Wednesday, May 1, 2024

Delhi | పేద వృద్ధ కళాకారులకు ఆర్థిక సహాయం.. ఎంపీల ప్రశ్నకు సమాధానమిచ్చిన కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశంలో పేద వృద్ధ కళాకారులకు నెలకు రూ. 6,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సోమవారం లోక్‌సభలో ఎంపీలు వైఎస్ అవిశాన్ రెడ్డి (వైఎస్సార్సీపీ), హేమ మాలిని (బీజేపీ), మన్నె శ్రీనివాస్ రెడ్డి (బీఆర్ఎస్), కోమటిరెడ్డి వెంకటరెడ్డి (కాంగ్రెస్) అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చిన కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఈ విషయం వెల్లడించారు. వృద్ధ కళాకారులకు ఆర్థిక సహాయం అందించే పథకాన్ని కేంద్రం అమలు చేస్తోందని, 60 ఏళ్లు దాటి వార్షిక ఆదాయం రూ. 48 వేల లోపు ఉన్నవారికి ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు.

వివిధ కళల్లో విశేష సేవలందించిన కళాకారులు ఈ పథకం కింద సహాయం పొందుతున్నారని వెల్లడించారు. పథకం కింద నెలకు రూ. 6,000 చొప్పున కళాకారులకు కేంద్ర సాంస్కృతిక శాఖ అందజేస్తోందని వెల్లడించారు. ఈ పథకం కింద సహాయం పొందేవారు ప్రతి ఏటా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుందని, అలాగే ప్రతి ఐదేళ్లకు ఓసారి ఆదాయ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ పథకం కింద 2020-21లో రూ. 8.71 కోట్లు ఖర్చు చేయగా.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆ మొత్తం రూ. 18.59 కోట్లకు చేరుకుందని వివరించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement