Friday, May 17, 2024

పండుగలా కాకతీయ వైభవ సప్తాహం.. 7 నుంచి వరంగల్‌ వేదికగా ఉత్సవాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కాకతీయ వైభవ సప్తాహంను పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహిస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఈనెల 7 నుంచి 13వ తేదీ వరకు వరంగల్‌ వేదికగా నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో కాకతీయ సప్తాహం కార్యక్రమాలకు సంబంధించిన బ్రోచర్‌ను పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి మంత్రి కేటీఆర్‌ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకతీయ వైభవ సప్తాహం నిర్వహణ ఏర్పాట్లపై మంత్రి కేటీఆర్‌ సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాకతీయులు ప్రజల కోసం ఎన్నో గొప్ప గొప్ప పనులు చేపట్టారని, వాటిని పరిరక్షించుకోవల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాకతీయ పాలనా విధానం ప్రేరణతో ఆనాటి కాకతీయులు గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్‌ చేపట్టారని తెలిపారు. కాకతీయ వైభవ సప్తాహంను అత్యంత ఘనంగా నిర్వహించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. కాకతీయ వేడుకలకు అవసరమైన ఆర్థిక వనరులను ప్రభుత్వం సమకూరుస్తుందని తెలిపారు. పర్యాటక సాంస్కృతిక శాఖ కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ, మున్సిపల్‌ కార్పోరేషన్ల నుంచి అవసరమైన పనులు ఆయా శాఖల పరిధిలో చేపడతామన్నారు.

రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ భాగస్వామి చేస్తూ కార్యక్రమాలను రూపొందించాలని అన్నారు. వరంగల్‌ నగరంలోని ప్రధాన కూడళ్ళను మొత్తం విద్యుత్‌ దీపాలంకరణ చేయాలని, నిపుణుల చేత కాకతీయ గొలుసుకట్టు చెరువుల నిర్మాణంపై ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు. వందేళ్ళకు ఒకసారి ఇలాంటి సందర్భం వస్తుందని , కాకతీయుల చరిత్రను భావితరాలకు అందించేలా భారీ స్థాయిలో కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. కళాకారులను, కవులను కూడా భాగస్వామ్యం చేయాలని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రముఖ కవులు కళాకారులను ఈ సందర్భంగా సన్మానించే విధంగా కార్యక్రమం చేపట్టానని సూచించారు. కాకతీయ వైభవ సప్తాహం సందర్భంగా ప్రత్యేక పోస్టల్‌ స్టాంపు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వేడుకలకు విస్తృతంగా ప్రచారం కల్పించేలా వరంగల్‌ నగరం అంతా హోర్డింగ్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. డిజిటల్‌ మీడియాను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలన్నారు. కాకతీయ శిల్పకళా వైభవాన్ని తెలిపేలా కాఫీ టేబుల్‌ పుస్తకాన్ని రూపొందించాలని అధికారులను ఆయన ఆదేశించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement