Tuesday, April 23, 2024

Education| నీట్‌ పీజీ అభ్యర్థుల ఇంటర్న్‌షిప్‌ కటాఫ్‌ గడువు పెంపు.. 4 వేల మంది అభ్యర్థులకు ఊరట

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : నీట్‌ పీజీ అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆ పరీక్షకు హాజరయ్యేందుకు తప్పనిసరిగా పూర్తి చేయాల్సిన ఎంబీబీఎస్‌ ఇంటర్న్‌షిప్‌ కటాఫ్‌ తేదీని ఆగస్టు 11 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో తెలంగాణ సహా పలు రాష్ట్రాల నీట్‌ అభ్యర్థులకు ఊరట లభించింది. కటాఫ్‌ తేదీని పొడిగించాలని పలు రాష్ట్రాలు, విద్యార్థి సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఇంటర్న్‌షిప్‌ పూర్తయ్యే విద్యార్థులే నీట్‌ పీజీ-2023 పరీక్షకు అర్హులని కేంద్ర ప్రభుత్వం ముందుగా ప్రకటించింది. ఆ కటాఫ్‌ గడువును జూన్‌ 30 వరకు గత నెల 13న నోటిఫికేషన్‌ జారీ చేసింది.

అయితే, కోవిడ్‌ మహమ్మారి కారణంగా తెలంగాణ సహా పలు రాష్ట్ర్రాల్లో ఎంబీబీఎస్‌ ఇంటర్న్‌షిప్‌ గతేడాది ఆలస్యంగా ప్రారంభమైంది. ఫలితంగా చాలా మంది విద్యార్థులు నీట్‌ పీజీ పరీక్ష రాసేందుకు అనర్హులుగా మారే ముప్పు ఏర్పడింది. తాజాగా, కేంద్రం తీసుకున్న నిర్ణయంతో తెలంగాణలోని దాదాపు 4 వేల మంది విద్యార్థులు సహా పలు రాష్ట్రాల అభ్యర్థులకు ఉపశమనం లభించినట్లయింది. వీరంతా గురువారం నుంచి ఈనెల 12 వరకు నీట్‌ పీజీకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్ష మార్చి 5న జరుగనుంది. మరోవైపు, ఎండీఎస్‌ నీట్‌ రాసేందుకు వీలుగా బీడీఎస్‌ విద్యార్థుల ఇంటర్న్‌షిప్‌ కటాఫ్‌ తేదీని ఈ ఏడాది జూన్‌ 30 వరకు పెంచుతున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement