Sunday, April 28, 2024

TS | కేసీఆర్‌‌కు ఈసీ నోటీసులు.. వివరణ ఇవ్వాలని ఆదేశం

హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏప్రిల్ 5న సిరిసిల్లలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరుష పదాలతో చేసిన కామెంట్లను సీరియస్‌గా తీసుకున్న కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఆయనకు మంగళవారం నోటీసులు జారీచేసింది. పార్టీ అధినేతగా, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని, అందుకు తగిన ప్రాథమిక ఆధారాలను కమిషన్ పరిశీలించిందని ఈసీ ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

ఈ నోటీసుకు గురువారం (ఏప్రిల్ 18) ఉదయం 11 గంటలకల్లా కమిషన్‌కు చేరేలా వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారితో పాటు సిరిసిల్ల జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ నుంచి వాస్తవాలతో కూడిన రిపోర్టును తెప్పించుకున్న తర్వాత ఈ నోటీసు జారీ చేయాల్సి వచ్చిందని అవినాశ్ కుమార్ పేర్కొన్నారు.

పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ నుంచి ఈ నెల 6న ఫిర్యాదు వచ్చిందని, అందులో సిరిసిల్లలో కేసీఆర్ చేసిన పరుష వ్యాఖ్యలను ప్రస్తావించారని, దీనిమీద రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఈ నెల 9న లేఖ రాశామని, ఆయన నుంచి 10వ తేదీన వివరణ వచ్చిందని అవినాశ్ కుమార్ ప్రస్తావించారు. దీనికి తోడు సిరిసిల్ల జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ నుంచి కూడా ఈ నెల 10న వచ్చిన రిప్లైలో కేసీఆర్ ఈ నెల 5న సిరిసిల్లలో చేసిన కామెంట్లకు సంబంధించి కొన్ని వాస్తవాలను ఉదహరించారని ఈ నోటీసులో పేర్కొన్నారు.

జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ పేర్కొన్న రిపోర్టులో కేసీఆర్ చేసిన పరుష పదాలతో కూడిన కామెంట్లలో కొన్ని ఇలా ఉన్నాయి. ఈ కామెంట్లన్నీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిలోని పార్ట్-1లోని ఒకటో భాగంలోని నిబంధనలను ఉల్లంఘించడమేనని ఈసీ ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాశ్ పేర్కొన్నారు.

గతేడాది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అక్టోబరు 30న బాన్సువాడలో జరిగిన ఎన్నికల ప్రచార సభలోనూ ఇలాంటి పరుష కామెంట్లు చేసి కోడ్ నిబంధనలను ఉల్లంఘించారని గుర్తుచేశారు. రాజకీయ నాయకులు వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి కామెంట్లు చేయరాదని, ప్రత్యర్థి పార్టీ నాయకుల, అభ్యర్థుల ఇమేజ్‌ను దెబ్బతీసేలా వ్యాఖ్యానాలు చేయరాదంటూ ఈ ఏడాది జనరి 2న మార్చి 1న స్పష్టంగా లేఖలు రాసిన రిపీట్ అవుతున్నట్లు అవినాశ్ పేర్కొన్నారు.

- Advertisement -

కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా ఎన్నికల ప్రదానాధికారి నుంచి, జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ నుంచి వచ్చిన వివరణలతో కమిషన్ ఏకీభవిస్తున్నదని, కోడ్ ఉల్లంఘనలకు కేసీఆర్ పాల్పడిందనే నిర్ధారణకు వచ్చామని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. వీటికి తగిన సమాధానం ఇవ్వడానికి గడువు ఇస్తున్నామని, ఏప్రిల్ 18న ఉదయం 11 గంటలకల్లా కమిషన్‌కు చేరేలా రిప్లై ఇవ్వాలని ఆ నోటీసులో అవినాశ్ కుమార్ స్పష్టం చేశారు.

  • “నిరోధ్‌లు, పాపడాలు అమ్ముకుని బతకాలంటూ కాంగ్రెస్ నాయకుడొకరు సలహా ఇస్తున్నారు” అని ప్రస్తావించి “కుక్కల కొడుకుల్లారా”… అంటూ కేసీఆర్ కామెంట్ చేశారు.
  • సాగు, తాగునీటి సమస్యల గురించి కేసీఆర్ ప్రస్తావిస్తూ… “ఈ పరిస్థితికి కారణం నీటి సామర్ధ్యం గురించి కూడా తెలియని లతుకోరులే. చవట, దద్దమ్మల పాలన వల్లనే ఈ పరిస్థితి దాపురించింది”
  • “ఇది లతుకోరు గవర్నమెంటు… కేవలం 1.8% ఓట్ల మెజారిటీతోనే గెలిచింది… పచ్చి అబద్ధాలతో అధికారంలోకి వచ్చింది…”
  • “ప్రభుత్వంలో ఉన్న పక్కా చవటలు, దద్దమ్మలు, చేతకాని చవటలు…” అంటూ అధికార కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ కామెంట్స్ చేశారు.
  • రైతులకు వరి ధాన్యం కోనుగోలుపై క్వింటాల్‌కు రసూ. 500 చొప్పన బోనస్ ఇచ్చే అంశాన్ని కేసీఆర్ ప్రస్తావిస్తూ… “మీరు బోనస్ ఇవ్వడంలో ఫెయిల్ అయితే మీ గొంతుల్ని కోసేస్తాం.. చంపేస్తాం”.. అని వ్యాఖ్యానించారు
Advertisement

తాజా వార్తలు

Advertisement