Monday, May 6, 2024

‘‘సొంతింటి సంబురం’’.. ఐదు విడతల్లో 70వేల ఇళ్ళ పంపిణీకి సర్కారు నిర్ణయం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్ర రాజధాని శివారు ప్రాంతాల్లో నిర్మాణం పూర్తయిన ‘డబుల్‌ బెడ్‌రూం’ పథకం ఇళ్ళ పంపిణీ ప్రక్రియను వారం, పది రోజుల వ్యవధిలోనే ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తయింది. 5 విడతలుగా మొత్తం 70వేలకు పైగా ఇళ్ళను అర్హులైన పేద కుటుంబాలకు అందజేయనున్నట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి కేటీ రామారావు ప్రకటించారు.

ఇందుకు సంబంధించి బుధవారం ప్రగతి భవన్‌లో నగరం నుచంఇ ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు వివిధ విభాగాల అధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ముఖ్యమంత్రి చేసిన ప్రకటన నేపథ్యంలో డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల పంపిణీ ప్రక్రియను జీహెచ్‌ఎంసీ మరింత వేగవంతం చేసిందని తెలిపారు.

ఇప్పటికే 70 వేలకు పైగా ఇండ్లు నిర్మాణం పూర్తిచేసుకుని పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని, అర్హులైన లబ్ధిదారులకు అందించే కార్యక్రమం వేగంగా నడుస్తుందని అధికారులు మంత్రులకు తెలియజేశారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వెరిఫికేషన్‌ పక్రియ కూడా దాదాపు పూర్తి కావొచ్చిందని తెలిపారు.

- Advertisement -

4500 ఇళ్ళు ఇప్పటికే పంపిణీ పూర్తి

తెలంగాణ ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకొని, వాటిని వేగంగా పూర్తి చేస్తుందని, ఇప్పటికే 75 వేలకు పైగా డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల నిర్మాణం పూర్తి అయిందని మంత్రి కేటీ-ఆర్‌ తెలిపారు. ఇందులో సుమారు 4500కు పైగా ఇళ్లను లబ్ధిదారులకు అందించామని తెలిపారు.

నిర్మాణం పూర్తి చేసుకొని పంపిణీకి సిద్ధంగా ఉన్న సుమారు 70 వేల ఇండ్లను 5 లేదా 6 దశల్లో లబ్దిదారులకు అందిస్తామని తెలిపారు. వచ్చే వారంలోనే తొలి దశ డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తిచేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు మంత్రి కేటీ-ఆర్‌ ఆదేశాలు జారీచేశారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల ప్రక్రియ పంపిణీ పై మంత్రులు పలు సూచనలు చేశారు.

ఎంపికలో రాజకీయ ప్రమేయానికి నో చాన్స్‌

డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల పంపిణీకి సంబంధించి నగర ప్రజలు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారని మంత్రులు తెలిపారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల లబ్ధిదారుల గుర్తింపులో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని పూర్తిగా అధికార యంత్రాంగమే క్షేత్రస్థాయి పరిశీలన పూర్తిచేసి అర్హులను గుర్తిస్తుందని మంత్రులు తెలిపారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల కోసం గుర్తించిన లబ్ధిదారులందరినీ వారికి కేటాయించే ఇండ్ల వద్దనే పంపిణీ కార్యక్రమం ఉండాలని ఈ సందర్భంగా మంత్రులు సూచించారు.

గృహలక్ష్మి పథకానికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక, పథకాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లే విషయాన్ని కూడా మంత్రుల సమావేశంలో చర్చించారు. డబుల్‌ బెడ్రూం ఇండ్ల పంపిణీపై మంత్రి కేటీ-ఆర్‌ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
ఈ సమావేశంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్‌ అలీ, మల్లారెడ్డి, డిప్యూటీ- స్పీకర్‌ పద్మారావు గౌడ్‌, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement