Thursday, May 2, 2024

Delhi | పర్యావరణంతోపాటు ప‌ర్యాట‌క‌ అభివృద్ధి.. సామాన్యులకు చేరువ‌గా క్రూయిజ్ టూరిజం: కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: సామాన్యులకు అందుబాటులోకి క్రూయిజ్ టూరిజంను తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం కృషిచేస్తోందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంతోపాటు, ప్లాస్టిక్ వ్యర్థాలను రీయూజ్, రీసైకిల్ చేయడం ద్వారా పర్యావరణానికి మరింత హాని కాకుండా కాపాడవచ్చని పేర్కొన్నారు. భారతదేశపు పర్యాటక రంగాన్ని ప్రపంచలో అత్యుత్తమ  పర్యాటక దేశంలో మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తోందన్నారు. సాంస్కృతిక, భాషా వైవిధ్యత భారతదేశ పర్యాటకానికి బలమని ఆయన అన్నారు.

గోవాలో మంగళవారం (20 జూన్) నుంచి ప్రారంభం కానున్న జీ20 పర్యాటక మంత్రుల స్థాయి సమావేశాల సైడ్ ఈవెంట్ సందర్భంగా సోమవారం జరిగిన ‘మేకింగ్ క్రూయిజ్ టూరిజం మోడల్ ఫర్ సస్టేనబుల్ అండ్ రెస్పాన్సిబుల్ ట్రావెల్’, ‘టువర్డ్స్ ఎ సర్క్యులర్  ఎకానమీ ఆఫ్ ప్లాస్టిక్ ఇన్ టూరిజం – ద గ్లోబల్ టూరిజం ప్లాస్టిక్ ఇనిషియేటివ్’ అంశాలపై రెండు వేర్వేరు చర్చలను కేంద్రమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  భారతదేశంలో  పర్యాటకాభివృద్ధికి ఉన్న విస్తృత అవకాశాలను, మరీ ముఖ్యంగా అంతర్జాతీయంగా పర్యాటకులను ఆకర్శిస్తున్న క్రూయిజ్ టూరిజం అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.

7,500 కి.మీ పొడవైన తీరప్రాంతం, నిత్యం ప్రవహించే జీవనదులు భారతదేశంలో క్రూయిజ్ టూరిజాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అన్ని చేపడుతున్నామన్నారు. గంగానది ప్రక్షాళన, ఇతర నదుల పరిసర ప్రాంతాల్లోనూ స్వచ్చతను ప్రోత్సహించే కార్యక్రమాలు వేగవంతంగా సాగుతున్నాయన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో క్రూయిజ్ టూరిజాన్ని ప్రోత్సహించేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టామన్నారు.

- Advertisement -

ప్లాస్టిక్ వినియోగం వల్ల వాతావరణంలో వస్తున్న మార్పులు, దీని కారణంగా పర్యాటకంపై పడుతున్న ప్రభావంపై తదితర అంశాలపైనా కిషన్ రెడ్డి స్పందించారు. అథర్వణ వేదంలో పర్యావరణ పరిరక్షణ గురించి పేర్కొన్న ‘భూమండలం మన తల్లి.. మనమంతా ఆమె బిడ్డలం’ అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ దృష్టిలో ఉంచుకుని.. భూమాతను, పర్యావరణాన్ని కాపాడేందుకు కంకణబద్దులు కావాలన్నారు. అన్ని దేశాలు ఈ దిశగా కృషిచేస్తే.. పర్యావరణ పరిరక్షణతోపాటు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను నిర్ణీత సమయం కంటే ముందే చేరుకోవడం సాధ్యమవుతుందన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా తలెత్తుతున్న సమస్యలను ప్రస్తావిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఉందని.. అన్ని దేశాలు చర్చించి ఓ స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్లేందుకు ఈ సమావేశాలు ఉపయోగపడతాయన్నారు.

మంగళవారం నుంచి మూడ్రోజుల పాటు గోవాలో జరగనున్న జీ20, సభ్యదేశాల పర్యాటక  మంత్రుల సమావేశంలో తీసుకునే ‘గోవా రోడ్ మ్యాప్’ ఆధారంగానే తదుపరి కార్యాచరణ ఉంటుందన్నారు. వివిధ దేశాలు వాతావరణ మార్పులపై ఏం చేయాలనే దానిపై ఆలోచిస్తున్న సమయంలోనే.. భారతదేశం అనుకున్న లక్ష్యాలను చేరుకునే దిశగా ముందుకెళ్తోందన్నారు. గోవా రోడ్‌ మ్యాప్‌ను వచ్చే ఏడాది జీ20 సమావేశాలు జరిగే బ్రెజిల్‌లో చర్చిస్తారన్నారు.

ఇవాళ భారతదేశం 4వ అతిపెద్ద క్లీన్ ఎనర్జీ సామర్థ్య కేంద్రంగా, 4వ అతిపెద్ద పవన విద్యుత్ సామర్థ్య దేశంగా, 5వ అతిపెద్ద సౌర విద్యుత్ సామర్థ్య దేశంగా ఉందని.. దీనికి ఈ 9 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న చొరవే కారణమన్నారు. అనంతరం..ఒమన్ పర్యాటక మంత్రి సలీమ్ బిన్ మహమ్మద్, ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ సెక్రటరీ జనరల్ జురాబ్ పోలోలీ కశ్విలీతో ద్వైపాక్షిక సమావేశాల్లో కేంద్ర మంత్రి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement