Monday, April 29, 2024

Exclusive | ఢిల్లీలో ఘోరం.. మహిళా సెక్యూరిటీ గార్డ్​పై గ్యాంగ్​ రేప్​!

ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్‌లో దారుణం జరిగింది. హౌసింగ్ సొసైటీలో పనిచేస్తున్న ఓ 19 ఏళ్ల మహిళా సెక్యూరిటీ గార్డు గ్యాంగ్ రేప్​కు గురైంది. ఆ మహిళ అచేతనంగా పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు ఆమెను ఆస్పత్రిలో చేర్చించారు. చికిత్స పొందుతూ ఆమె చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. అయితే ఈ విషయం ఆలస్యంగా బయటికి తెలిసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఈ దారుణం జరిగినట్టు తెలుస్తోంది. ఆ మహిళ పరిస్థితి విషమించడంతో సహోద్యోగులు బాధితురాలిని ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చేర్చారు. సోమవారం ఉదయం ఆమె తుది శ్వాస విడిచింది. ఈ అఘాయిత్యానికి పాల్పడ్డ వ్యక్తిని అజయ్ (32)గా గుర్తించి, అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

కాగా, ఆ మహిళ జార్ఖండ్‌కు చెందినదని, హౌసింగ్ సొసైటీకి సమీపంలో తన అత్తతో కలిసి నివసిస్తోందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. అయితే, సొసైటీలోని బేస్‌మెంట్‌లో ముగ్గురు వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేశారని, ఆ తర్వాత విషం తాగిచగా.. సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చేర్చారని ఆమె కుటుంబం ఆరోపించింది.

మహిళపై సామూహిక అత్యాచారం జరగలేదని పోలీసులు అంటున్నారు. అయినా వారి కుటుంబం ఫిర్యాదు మేరకు అత్యాచారం సెక్షన్ (376 ఐపిసి) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు డిసిపి (రూరల్) వివేక్ చంద్ యాదవ్ తెలిపారు. బేస్‌మెంట్ లోపల అమర్చిన సీసీటీవీ కెమెరాల నుంచి పోలీసులు ఫుటేజీని సేకరించారు. అందులో ఎలాంటి సామూహిక అత్యాచార ఘటన కనిపించలేదని ఆయన చెప్పారు. ఆమె విషం తాగి చనిపోయిందా? ఊపిరితిత్తుల వ్యాధి వల్ల చనిపోయారా? అని నిర్ధారించుకోవడానికి ఆమె విసెరాను ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపినట్లు చంద్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement