Monday, May 6, 2024

తెలంగాణ జోలికి రావొద్దు.. సజ్జలపై బీజేపీ ఎంపీ అరవింద్ ఫైర్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను మళ్లీ కలిపే అవకాశం ఉంటే అందుకు ప్రయత్నాలు చేస్తామంటూ వైఎస్సార్సీపీ నేత, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ (నిజామాబాద్) ధర్మపురి అరవింద్ తీవ్రంగా స్పందించారు. అంతగా మళ్లీ కలవాలనుకుంటే పాత మద్రాస్ ప్రావిన్సులో భాగమైన తమిళనాడుతో కలవండి అంటూ సజ్జలకు సూచించారు. అంతే తప్ప తెలంగాణ జోలికి రావొద్దని వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యక్తిని ఎందుకు సలహాదారుడిగా పెట్టుకున్నారంటూ ఆయన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్‌లో శుక్రవారం మధ్యాహ్నం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తక్షణమే జగన్ తన సలహాదారుణ్ణి మార్చుకోవాలని సూచించారు.

లిక్కర్ దందా కోసం వేల కోట్లు.. పేదలకు ఇచ్చేందుకు మాత్రం డబ్బు లేదు

ఉపాధి హామీ పథకం నిధులను కాళేశ్వరం ప్రాజెక్టు కోసం మళ్లించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి నోటీసులు అందుకోవడం సిగ్గుచేటని ఎంపీ అరవింద్ అన్నారు. మద్యం వ్యాపారం కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు కానీ పేదలకు ఇచ్చేందుకు మాత్రం నిధుల్లేవని ఆయన ఎద్దేవా చేశారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లైన్‌కు శంఖుస్థాపన చేయడంపై స్పందిస్తూ.. 2013లోనే మెట్రో లైన్ నిర్మిస్తానని చెప్పి ఇప్పుడు శంఖుస్థాపన చేస్తున్నారని విమర్శించారు. మరోవైపు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం సాధించిందని, ఇందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అనుసరించిన పేదల అనుకూల విధానాలే కారణమని అరవింద్ సూత్రీకరించారు. కోవిడ్-19 సమయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసిందని, కానీ ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందించారని అన్నారు.

- Advertisement -

అలాగే ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందిస్తామంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్ భగీరథ’ ఇప్పటికీ పూర్తికాలేదని, కానీ కేంద్ర ప్రభుత్వం ‘హర్ ఘర్ జల్’ పథకం ద్వారా దేశంలో 50 శాతం పేదలకు నీటిని అందజేస్తోందని అన్నారు. కేంద్రపాలిత ప్రాంతాల్లో 90 శాతం జనాభాకు తాగునీరు పైప్ లైన్ల ద్వారా ఇంటికి చేరుతుందని తెలిపారు. పేదలకు జన్‌ధన్ ఖాతాల ద్వారా సంక్షేమ ఫలాలు నేరుగా అందజేస్తున్నామని, తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం లిక్కర్ కుంభకోణం, ఫీనిక్స్ కుంభకోణంతో తన కుటుంబ సంక్షేమం కోసం చూసుకుంటున్నారని అన్నారు. ప్రధాని మోడీ 24 దేశాలకు వ్యాక్సిన్ పంపితే కేసీఆర్ రూ. 24 వేల కోట్ల అవినీతి సొమ్ము విదేశాల్లో దాచుకున్నారని ఆరోపించారు. మరో 9 నెలల్లో కేసీఆర్ గద్దె దిగడం ఖాయమని ఆయనన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ గురించి మాట్లాడుతూ ఆ పార్టీ స్విగ్గీ లాంటిదని, ఏ రోజు ఏది అవసరమో అదే ఇస్తారు తప్ప ఒక సిద్ధాంతం, అజెండా లేని పార్టీ అని అరవింద్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement