Sunday, April 28, 2024

Exclusive – పాలిటిక్స్‌లో కింగ్స్! రాజ‌ కుటుంబాల రాజ‌సం

దేశ రాజకీయాల్లో రాజకుటుంబాల ఆధిపత్యం కొనసాగుతూ వస్తోంది. గతంలో కాంగ్రెస్ నుంచి ఎక్కువ మంది రాజకుటుంబానికి చెందిన వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపించేవారు. ప్రస్తుతం మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యలో రాజకుటుంబానికి చెందిన వ్య్తక్తులు టికెట్ల కోసం బీజేపీకి క్యూ కడుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 12 మంది రాజ‌కుటుంబీకులు రాజ‌కీయాల్లో ఉండ‌గా.. వీరిలో అయిదుగురు కొత్త‌గా బ‌రిలో దిగుతున్న వారున్నారు. మ‌రో ఏడుగురు ఇంత‌కుముందే పాలిటిక్స్‌లో రాణించి మంచి పేరు తెచ్చుకున్నారు.

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కోలహలం మొదలైంది. ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటించాయి.. ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో సినీ రంగంతో పాటు, రాజకుటుంబానికి చెందిన వ్యక్తులకు వివిధ పార్టీలు సీట్లు కేటాయిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ రాజ కుటుంబాలకు చెందిన వారికి అధికంగా టికెట్లు కేటాయించింది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఇప్పటివరకు ప్రకటించిన అభ్యర్థుల్లో 12మంది రాజకుటుంబాలకు చెందిన వారున్నారు. వీరిలో ఐదుగురు తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తుండగా, మరో ఏడుగురు ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నారు.

మైసూర్ రాజకుటుంబం

బీజేపీ మార్చి 13న విడుదల చేసిన రెండో జాబితాలో మైసూర్ లోక్ సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. ఇక్కడ సిట్టింగ్‌ ఎంపీ ప్రతాప్‌ సింహను కాదని, మైసూర్‌ రాజకుటుంబానికి చెందిన యదువీర్‌ కృష్ణదత్‌ చామరాజ వడియార్‌ను రంగంలోకి దించింది. యదువీర్ తాతయ్య శ్రీకంఠదత్త నరసింహరాజ వడియార్ మైసూర్ నుండి నాలుగుసార్లు కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమితో ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం ఆయన మనవడు మైసూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.

- Advertisement -

త్రిపురలో కూడా..

మరోవైపు త్రిపుర తూర్పు లోక్‌సభ స్థానం నుండి సిట్టింగ్ ఎంపీ రేవతికి టికెట్ నిరాకరించిన బీజేపీ.. ఆస్థానంలో కీర్తి సింగ్ దేవ్ వర్మను అభ్యర్థిగా ప్రకటించింది. మాణిక్య రాజ కుటుంబానికి చెందిన కీర్తిసింగ్ దేవ్.. తిప్ర మోతా పార్టీ నేత ప్ర‌ద్యోత్ దేవ్ వ‌ర్మ‌కు అక్క. తిప్ర మోత పార్టీ ఇటీవల ఎన్డీఏ కూటమిలో చేరి ఇప్పుడు త్రిపుర రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. బీజేడీ మాజీ ఎంపీ అర్కా కేశరి దేవ్ భార్య మాళవిక కేశరి దేవ్‌ను బీజేపీ ఒడిశాలో టికెట్ కేటాయించింది. ఆమె కలహండి రాజకుటుంబానికి చెందిన వ్యక్తి. మధ్యప్రదేశ్, ఛ‌త్తీస్‌గ‌ఢ్, మహారాష్ట్రలోనూ బీజేపీ రాజకుటుంబానికి చెందిన వ్యక్తులను బరిలోకి దింపిది. వీరి ప్రభావం ఏ మాత్రం ఉండబోతుందనేది జూన్ 4 ఫలితాలతో తేలనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement