Monday, April 29, 2024

7 శాతం పెరిగిన హౌస్సింగ్‌ ధరలు

దేశంలో రెసిడెన్షియల్‌ మార్కెట్‌ 2023 జనవరి- మార్చి కాలంలో వృద్ధిని నమోదు చేసింది. ఇందుకు ప్రధానంగా మౌలిక సదుపాయాల వృద్ధి, ప్రభుత్వాల విధానం, భారీగా కొత్త ప్రాజెక్ట్‌ల ప్రారంభం వంటి కారణాలతో నివాస గృహాల ధరలు పెరుగుతున్నాయి. ప్రధానంగా టాప్‌ 14 నగరాల్లో రెసిడెన్షియల్‌ హౌస్సింగ్‌ అమ్మకాలతో పాటు, ధరలు పెరుగుతున్నాయి.
దేశంలో రెసిడెన్షియల్‌ గృహాల అమ్మకాలపై ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టింగ్‌ సంస్థ ప్రాప్‌ ఈక్విటీ ఒక నివేదికను విడుదల చేసింది. ఈ ఆర్ధిక సంవత్సరం జనవరి- మార్చి కాలంలో దేశంలోని టాప్‌ 14 నగరాల్లో హౌస్సింగ్‌ సేల్స్‌ సగటున వార్షిక ప్రాతిపదికన 7 శాతం పెరిగినట్లు తెలిపింది.

ఈ కాలంలో జరిగిన అమ్మకాల్లో పూణే, థాణే, హైదరాబాద్‌ వరసగా అగ్రస్థానంలో ఉన్నాయి. పూణేలో 25,536 యూనిట్ల విక్రయాలు జరిగాయి. మొత్తం అమ్మకాల్లో పూణే అమ్మకాలు 21 శాతంగా ఉన్నాయని నివేదిక తెలిపింది. థాణేలో 24,481 యూనిట్ల విక్రయాలు జరిగాయి. హైదరాబాద్‌లో 17,236 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. మొత్తం14 నగరాల్లో జరిగిన విక్రయాల్లో ఈ మూడు నగరాల వాటా 54 శాతంగా ఉంది.

తగ్గిన కొత్త ప్రాజెక్ట్‌లు…

- Advertisement -

అమ్మకాలు పెరిగినప్పటికీ ఈ కాలంలో కొత్త రెసిడెన్షియల్‌ యూనిట్ల లాంచింగ్‌ మాత్రం తగ్గాయి. ఇది కోవిడ్‌ కాలం నుంచి ఇదే పరిస్థితి ఉంది. అంతకు ముందు ప్రారంభించిన ప్రాజెక్ట్‌లు పూర్తి కావడంతో అమ్మకాలు జరుపుతున్నారు. వార్షిక ప్రాతిపదికన చూస్తే కొత్త ప్రాజెక్ట్‌లు 2023 జనవరి- మార్చి కాలంలో 18 శాతం తగ్గాయి. 2022 జనవరి- మార్చి కాలంలో 1,13,491 కొత్త యూనిట్లు ప్రారంభమైతే, 2023 జనవరి- మార్చి కాలంలో 93,600 యూనిట్లు మాత్రమే ప్రారంభమయ్యాయని ఈ నివేదిక పేర్కొంది. 2022 డిసెంబర్‌ త్రైమాసికంలో 99,019 కొత్త యూనిట్లను లాంచ్‌ చేశారు.

కొత్త రెసిడెన్షియల్‌ ప్రాజెక్ట్‌ లాంచింగ్‌ విషయంలో అన్ని నగరాల కంటే ఫరిదాబాద్‌లో అత్యధికంగా 100 శాతం తగ్గాయి. తరువాత ఘజియాబాద్‌లో 61 శాతం కొత్త ప్రాజెక్ట్‌లు తగ్గాయి. అదే సమయంలో గుర్గావ్‌ లో అత్యధికంగా 560 శాతం కొత్త ప్రాజెక్ట్‌లు ప్రారంభమయ్యాయి. ఈ నగరంలో 9,610 కొత్త ప్రాజెక్ట్‌లు ప్రారంభమయ్యాయి. ఈ తరువాత స్థానంలో ఉన్న చెన్నయ్‌లో 135 శాతం పెరుగుదలతో 6,276 యూనిట్లు ప్రారంభమయ్యాయి.

కొత్త రెసిడెన్షియల్‌ ప్రాజెక్ట్‌లు ప్రారంభం కాకపోవడానికి ప్రస్తుతం ఉన్న మార్కెట్‌ పరిస్థితులు, నిర్మాణంలో జాప్యం వంటి కారణాలు ఉన్నాయని నివేదిక తెలిపింది. వడ్డీ రేట్ల పెంపు, ద్రవ్యోల్బణం వంటి కారణాల మూలంగా అమ్మకాలు అంచనాల కంటే తక్కువగా జరుగుతున్నాయని రియల్‌ ఎస్టేట్‌ రంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ ట్రెండ్‌ రానున్న కాలంలో మారుతుందని, అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని వీరు అభిప్రాయపడ్డారు. ఈ సంవత్సరం జనవరి- మార్చి కాలంలో అమ్మకాల తీరును బట్టి రానున్న త్రైమాసికాల్లో నివాస గృహాలకు డిమాండ్‌ మరింత పెరుగుతుందని ప్రాప్‌ ఈక్విటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సమీర్‌ జసుజా చెప్పారు. ఈ కాలంలో కొత్త ప్రాజెక్ట్‌లు 32 శాతంగా ఉన్నాయని చెప్పారు.

రియల్టి రంగంలో ఉన్న అన్ని సంస్థలు కలిసికట్టుగా పని చేస్తే ఈ రంగంలో పెరుగుతున్న కస్టమర్‌ డిమాండ్‌కు అనుగుణంగా రెసిడెన్షియల్‌ యూనిట్లను అందించవచ్చని సమీర్‌ జసుజా చెప్పారు. 1,23,938 యూనిట్ల అమ్మకాలతో 2023 సంవత్సరం రియల్‌ రంగంలో సరికొత్త బాట వేసిందన్నారు. 2023 మార్చి చివరి నాటికి కొత్త, పాత ప్రాజెక్ట్‌లు కలిపి మొత్తం 5,17,879 యూనిట్లు అందుబాలో ఉన్నాయని నివేదిక తెలిపింది. ఇది గత సంవత్సరంతో పోల్చుకుంటే 14 శాతం అధికం. గతం నుంచి కొనసాగుతున్న యూనిట్లు ఢిల్లిdలో 793, ఫరిదాబాద్‌లో 970 యూనిట్లు అమ్ముడుపోనవి ఉన్నాయి. ఇలా అమ్ముడు కాని ఇళ్లు చెన్నయ్‌లో 32 శాతం, గుర్గావ్‌లో 15 శాతం వరకు ఉన్నాయి. వీటిలో పాత, కొత్తవి కలిసి ఉన్నాయి.

ధరల్లో ఢిల్లి టాప్‌…

ధరల పరంగా చూస్తే ఢిల్లిdలో సరాసరి చదరపు అడుగుకు 22,675 రూపాయలుగా ఉంది. గత సంవత్సరం కంటే ధరలు 13 శాతం పెరిగాయి. ముంబైలో చదరపు అడుగు ధర 21,356 రూపాయలు ఉంది. గుర్గావ్‌లో ధర 42 శాతం పెరిగి చదరపు అడుగుకు 14,000 రూపాయలుగా ఉంది. ఒక్క ఫరిదాబాద్‌ లో మాత్ర ధరలు తగ్గాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ మన దేశంలో మాత్రం రియల్‌ ఎస్టేట్‌ రంగం బలమైన వృద్ధిని నమోదు చేసింది. మధ్య తరగతికి చెందిన ఎక్కువ మంది ఇళ్ల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. వడ్డీ రేట్లు పెరిగినప్పటికీ హౌస్సింగ్‌కు డిమాండ్‌ మాత్రం పెరుగుతున్నది. ప్రభుత్వం మౌలిక సదుపాయలను పెంచుతున్నందున హౌస్సింగ్‌ డిమాండ్‌ మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement