Friday, May 3, 2024

Breaking | ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం కేజ్రివాల్ అరెస్ట్..

ఢిల్లీ లిక్కర్ కేసులో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్-(ఈడీ) అధికారులు గురువారం రాత్రి 9 గంటల సమయంలో ఆయన నివాసంలో అరెస్టు చేశారు. ఈ కేసులో విచారణకు హాజరుకావాలని ఇప్పటి వరకు కేజ్రీవాల్‌కు ఈడీ అధికారులు తొమ్మిదిసార్లు సమన్లు ​​జారీ చేసినా ఆయన హాజరుకాలేదు. దీంతో ఇవాళ సాయంత్రం నుంచి కేజ్రీవాల్ ఇంట్లో ఈడీ అధికారుల బృందం సోదాలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో సోదాలు పూర్తి చేసి కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు.

ఢిల్లీ లిక్క‌ర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ని అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది. కోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈడీ అధికారులు కేజ్రీవాల్ నివాసంలో సోదాలు నిర్వహించి.. రాత్రి ఆయ‌న నివాసంలో భారీ పోలీసులు మోహరించి అరెస్టు చేశారు.

ఈ కేసులో అరెస్టైన నాలుగో ఆప్ నేత కేజ్రీవాల్, ఆయన కన్నా ముందు ఆ పార్టీకి చెందిన సత్యేందర్ జైన్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ అరెస్ట్ అయ్యారు.

ఈ కేసులో కీలక పరిణామాలు

- Advertisement -

:* నవంబర్ 2021: ఢిల్లీ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీని అమలులోకి తెచ్చింది.

* జూలై 8 2022: ఢిల్లీ చీఫ్ సెక్రటరీ పాలసీలోని ఉల్లంఘనలను లెఫ్టినెంట్ గవర్నర్‌కి నివేదించారు.

* జూలై 22, 2022: ఈ పాలసీపై సీబీఐ విచారణకు లెఫ్టినెంట్ గవర్నర్ సిఫారసు.

* ఆగస్టు 19, 2022: అప్పటి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు ముగ్గురిపై సీబీఐ దాడులు.

* ఆగస్ట్ 22, 2022: లిక్కర్ పాలసీపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు.

* సెప్టెంబర్, 2022: ఆప్ కమ్యూనికేషన్ హెడ్ విజయ్ నాయర్‌ని అరెస్ట్ చేసిన సీబీఐ.

* మార్చి 2023: డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసిన ఈడీ

* అక్టోబర్ 2023: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కి ఈడీ తొలి సమన్లు.

* మార్చి 16, 2024: బీఆర్ఎస్ నేత కవితని అరెస్ట్ చేసిన ఈడీ

.* మార్చి 21, 2024: ఢిల్లీ మద్యం కేసులో 9 సార్లు ఈడీ సమన్లకు హాజరుకానీ సీఎం కేజ్రీవాల్. రక్షణ కల్పించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరణ. కేజ్రీవాల్ ఇంటిలో ఈడీ సోదాలు, అరెస్ట్

Advertisement

తాజా వార్తలు

Advertisement