Friday, May 3, 2024

ప్రాణాంతక గ్లైఫోసెట్‌.. కలుపునే కాదు మనుషులనూ చంపుతోంది!

ఎన్‌టీఆర్‌, ప్రభన్యూస్‌ బ్యూరో : అది బహుళజాతి కంపెనీల సత్తా కొన్ని దేశాలు నిషేధిస్తున్నాయి. ఎత్తివేస్తున్నాయి. మన దేశపు పంట పొలాల్లో ఈ కిల్లర్‌ క్రిమినల్‌ ఐదేళ్లుగా అక్రమంగా హల్‌చల్‌ చేస్తున్నా మన పాలకులు నిద్ర నటించారు. కలుపు చస్తుందన్న ఒక్క సంగతి తప్ప అది మన మూలగల్నే పీల్చేస్తోందన్న సంగతి అమాయక రైతులకు తెలియజెప్పకపోవటం వల్ల దీని వాడకం విచ్చలవిడిగా పెరిగింది. కూలీలు లేరు.. ఇదీ లేకపోతే సేద్యం ఎలా ? అనే వరకు వచ్చింది. ఇన్నాళ్లు చలనం లేని ప్రభుత్వాలు ఎట్టకేలకు నిషేధం లాంటి ఆంక్షలు విధించిన నేపధ్యంలో కచ్చతంగా ఏరిపారేయాల్సిన గ్లైసోసెట్‌పై ఆంధ్రప్రభ ఫోకస్‌.

గ్లైఫోసెట్‌పైనే ఎందుకింత రగడ?

ఎందుకంటే ఇది మమూలు కలుపు మందు కాదు. సాధారణ కలుపు మందు అయితే పిచికారీ చేసినప్పుడు ఏయే మొక్కలపై, ఆకులపై పడిందో అవి మాత్రమే ఎండిపోతాయి. ఆ మొక్క మొత్తం నిలువెల్లా ఎండిపోదు. దీన్ని కాంటాక్ట్‌ కెమికల్‌ అంటారు. ఇది అంతర్వాహిక(సిస్టమిక్‌) స్వభావం కలిగినది. అంటే గ్లైఫోసెట్‌ మొక్కలపైన , ఆకుల మీద పడినా చాలు.. దాని కాండం నుంచి పిల్ల వేర్ల వరకు నిలువునా ఎండిపోతుంది. అంటే ఇది చల్లిన పొలంలో మట్టిలోని వానపాములు, సూక్మజీవరాశి కూడా చనిపోతుంది. దీని అవశేషాలు భూగర్భ నీటని, వాగులు, వంకలు, చెరువు నీటిని కూడా కలుషితం చేస్తుంది. గ్లైఫోసెట్‌ పిచికారి చేసే రైతులు ఏమాత్రం పీల్చినా తీవ్ర అనారోగ్యానికి గురవుతారు. మూత్రపిండాలు, కాలేయం, పెద్దపేగులో సూక్మజీవరాశి దెబ్బతింటాయి. కేన్సర్‌ కూడా వచ్చే ప్రమాదం ఉంది. నాడీ వ్యవస్ధ అస్తవ్యస్ధమవుతుంది. రోగనిరోధక శక్తి నశిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

కేన్సర్‌ కారకమని ప్రకటించిన డబ్లూ.హెచ్‌.ఓ

అత్యంత ప్రమాకరమైన వ్యవసాయ పురుగు మందులు, కలుపు మందులుగా ప్రంపంచ ఆరోగ్యసస్ధ ప్రకటించిన 15 రకాల్లో గ్లైఫోసెట్‌ ముఖ్యమైనది. డబ్లూ.హెచ్‌. ఓ అనుబంధ సంస్ధ అయిన అంతర్జాతీయ కేన్సర్‌ పరిశోధనా సంస్థ (ఐఏఆర్‌సీ) తర్జనభర్జనల తరువాత 2017లో ఇది వాడిన చోట కేన్సర్‌ వ్యాపిస్తోందని తేల్చిచెప్పింది. గ్లైఫోసెట్‌పై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేఖత పెరుగుతోంది. అమెరి కాలో మోన్‌శాంటో కంపెనీపై సుమారు 4వేల కేసులు దాఖలయ్యాయి. గ్లైఫోసెట్‌ వల్లనే తమకు కేన్సర్‌ సోకిందని ఆరోపిస్తూ జాన్సన్‌ అనే కార్మికుడు దావా వేశాడు. అయినా కంపెనీల ఒత్తిళ్ల నేపధ్యంలో గ్లైఫోసెట్‌ను పూర్తిగా నిషేధించడానికి ప్రభుత్వాలు తటపటాయిస్తూ నామమాత్రపు ఆంక్షలతో సరిపెడుతున్నాయి.

- Advertisement -

1974 నుంచి మార్కెట్‌లో

కొత్త ఔషధం కనుగొనే ప్రయోగాల్లో అనుకోకుండా గ్లైఫోసెట్‌ 1950లో వెలుగుచూసింది. అయితే ఇది కలుపుమందుగా పనికొస్తుందన్న సంగతి 1970లో బయటపడింది. మోన్‌శాంటో కంపెనీ 1974లో దీన్ని కలుపుమందుగా ప్రపంచవ్యాప్తంగా అమ్మటం మొదలుపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ముఖ్యం గా జన్యుమార్పిడి పంటలు ఎక్కువగా సాగయ్యే దేశాల్లో గ్లఫోసెట్‌ ఎక్కువ వాడుకలో ఉంది. ఇప్పటి వరకు 860 కోట్ల లీటర్లు వాడగా.. గత పదేళ్లలోనే ఇందులో 72శాతం వాడారు. అమెరికా, అర్జెంటీనా, ఐరోపా దేశాలు, ఆస్ట్రేలియా, కొలంబియా, దక్షిణాఫ్రికాతో పాటు భారత్‌, శ్రీలంక దేశాల్లో విరివిగా వాడుతున్నారు. దీని వాడకంపై అమెరికాలోని 18 రాష్ట్రాల్లో కెనడాలోని 8 రాష్ట్రాల్లోఆంక్షలున్నాయి. కొలంబియా, శ్రీలంకల్లో నిషేధం విధించినా తర్వాత తొలగించారు. ఐరోపా యూనియన్‌ కూటమిలోని 9 దేశాలు గ్లైఫోసెట్‌ విక్రయ లైసెన్సులను రెన్యూవల్‌ చేయరాదని నిర్ణయించాయి. మూడేళ్లలో నిషేధిస్తామని ఫ్రాన్స్‌ ప్రకటించగా, సాధ్యమైనంత త్వరగా దీని వాడకం నిలిపివేయాలని నిర్ణయించింది.

తెలుగు రాష్ట్రాల్లో ఏడేళ్లుగా..

పత్తి చేలల్లో కలుపు మందులు చల్లుతూ విషప్రభావంతో నేలకొరిగిన, తీవ్ర అనారోగ్యం పాలైన రైతులు, రైతు కూలీల ఉదంతాలు మహారాష్ట్రలోని యావత్‌మాల్‌ తదితర ప్రాంతాల్లో గత ఏడాది వెల్లువెత్తిన ఉదంతాలతో గ్లైఫోసెట్‌ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తెలుగు రాష్ట్రాల్లో 2013 నుంచి అక్రమంగా సాగులోకి వచ్చిన బీజీ- 3 పత్తి వంగడంతో దీని వినియోగం కూడా పెరుగుతూ వచింది. రెండు మూడేళ్లుగా అక్రమ బీజీ-3 పత్తి తోడై ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో లక్షలాది ఎకరాల నల్లరేగడి భూముల్లో గ్లైఫోసెట్‌ కలుపుమందు విచ్చలవిడిగా మరణమృదంగం మోగిస్తోంది. దీని వాడకంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. మన దేశంలో గ్లైఫోసెట్‌ను తేయాకు తోటల్లో పంటలేని ప్రదేశాల్లోనూ వాడొచ్చని కేంద్ర వ్యవసాయశాఖ అనుమతిచ్చింది. అయితే అధికారుల అలసత్వం వల్ల ఇది బీజీ-3 పత్తితో పాటు సోయా, బత్తాయి, మామిడి తదితర తోటల్లో కూడా కలుపు నివారణకు ఇది వాడుతున్నారు. రైతులు అప్పటికప్పుడు కలుపు బాధ పోతోందన్న సౌలభ్యం చేస్తున్నారే తప్ప దీర్ఘకాలం పాటు అది తెచ్చే చేటును గ్రహించలేకపోతున్నారు. వీరికి అవగాహన కల్పించాల్సిన వ్యవసాయశాఖలు నిమ్మకునీరెత్తినట్టు ఉండటంతో రైతులు ప్రత్యామ్నాయ కలుపు నివారణ పద్ధతుల వైపు దృష్టి సారించలేకపోతున్నారు. కేంద్ర వ్యవసాయశాఖ గ్లైఫోసెట్‌పై పూర్తిస్ధాయి నిషేధం విధించడమే ఈ సమస్యకు పరిష్కారం.

ప్రత్యామ్నాయాలు ఏమిటి?

అయితే రైతులకు ప్రత్యామ్నాయాలు ఏమిటి? అన్నది ప్రశ్న గ్లైఫోసెట్‌ వల్ల పొంచిఉన్న పర్యావరణ సంక్షోభం కేన్సర్‌ తదితర జబ్బుల ముప్పు గురించి ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారోద్యమాన్ని చేపట్టాలి. రైతుల పొలాల్లో, తోటల్లో కలుపుతీతకు ఉపాధి కూలీలను ఉపయోగించేలా కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవాలి. దీనితో పాటు చిన్న, మధ్యతరహా రైతులకు అందుబాటులో ఉండే సులభంగా కలుపు తీసే పరికరాలు, చిన్న తరహా కలుపు యంత్రాలను ప్రభుత్వం విరివిగా అందుబాలోకి తేవాలి.

వచ్చే ఏడాది బీజీ-3తో గ్లైఫోసెట్‌ కూడా పోతోంది

ఈ ఏడాది రాష్ట్రంలో సాగవుతున్న పత్తిలో 85శాతం బీజీ-2 ఉంటుంది. 15 శాతం వరక బీజీ-3 ఉంటుంది. కలుపుమందును తట్టుకొని బీజీ- 3 పత్తి విత్తనాల వల్లనే రైతులు గ్లైఫోసెట్‌ను పిచికారీ చేస్తున్నారు. గ్లైఫోసెట్‌ దాదాపు నిషేధిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కాబట్టి వచ్చే ఏడాది నాటికి బీజీ-3 పత్తి విత్తనాలను కంపెనీలు తయారుచేయవు. గ్లఫోసెట్‌ అం దుబాటులో ఉండదు. రైతులు కూడా కొనరు. కలుపుతీతకు ఎకరానికి రూ 15వేల వరకు ఖర్చవుతుందని, కలుపుమందుతో రూ 2వేలతో పోతుందని అందుకే గ్లైఫోసెట్‌ వాడుతున్నామని రైతులు అంటున్నారు. అయితే ఎకరానికి రూ 4వేలు ఖర్చయినా గుంటకతోనో. ట్రాక్టర్‌తోనో, కూలీలతోనో కలుపు నివారించుకోవాలే తప్ప గ్లైఫోసెట్‌ వంటి ప్రమాదకరమైన కలుపుమందులు వాడకూడదు. వ్యవసాయవర్శిటీ శాస్త్రవేత్తలు సూచించిన వివిధ పద్ధతుల్లోనే రైతులు కలుపు నివారించుకునే ప్రయత్నం చేయడం రైతులకు, పర్యావరణానికి కూడా మంచిది.

బీజీ-3 పత్తిపై ఏడేళ్లుగా నిర్లక్ష్యం

ప్రపంచ ఆహార సంస్థ గె్లఫొసేట్‌ కలుపుమందు వల్ల మనుషులకు కేన్సర్‌ వస్తున్నదని గత ఏడాది నిర్థారించింది. దీన్ని తట్టు-కునే పత్తి హైబ్రిడ్‌ (బీజీ-3) పంట తెలుగు రాష్ట్రాల్లో ఐదేళ్ల క్రితం నుంచే సాగులో ఉంది. 2013 నుంచి అనేక దఫాలు పూర్తి ఆధారాలతో గుంటూరు లో విశ్రాంత వ్యవసాయ అధికారులు ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చారు. పట్టించుకోనందునే గత రెండేళ్లలో లక్షలాది ఎకరాలకు విస్తరించింది. మన దగ్గర పంటల్లో వాడటంతోపాటు-.. కెనడా తదితర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటు-న్న కందిపప్పు, బఠాణీలు, సోయా నూనెలు కలుపుమందులను తట్టు-కునేలా జన్యుమార్పిడి చేసిన పంటలవే. వీటిల్లో గె్లఫొసేట్‌ అవశేషాలు అత్యధిక పరిమాణంలో ఉన్నట్లు- ఇటీ-వల వెలుగులోకి రావడం అత్యంత ఆందోళన కలిగించే విషయం. వీటిని దిగుమతి చేసుకునే ముందే కఠినమైన పరీక్షలు జరిపి అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. జన్యుమార్పిడి ఆహారంపై కచ్చితంగా లేబుల్‌ ముద్రించాలని మన చట్టం చెబుతున్నా పట్టించుకున్న నాధుడు లేడు. మనం గె్లఫొసేట్‌ వాడమని చెప్పలేదు కాబట్టి, దీని వల్ల భూమిలో జీవరాశికి, నీటి వనరులకు, మనుషులు, పశువుల ఆరోగ్యానికి ఎటు-వంటి హాని జరుగుతుందో ప్రభుత్వం కనీస అధ్యయనం కూడా చేయకపోవడం విడ్డూరం. సోయా, నువ్వు పంటలను నూర్పిడి చేయడంలో సౌలభ్యం కోసం కూడా పంటపైనే గె్లఫొసేట్‌ పిచికారీ(డెస్సికేషన్‌) చేస్తున్నారు. ప్రజారోగ్యంపై ఈ అవశేషాల ప్రభావం ఏమిటన్నది ఆందోళనకరం.

Advertisement

తాజా వార్తలు

Advertisement