Thursday, May 2, 2024

పెళ్లి ఇంట రక్త సింధూరం – పిల్లను ఇవ్వ లేదని వధువు తండ్రి హతం

కేరళలో పెళ్లి ఇంట దారుణం చోటుచేసుకుంది. వధువు తండ్రిని పక్కింటి యువకుడు తన సోదరుడు, స్నేహితులతో కలిసి తీవ్రంగా దాడి చేసి హతమార్చాడు..పెళ్లికి ముందు రోజు రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. తన కుమార్తెను ఇచ్చి వివాహం చేసేందుకు అంగీకరించలేదన్న కక్షతోనే అతడు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు మృతుడి బంధువులు తెలిపారు. తిరువనంతపురం జిల్లాలోని కల్లంబలంకు చెందిన రాజు(61) కుమార్తె వివాహం బుధవారం ఉదయం జరగాల్సి ఉంది. మంగళవారం రాత్రి అతడి పక్కింట్లో నివసించే జిష్ణు తన సోదరుడు జిజిన్‌, మరో ఇద్దరు స్నేహితులతో కలసి రాజు ఇంటికి వచ్చి గొడవపడ్డారు.

ఈ క్రమంలో రాజు భార్యను, కుమార్తెను చిదకబాదారు. అడ్డుకోవడానికి యత్నించిన రాజు తలపై పారతో పలుమార్లు మోదారు. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. జిష్ణు రెండేళ్ల కిందట రాజు కుమార్తెను వివాహం చేసుకుంటానని అడిగాడు.అందుకు రాజు అంగీకరించలేదు. దీంతో అప్పటి నుంచి రాజుపై జిష్ణు కక్ష పెంచుకున్నాడు. నిందితుడికి నేరచరిత్ర ఉందని.. అందుకే రాజు తన కుమార్తెను అతడికి ఇచ్చి వివాహం చేసేందుకు అంగీకరించలేదని మృతుడి బంధువు ఒకరు తెలిపారు. నలుగురు నిందితులనూ పోలీసులు అరెస్ట్‌ చేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement