Friday, May 17, 2024

Delhi | తెలంగాణలో వర్షాలు, వరదల నిర్వహణపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఫైర్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : యావత్ రాష్ట్రం చరిత్రలో ఎప్పుడూ చూడని భారీ వర్షాలతో అతలాకుతలం అవుతుంటే ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు రోమ్ చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టుగా ఫాం హౌజ్‌లో కూర్చుని మహారాష్ట్ర రాజకీయాల్లో మునిగి తేలుతున్నారని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డా. కే. లక్ష్మణ్ ఆరోపించారు. ఆదివారం ఉదయం ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన లక్ష్మణ్.. వరద సహాయ చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కేసీఆర్ నదులకు నడకలు నేర్పారు అంటూ ఆ పార్టీ నేతలు గొప్పలు పోయారని, కానీ యావత్ రాష్ట్రాన్నే వరద నీటితో సముద్రంగా మార్చిన ఘనత మాత్రం ఆయనకు దక్కుతుందని ఎద్దేవా చేశారు.

ఈ పరిస్థితుల్లో తాము తెలంగాణ బీజేపీ నేతల బృందం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిసి వరద పరిస్థితి గురించి వివరించామని చెప్పారు. ఆయన భేటీ ముగిసి బయటికొచ్చేలోపే కేంద్ర బృందాన్ని ఏర్పాటు చేస్తూ అమిత్ షా ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. వరదల నష్టంపై కేంద్ర బృందం నివేదిక ఇచ్చిన వెంటనే తక్షణ సహాయం అందుతుందని తెలిపారు. మరోవైపు పార్టీలో జరిగిన సంస్థాగత మార్పుల గురించి అడుగుతూ.. పార్టీ రాష్ట్ర అధ్యక్ష మార్పు జరగగానే శ్రేణుల్లో తప్పుడు సంకేతాలు వెళ్లాయని, కానీ బండి సంజయ్‌కు పార్టీ అధిష్టానం పదోన్నతి కల్పించి ఏకంగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు అప్పగించిందని తెలిపారు.

జాతీయ ప్రధాన కార్యదర్శులుగా ఉన్న 8 మందిలో దక్షిణ భారతదేశం నుంచి ఉన్న ఏకైక వ్యక్తి బండి సంజయ్ అని గుర్తుచేశారు. పార్టీ బండి సంజయ్ ప్రాధాన్యతను ఏమాత్రం తగ్గించకపోగా మరింత పెంచిందని.. పార్టీ శ్రేణులు కూడా ఈ విషయాన్ని గమనించాలని అన్నారు. కొందరు నేతలు పార్టీ వీడి వెళ్లడం గురించి ప్రశ్నించగా.. పార్టీని ఒక్కరు వీడితే.. నలుగురు చేరుతున్నారని లక్ష్మణ్ అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలనపై ప్రజలు విసుగు చెంది ఉన్నారని, ఒకే కుటుంబం నుంచి ఆరుగురు కీలక పదవుల్లో ఉన్నారని తెలిపారు. ఇక సామాజిక న్యాయం ఎక్కడుందని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో కేసీఆర్ అహంకార, అవినీతి, కుటుంబ పాలనను వ్యతిరేకిస్తూ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేస్తే.. గెలిచిన వెంటనే ఆ పార్టీ నేతలు ప్రభుత్వంలో చేరిపోయారని.. మొత్తంగా ప్రజల నమ్మకాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కోల్పోయిందని అన్నారు.

తెలంగాణ ఇచ్చింది తామేనని ఊకదంపుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ.. 1,600 మంది అమరుల ప్రాణాలు బలితీసుకున్న తర్వాత రాష్ట్రాన్ని ఇచ్చిన విషయం మర్చిపోవద్దని అన్నారు. కాంగ్రెస్ తింటున్నది 1,600 మంది అమరుల రక్తపు కూడు అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లోలో కాంగ్రెస్‌కు తోక పార్టీలా బీఆర్ఎస్ వ్యవహరిస్తోందని, గల్లీలో కుస్తీ – ఢిల్లీలో దోస్తీ అన్న చందంగా ఈ రెండు పార్టీల వ్యవహారశైలి ఉందని డా. లక్ష్మణ్ విమర్శించారు. పార్లమెంట్ సాక్షిగా ఈ రెండు పార్టీల బాగోతాన్ని తాను ఫొటోలతో సహా బయటపెట్టానని గుర్తుచేశారు. ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)తో ఉన్న లిక్కర్ బంధం గురించి దేశ ప్రజలందరికీ తెలుసని, సస్పెండైన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌కు బీఆర్ఎస్ మద్దతివ్వడం వెనుక కారణంగా కూడా ఇదేనని లక్ష్మణ్ అన్నారు.

- Advertisement -

తెలంగాణలో వర్షాలు, వరదల గురించి పార్లమెంటులో లేవనెత్తాలని చూస్తుంటే ప్రతిపక్షాలు సభ సజావుగా సాగకుండా అడ్డుకుంటున్నాయని ధ్వజమెత్తారు. ప్రజాధనాన్ని వృధా చేయడమే లక్ష్యంగా విపక్షాలు వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. యావత్ ప్రపంచం ప్రధాని మోదీని ప్రశంసిస్తుంటే చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయని మండిపడ్డారు. వారితో పాటు బీఆర్ఎస్ చేతులు కలిపి సభా సమయాన్ని వృధా చేస్తోందని ఆరోపించారు. ప్రధాని మోడీని అడ్డుకోవడం అంటే అభివృద్ధిని అడ్డుకోవడమే అని, పేదలకు అందుతున్న సంక్షేమాన్ని అడ్డుకోవడమే అని ఆయన అభివర్ణించారు. ఈ కుట్రలను దేశ ప్రజలు తిప్పికొడతారని లక్ష్మణ్ అన్నారు. తెలంగాణ ప్రజలు ఇప్పటికే రెండు పర్యాయాలు కేసీఆర్‌ను నమ్మి మోసపోయారని, అలాగని కాంగ్రెస్‌కు ఓటేస్తే వారంతా వెళ్లి బీఆర్ఎస్‌ చేరడంతో ఆ పార్టీపైనా ప్రజలు నమ్మకం కోల్పోయారని అన్నారు. ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలకు పెద్దపీట వేస్తున్న బీజేపీతోనే సామాజిక న్యాయం, సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని డా. లక్ష్మణ్ తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement