Tuesday, March 19, 2024

Girl Murder – ఎల్జీ సార్ … ఆడ‌ప‌డుచుల‌ను ర‌క్షించండి- అర‌వింద్ కేజ్రివాల్

న్యూఢిల్లీ – దేశ రాజధానిలోఢిల్లీ అందరూ చూస్తుండగానే 16ఏళ్ల బాలికను ఓ యువకుడు అనేకసార్లు పొడిచి చంపడం ఆందోళనకు గురిచేస్తోంది. దీనిపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌తోపాటు ఇతర ప్రముఖులు కూడా స్పందించారు. ఈ ఘటనపై కఠినంగా వ్యవహరించాలని లెఫ్టినెంట్‌ గవర్నర్ వీకే సక్సేనాకు సీఎం కేజ్రీవాల్‌ విజ్ఞప్తి చేశారు. నగరంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత ఎల్జీదేనని స్పష్టం చేశారు. ‘ఢిల్లీలో ఓ 16ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురయ్యింది. ఇది చాలా దురదృష్టకరం. నేరస్థులకు భయం లేకుండా పోయింది. పోలీసులంటే వారికి భయం లేదు. ఎల్జీ సర్‌, శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత మీదే. ఏదైనా చేయండి. ఢిల్లీ పౌరుల భద్రతే గవర్నర్‌ తొలి ప్రాధాన్యం కావాలి’ అని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనాకు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ విజ్ఞప్తి చేశారు.

ఇక ఆప్‌ నేత, మంత్రి అతిషీ కూడా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తీరుపై మండిపడ్డారు. ‘ఢిల్లీ ప్రజలను రక్షించే బాధ్యత రాజ్యాంగం కల్పించిందని లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు గుర్తు చేస్తున్నాను. కానీ, ఆయన సమయం మొత్తం కేజ్రీవాల్‌ పనులను ఆటంకపరిచేందుకే కేటాయిస్తారు. ఢిల్లీ మహిళలకు రక్షణ కల్పించడంపై శద్ధ చూపాలని చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నా’ అని ఆమె ట్వీట్‌ చేశారు.
ఈ ఘటనపై దిల్లీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర పోలీసుల తీరుపై మండిపడ్డారు. దేశ రాజధానిలో చట్టం, పోలీసులు అంటే ఎవరకీ భయం లేకుండా పోయిందన్నారు. ఈ కేసులో చర్యలు తీసుకోకపోతే ఇటువంటి దారుణాలకు అవధుల్లేకుండా పోతాయని హెచ్చరించారు. మరోవైపు ఈ బాలిక హత్యపై భాజపా నేత కపిల్‌ మిశ్రా స్పందిస్తూ.. ‘ఢిల్లీలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. శ్రద్ధా వాకర్‌కు ఇంకా న్యాయం జరగలేదు. ఇటువంటి దారుణాలకు ఎంతమంది శ్రద్ధాలు బాధితులుగా మారుతారో తెలియదు’ అని విచారం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement