Monday, May 20, 2024

Heavy Rush – తిరుమ‌ల‌లో కొన‌సాగుతున్న ర‌ద్దీ.. 6కిలోమీట‌ర్ల మేర క్యూ లైన్ లు…

తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. పవిత్రమైన పురటాసి మాసంలో రెండో శనివారంతో పాటు వరుస సెలవుల నేపథ్యంలో భక్తులు భారీగా వస్తున్నారు. తిరుపతి, తిరుమలకు వెళ్లే రహదారులు, పార్కింగ్‌ ప్రాంతాలన్నీ భక్తులు, వాహనాలతో నిండిపోయాయి. అలిపిరి నుంచి ఎస్వీ వేద విశ్వవిద్యాలయం వరకు తమిళనాడు నుంచి వచ్చిన బస్సులు నిలిచాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ఒకటి, రెండు కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లలో భక్తులు కిటకిటలాడుతున్నారు. క్యూలైన్లు నందకం విశ్రాంతి భవనం వరకు 5 కిలోమీటర్లకు పైగా విస్తరించాయి. సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు స్వామి దర్శనానికి దాదాపు 48 గంటలు పడుతుందని తితిదే ప్రకటించింది. శనివారం సాయంత్రం 6 గంటల సమయానికి 55వేల మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 34 వేల మంది కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. వసతి దొరక్క చాలామంది ఫుట్‌పాత్‌లపైనే సేద తీరుతున్నారు. రద్దీ దృష్ట్యా గురువారం నుంచి క్యూలైన్లలోని భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు, మజ్జిగ తితిదే అందిస్తోంది. 2500 మంది శ్రీవారి సేవకులు వివిధ షిప్టుల్లో సేవలందిస్తున్నారు.

ఆక్టోపస్‌ భవనం వరకు క్యూ..

తిరుమలలో ఆదివారమూ రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణ గిరి షెడ్లు నిండిపోయి ఆక్టోపస్ భవనం వరకు భక్తులు క్యూలైన్లలో వేచిఉన్నారు. వీరి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని తితిదే ప్రకటించింది. ఈ రద్దీ వల్ల ఈ నెల 1, 7, 8, 14, 15 తేదీల సర్వదర్శనం టైమ్‌స్లాట్‌ టోకెన్ల (ఎస్‌ఎస్‌డీ) జారీని తితిదే రద్దు చేసిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement