ శిబిరాలకు వచ్చే ప్రజలు ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం మంచి కార్యక్రమమని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జూన్‌ 15 వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించనుండగా, సెలవు దినాల్లో మినహా సిబ్బంది స్థానికంగానే అందుబాటులో ఉంటూ పరీక్షలు త్వరగా పూర్తి చేసేలా చొరవ చూపుతున్నారు.

- Advertisement -

1500 బృందాల ఏర్పాటు..

రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాల నిర్వహణకు 1500 బృందాలతో పాటు ఏర్పాటు చేసిన బఫర్‌ బృందాలు అన్ని మండలాలు, పురపాలికల్లో పని చేస్తున్నాయి. పిహెచ్‌సిలను యూనిట్‌గా తీసుకుని గ్రామాలను ఎంపిక చేయగా, ఆశా వర్కర్లు, ఎఎంఎంలు, అధికారులు గ్రామాల్లో జనాభా వారీగా వివరాలు సేకరించి అందుకు అనుగుణంగా శిబిరాలు నిర్వహిస్తున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, పురపాలిక చైర్మన్‌, కమిషనర్లు, కౌన్సిలర్ల సహాయం తీసుకుంటూ ఆ ప్రాంతంలోని ప్రతీ ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు..కళ్లు సరిగా లేకపోతే అన్నీ సమస్యలే. మన ఇండ్లలో చాలా మంది పెద్దవాళ్లు తమకు కంటి సమస్యలు ఉన్నా, చూపు తగ్గినా ఆ విషయం బయటికి చెప్పరు. డాక్టర్‌ దగ్గరికి వెళ్తే డబ్బు ఖర్చవుతుందనీ, రాజీ పడిపోతారు. ప్రజలకు చాలా మేలు చేసే కంటి వెలుగు పథకం ప్రభుత్వం ద్వారా ఉచిత కంటి పరీక్షలతో పాటు అవసరమైన మందులు కళ్లద్దాలు ఉచితంగా అందజేస్తున్న ఈ కార్యక్రమం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

88,51,164 మందికి కంటి పరీక్షలు, లక్ష్యంలో 55.79 శాతం పూర్తి..

రాష్ట్ర్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, పురపాలిక సంఘాల పరిధిలోని అన్ని వార్డుల్లో రెండో విడతలో భాగంగా సుమారు కోటిన్నర మందికి కంటి పరీక్షలు చేయాలనేది వైద్య,ఆరోగ్య శాఖ అధికారులు లక్ష్యంగా నిర్దేశించగా, ఇప్పటి వరకు 88 లక్షల, 51 వేల 164 మందికి కంటి పరీక్షలు చేశారు. 14 లక్షల 69 వేల మందికి ఉచితంగా రీడింగ్‌ అద్దాలు పంపిణీ చేశారు. ఇన్ఫెక్షన్లు ఉన్న వారికి చుక్కల మందుతో పాటు ఏ, డి, బి కాంప్లెక్స్‌ మాత్రలు పంపిణీ చేస్తున్నారు. శస్త్ర చికిత్సలు అవసరమైన వారికి వైద్యులు సూచనలు, సలహాలు ఇస్తున్నారు.

మహిళలకు బాసటగా ఆరోగ్య కేంద్రాలు

రాష్ట్ర్ర ప్రభుత్వం మహిళలను సంపూర్ణ ఆరోగ్య వంతులను చేయడమే లక్ష్యంగా గ్రామ గ్రామాన ఆరోగ్య మహిళా కేంద్రాలను ఏర్పాటు చేసింది. మహిళ ఆరోగ్యం ఇంటికి సౌభాగ్యం అనే లక్ష్యంతో మహిళా దినోత్సవం రోజున రాష్ట్ర్రంలో ప్రత్యేకంగా మహిళా ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించింది. మహిళా ఆరోగ్య కేంద్రాల ద్వారా 8 విభాగాలలో మహిళలకు అవసరమైన పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్దారణ జరిగిన తరువాత వారికి తదుపరి చికిత్సను పూర్తిగా ఉచితంగా అందించేందుకు మహిళా ఆరోగ్య కేంద్రాలు దోహదపడుతున్నాయి. పిహెచ్‌సి పరిధిలో ఉన్న ఆశా కార్యకర్తలు ఏఎన్‌ఎంలు ఆరోగ్య మహిళా కేంద్రం నిర్వహణ పట్ల విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రాథమిక డయాగ్నస్టిక్స్‌, క్యాన్సర్‌ స్క్రీనింగ్‌, సూక్ష్మ పోషక లోపాలు, మూత్ర నాళ ఇన్ఫెక్షన్లు, పిఐడి, పిసిఓఎస్‌, కుటుంబ నియంత్రణ, రుతుస్రావ సమస్యలు, మెనోపాజ్‌ మేనేజ్‌మెంట్‌, లైంగిక వ్యాధులు, శరీర బరువు అంశాలు ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement