Friday, April 19, 2024

తెలంగాణలో క్యాపిటాలాండ్‌ పెట్టుబడులు, 1200 కోట్లతో డేటా సెంటర్‌ ఏర్పాటు.. స్వాగతించిన మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణలో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు క్యాపిటాలాండ్‌ కంపెనీ ముందుకు వచ్చింది. 6,200 కోట్ల రూపాయలతో తన పెట్టుబడి ప్రణాళికలను కంపెనీ మంగళవారం ప్రకటించింది. 6,200 కోట్ల రూపాయల పెట్టుబడిలో…. ఒక డేటా సెంటర్‌ ఏర్పాటు చేయడంతో పాటు హైదరాబాద్‌ నగరంలో ఉన్న తన కార్యకలాపాలను మరింత విస్తరించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ సమక్షంలో కంపెనీ ప్రతినిధులు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. రూ.1,200 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌ మాదాపూర్‌లోని క్లైంట్‌ ఇంటర్నేషనల్‌ టెక్‌ పార్క్‌లో క్యాపిటల్యాండ్‌ ఇండియా ట్రస్ట్‌ ఈ డేటా సెంటర్‌ ఏర్పాటు చేయనుంది. 2,50,000 చదరపు అడుగుల విస్తీర్ణం, 36 మెగావాట్ల విద్యుత్‌ సామర్థ్యం కలిగి ఉండే ఈ డేటా సెంటర్‌ 5 సంవత్సరాల తరువాత పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్‌ నగరంలో తమకున్న సుమారు 6 మిలియన్‌ చదరపు అడుగుల ఆఫీస్‌ విస్తీర్ణాన్ని రెట్టింపు చేసేందుకు రానున్న ఐదు సంవత్సరాలలో మరో 5 వేల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనున్నట్లు కంపెనీ తెలిపింది.

భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న డేటా సెంటర్‌ మార్కెట్‌లలో హైదరాబాద్‌ ఒకటని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే. తారకరామారావు అన్నారు. మానవ భవిష్యత్తును మరింత మెరుగుపరచడంలో డేటానే కీలక పాత్ర పోషించబోతుందన్నారు. క్యాపిట లాండ్‌ ఇండియా ట్రస్ట్‌తో కలిసి తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోతున్న డేటా సెంటర్‌ తెలంగాణలో క్యాపిటలాండ్‌ పెట్టుబడులు పెడుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్‌లో రోజురోజుకు డెవలప్‌ అవుతున్న ఒి పరిశ్రమ అవసరాలు ఈ డేటా సెంటర్‌ తో తీరుతాయన్నారు. ఇంతేకాకుండా ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల విషయంలోనూ క్యాపిటలాండ్‌తో కలిసి తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

నవీ ముంబైకి చెందిన గ్రీన్‌ఫీల్డ్‌ డేటా సెంటర్‌ డెవలప్‌మెంట్‌ సైట్‌ కొనుగోలుతో 2021 లో ఇండియన్‌ డేటా సెంటర్‌ మార్కెట్‌లోకి తమ కంపెనీ ప్రవేశించిందన్నారు. ఇప్పుడు హైదరాబాద్‌లో ఏర్పాటుచేస్తున్న డేటా సెంటర్‌ రెండవదన్నారు. తెలంగాణలో ఉన్న వ్యాపార అనుకూల వాతావరణం కారణంగానే తాము ఇక్కడ పెట్టుబడి పెడుతున్నామని తెలిపారు. ఆసియా,యూరప్‌ లో ఉన్న 25 డేటా సెంటర్‌లతో గత కొన్ని సంవత్సరాలుగా డేటా సెంటర్‌ డిజైన్‌, అభివృద్ధి, నిర్వహణ లో తాము మిగతా వారి కంటే ఎంతో ముందున్నామని క్యాపిటాలాండ్‌ ప్రైవేట్‌ ఈక్విటీ ఆల్టర్నేటివ్‌ అసెట్స్‌, రియల్‌ అసెట్స్‌ సీఈఓ పాట్రిక్‌ బూకాక్‌ అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలనుకున్న తమ ప్రణాళికలో భాగంగా క్యాపిటాల్యాండ్‌ ఇండియా ట్రస్ట్‌తో కలిసి ఇండియాలో రెండవ డేటా సెంటర్‌ ప్రాజెక్ట్‌ను ప్రారంభించినందుకు సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్‌ లో ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్‌ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉంటుందన్నారు. డేటా రంగంలో ఇండియాలో నెంబర్‌ వన్‌గా నిలవాలన్న తమ ఆకాంక్షలకు అనుగుణంగా హైదరాబాద్‌ సెంటర్‌ ఉంటుందన్నారు. ఈ ఎంఓయూ కుదుర్చుకునే కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్‌ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement