Friday, May 3, 2024

ప్రాణం తీసిన క్యారమ్స్‌.. ఆటలో ఓడిపోయానని బాలుడి ఆత్మహత్య

కామేపల్లి, ప్రభన్యూస్‌: సరదాగా అక్కలతో కలిసి ఆడుతున్న క్యారమ్స్ ఆటలో ఓడిపోయినందుకు బాలుడు మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం అడవిమద్దులపల్లిలో చోటుచేసుకుంది. అడవిమద్దులపల్లి గ్రామానికి చెందిన భానోతు వెంకన్నకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. గత రెండు సంవత్సరాల క్రితం వెంకన్న రహదారి ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడు ప్రభుత్వ విద్యుత్‌ శాఖలో పనిచేస్తూ మరణించడంతో వెంకన్న భార్యకు ఉద్యోగం ఇచ్చారు. అయితే రోజువారి దినచర్యలో భాగంగా తల్లి ఉద్యోగానికి వెళ్ళగా ఇద్దరు అక్కలతో కలిసి భానోత్‌ గోపి (11) క్యారంబోర్డు ఆడాడు.

రెండు మూడుసార్లు గేమ్‌లో ఓడిపోవడంతో చీర తీసుకొని ఇంట్లోకి వెళ్లి మరోసారి వచ్చి క్యారం బోర్డ్‌ ఆట ఆడాడు. మళ్లీ అక్కల చేతుల్లో ఓడిపోవడంతో మనస్థాపం చెంది ఇంటి వెనకాల కిటికీకి చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుర్తించిన అక్కలు చుట్టుపక్కల వారిని పిలిచి రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం శూన్యమైంది. ఈ విషయం తన తల్లికి అందించగా ఆమె ఒక్కగాని ఒక్క కొడుకు మృతి చెందడంతో సృహతప్పి పడిపోయింది. చిన్నారులు గేమ్స్‌కి బానిసలు కావద్దని, ఆటను స్పిరిట్‌తో తీసుకొని ముందుకు వెళ్లాలే తప్ప ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని గ్రామస్తులు పేర్కొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement