Thursday, May 2, 2024

సాగర్ ఉపఎన్నిక: ఫీల్డ్ అసిస్టెంట్లు యూటర్న్

నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఈ ఉపఎన్నికల్లో నామినేషన్ వేస్తామని ప్రకటించిన ఫీల్డ్ అసిస్టెంట్ యూనియన్ నేత చింతా కృపాకర్ యూ టర్న్ తీసుకున్నారు. 300 మందితో నామినేషన్ వేస్తామని చింతా కృపాకర్ చేసిన ప్రకటనతో టీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయ్యింది. ఫీల్డ్ అసిస్టెంట్లను బుజ్జగించిన అధిష్టానం తక్కెళ్లపల్లి రవీందర్ రావును దూతగా పంపింది. సీఎంతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రకటించారు.

కాగా, నిడమనూరులోని ఆర్వో కార్యాలయం నుండి నిన్న నామినేషన్ పత్రాలను ఫీల్డ్ అసిస్టెంట్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చింతా కృపాకర్ తీసుకెళ్లారు. ఈనెల 28న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ లతో హాలియాలో బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. 300 ఫీల్డ్ అసిస్టెంట్లతో నామినేషన్ లు వేస్తామని తెలిపారు. తమ సమస్యను ప్రభుత్వానికి తెలియచేయడానికే ఈ నామినేషన్లు వేస్తున్నట్లు పేర్కొన్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement