Friday, April 26, 2024

ఎస్‌ఏ-1 పరీక్షల షెడ్యూల్లో మళ్లీ మార్పులు.. నల్గొండ, యాదాద్రి జిల్లాలో వచ్చేనెల 9 నుంచి పరీక్షలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఒకటి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు రాసే సమ్మేటివ్‌ అస్సెస్‌మెంట్‌ (ఎస్‌ఏ-1) పరీక్షల షెడ్యూల్‌ మళ్లి మారింది. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో నల్గొండ జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లాల పరీక్ష షెడ్యూల్‌ను మార్చుతూ పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ముందస్తు షెడ్యూల్‌ ప్రకారమైతే నవంబర్‌ 1 నుంచి 7వ తేదీ వరకు పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ ఉప ఎన్నిక కారణంగా ఆ రెండు జిల్లాల్లో మాత్రం నవంబర్‌ 9వ తేదీ నుంచి 16వ తేదీ వరకు జరగనున్నట్లు ఆమె ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇలా షెడ్యూల్‌ మారడం ఇది రెండో సారి. ముందు ఆరు పేపర్లు మాత్రమే ఉంటాయని చెప్పిన అధికారులు ఆ తర్వాత 11 పేపర్లే ఉంటాయని ఉత్తర్వుల్లో జారీ చేశారు. తాజాగా మళ్లిప్పుడు రెండు జిల్లాల పరీక్ష షెడ్యూల్‌ను మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. ముందస్తుగా జిల్లా విద్యాధికారుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా నిర్ణయాలు తీసుకోవడంవల్లనే ఈ విధమైన మార్పులు జరుగుతున్నట్లు విద్యా వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement