Monday, April 29, 2024

కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించలేదు: ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఈడీ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈడీ పిటిషన్‌పై ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ కౌంటర్‌ దాఖలు చేశారు. ఈడీ కోరిన విధంగా మార్చి 21 న 828 పేజీలలో కేసు దర్యాప్తునకు సంబంధించిన పూర్తి వివరాలను ఇచ్చామని కోర్టుకు తెలిపారు. కోర్టులకు సమర్పించిన డిజిటల్‌ సాక్ష్యాల వివరాలు కూడా అందించామని పేర్కొన్నారు. కెల్విన్‌ కేసులో సేకరించిన వాట్సప్‌ స్క్రీన్‌ షాట్‌లు ఈడీకి అప్పగించామని, దర్యాప్తు అధికారులు నిందితుల కాల్‌డేటా రికార్డులు సేకరించలేదని వివరించారు. కెల్విన్‌ కేసులో సిట్‌ సేకరించిన 12 మంది కాల్‌ డేటా ఈడీకి ఇచ్చామని, వారి విచారణకు సంబంధించిన వీడియో రికార్డులు కూడా ఇవ్వడం జరిగిందన్నారు.

హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించాలన్న ఉద్దేశ్యం ఏ మాత్రం లేదని, పాలనాపరమైన కారణాల వల్ల ఈడీకి సమాచారం ఇవ్వడం కొంత ఆలస్యమైందని వివరణ ఇచ్చారు. హైకోర్టు ఆదేశాలను అమలు చేయడంలో కొంత ఆలస్యమైనందున బేషరతుగా క్షమాపణలు చెబుతున్నామన్నారు. ఈడీ విచారణకు సహకరించేందుకు సిద్దంగా ఉన్నామని తెలుపుతూ కోర్టు ధిక్కరణ కేసును కొట్టెయ్యాలని సర్ఫరాజ్‌ అహ్మద్‌ కోర్టును అభ్యర్థించారు. మరోవైపు తాము దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై వాదనలకు ఈడీ సమయం కోరింది. ఎక్సైజ్‌ శాఖ వివరాలు హైకోర్టు ఆదేశాల మేరకు ఉన్నాయా? లేవా అన్నది పరిశీలించాలని కోరింది. ఈ పిటిషన్‌పై విచారణను వేసవి సెలవుల అనంతరం చేపడతామని హైకోర్టు వెల్లడించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement