Monday, April 29, 2024

కాంతార2.. టార్గెట్ ఆస్కార్

కాంతార2 చిత్రం గురించి అప్ డేట్ ఇచ్చారు చిత్ర నిర్మాత కిరగందూర్.రెండో భాగానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ ప్రారంభమయ్యిందన్నారు. స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని, ఈ ఏడాది ద్వితీయార్థంలో షూటింగ్‌ ప్రారంభించే అవకాశం ఉందన్నారు. వచ్చే ఏడాది(2024) చివర్లో కాంతార2ని రిలీజ్ చేస్తామని తెలిపారు. అయితే ఆ సినిమాని పక్కా ప్రణాళికతో అంతర్జాతీయంగా ప్రమోట్‌ చేస్తామని వెల్లడించారు. టార్గెట్‌ ఆస్కార్‌ అని పరోక్షంగా వెల్లడించారు నిర్మాత. అన్ని భాషల్లో సూపర్‌ హిట్‌ టాక్ తెచ్చుకుంది కాంతార చిత్రం. విశేష ఆదరణతోపాటు భారీ కలెక్షన్లని సాధించింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా నాలుగు వందల యాభై కోట్లకుపైగా వసూళ్లని రాబట్టింది. పది రెట్ల లాభాలను తెచ్చిపెట్టింది.

దర్శకుడు, నటుడు రిషబ్‌ శెట్టి దర్శకత్వం వహిస్తూ నటించిన ఈ చిత్రంలో సప్తమి గౌడ హీరోయిన్‌గా నటించింది. హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. దక్షిణ కర్నాటకకి చెందిన భూత కోల అనే సాంప్రదాయ కళ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. నేచురాలిటీకి దగ్గరగా ఉండటం, సాంప్రదాయ పండుగ ఉండటం, ఆధ్యాత్మిక అంశాలు, పేదవాళ్లను సంపన్నులు దోచుకోవడం, కులాల మధ్య వ్యత్యాసాలను ఆవిష్కరించిన ఈ చిత్రానికి జనం బ్రహ్మరథం పట్టారు. అందుకే ఇది భారీ విజయాన్ని సాధించింది. ఇదిలా ఉంటే ఈ చిత్రం ఆస్కార్‌కి షార్ట్ లిస్ట్ అయిన విషయం తెలిసిందే. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు విభాగంలో ఆస్కార్‌కి పంపబడింది. కానీ నామినేట్‌ కాలేదు. తాజాగా దీనిపై నిర్మాత కిరగందూర్‌ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, కాంతార సినిమా సెప్టెంబర్‌లో రిలీజ్‌ అయ్యిందని, అందుకే అంతర్జాతీయ స్థాయిలో అవార్డుల నామినేషన్స్ సమయంలోపు ప్రచారం చేయలేకపోయామని తెలిపారు. సరైన ప్రచారం లేకపోవడం వల్లే ఆస్కార్‌, గోల్డెన్‌ గ్లోబ్‌ లాంటి అంతర్జాతీయ అవార్డులకు నామినేట్‌ కాలేకపోయిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement