Thursday, April 18, 2024

మా కూటమిలో చిచ్చు పెడుతూ మాపైనే నిందలా? టీడీపీ నేతల వ్యాఖ్యలపై మండిపడ్డ జీవీఎల్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: బీజేపీ-జనసేన కూటమి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఎదురు తమపై నిందలు మోపుతున్నారని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవద్దంటూ జనసేన పార్టీని బీజేపీ బెదిరిస్తోందన్న పితాని సత్యనారాయణ వ్యాఖ్యలపై ఎంపీ జీవీఎల్ నరసింహారావు తీవ్రంగా స్పందించారు. ఓవైపు తమతో పొత్తు కోసం తహతహలాడుతూ మరోవైపు తమపైనే దుష్ప్రచారానికి తెగబడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ-జనసేన కూటమిపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ ముందు క్షమాపణ చెప్పాలని జీవీఎల్ డిమాండ్ చేశారు.

వచ్చే ఎన్నికల్లో ఓటమి భయం వారిని వెంటాడుతోందని, అందుకే తమ కూటమిలో చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఎదురుదాడి చేశారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీని గద్దె దించి బీజేపీ-జనసేన కూటమి అధికారం చేపట్టాలన్నదే తమ లక్ష్యమని, నిజానికి తెలుగుదేశం పార్టీ కంటే కూడా అసలైన ప్రతిపక్ష పాత్రను తాము పోషిస్తున్నామని తెలిపారు. ఓవైపు బీజేపీతో పొత్తు కోరుకుంటూనే.. మరోవైపు బీజేపీలో ముఖ్యనేతలను తెలుగుదేశం పార్టీ లాక్కుంటోందని జీవీఎల్ ఆరోపించారు. వైఎస్సార్సీపీ అవినీతిని, దుర్మార్గాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రత్యామ్నాయంగా ఎదగాలని బీజేపీ ప్రయత్నిస్తోందని, తమతో జనసేన మూడేళ్లుగా భాగస్వామిగా కొనసాగుతోందని జీవీఎల్ స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీతో బీజేపీకి లోపాయకారి అవగాహన, సంబంధం ఉందంటూ ఎవరు మాట్లాడినా చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

స్టిక్కర్లు రోత పుట్టిస్తున్నాయి

రాష్ట్రంలో వైఎస్సార్సీపీ, తెలుగుదేశం పార్టీల మధ్య స్టిక్కర్ల పోటీ నడుస్తోందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ‘జగనన్నే మా భరోసా’ అంటూ వైఎస్సార్సీపీ నేతలు ఇంటింటికీ స్టిక్కర్లు అతికిస్తుంటే.. నేతలు వెళ్లిపోగానే జనం స్టిక్కర్లు పీకేస్తున్నారని జీవీఎల్ అన్నారు. నిజానికి ప్రజలెవరూ అనుకోకపోయినా తమకు తామే ఊహించుకుని మరీ స్టిక్కర్లు అతికిస్తుంటే.. ప్రతిపక్ష పార్టీలు కూడా వాటిపై స్టిక్కర్లు అతికిస్తూ రోత పుట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. స్టిక్కర్లతో ప్రజల జీవితాలు మారిపోతాయన్నట్టుగా ప్రవర్తించడం హాస్యాస్పదం. ప్రజలను మభ్యపెట్టడంలో వైఎస్సార్సీపీ, తెలుగుదేశం పార్టీలు పోటీపడుతున్నాయని జీవీఎల్ అన్నారు.

మరోవైపు విశాఖపట్నం నుంచే పరిపాలన సాగిస్తామంటూ, ఆ నగరాన్ని అభివృద్ధి చేయడం కోసం తపన పడుతున్నట్టుగా ప్రవర్తించడం ఆశ్చర్యాన్ని కల్గిస్తోందని అన్నారు. వారి దృష్టిలో అభివృద్ధి అంటే అక్రమాలు, భూదందాలా అని జీవీఎల్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి మినహా విశాఖ నగరానికి రాష్ట్రం ప్రభుత్వం చేసిందేంటో చెప్పాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

బీఆర్ఎస్ అంటే భ్రమ రాజకీయాల పార్టీ

బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి కాదు భ్రమ రాజకీయాల పార్టీ సమితి అని జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. స్టీల్ కొనడానికి ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈవోఐ) ఆహ్వానిస్తే.. స్టీల్ ప్లాంట్ అమ్మకం కోసం అంటూ బీఆర్ఎస్ నానా హంగామా చేసిందని అన్నారు. ఏకంగా స్టీల్ ప్లాంట్ కొనడానికి బిడ్ దాఖలు చేస్తామంటూ ప్రజల్ని, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను భ్రమల్లో పెట్టే ప్రయత్నం చేసిందని, కానీ ఇప్పుడు ఏమంటారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తీరా ఆ స్టీల్ కొనే బిడ్‌లో పాల్గొనలేదని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement