Friday, April 26, 2024

ఓల్డ్‌సిటీలో ఘోరం.. అంద‌రూ చూస్తుండ‌గానే క‌త్తుల‌తో న‌రికేశారు

హైద‌రాబాద్‌లో ఘోరం జ‌రిగింది. ముగ్గురు వ్యక్తులు కత్తులు, వేట కొడవళ్లతో స్వైర విహారం చేశారు. ఓ వ్యక్తిని నడిరోడ్డుపై వెంటాడి, వేటాడి మరీ నరికి చంపారు. ఆదివారం సాయంత్రం అందరూ చూస్తుండగానే పురానాపూల్‌ సమీపంలో జియాగూడ బైపాస్‌ రోడ్డుపై ఈ దారుణ ఘటన జరిగింది. జియాగూడ బైపాస్‌ రోడ్డుపై ఓ వ్యక్తి పరుగెత్తుకుంటూ వెళ్తున్నాడు. అతడిని మరో ముగ్గురు తరుముకుంటూ వచ్చారు. ఒక్కసారిగా చుట్టుముట్టి కత్తులు, వేట కొడవళ్లతో అత్యంత కిరాతకంగా హత్య చేశారు. సమాచారం తెలుసుకున్న కుల్సుంపురా పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.

మృతుడి ఆధార్‌ కార్డు వివరాల ప్రకారం.. కోఠి ఇసమియా బజార్‌కు చెందిన జంగం సాయినాథ్‌గా పోలీసులు గుర్తించారు. సినీఫక్కీలో జరిగిన ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నిందితులు ఎవరు ఎందుకు అతన్ని హత్య చేశారు అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులు హత్య చేసి పక్కనే ఉన్న మూసీ నదిలో దూకి పారిపోయినట్లు స్థానికులు చెప్పారు. ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు కుల్సుంపురా సీఐ అశోక్‌ కుమార్‌ తెలిపారు. హత్య జరిగిన సమయంలో ఘటనా స్థలంలో ఉన్న ఓ వ్యక్తి దూరం నుంచి వీడియో తీశారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. పోలీసుల దర్యాప్తునకు ఈ వీడియో కీలకంగా మారింది…

Advertisement

తాజా వార్తలు

Advertisement