Sunday, April 28, 2024

Lucknow : బీజేపీ 150 సీట్లు మించి గెలువ‌లేదు… రాహుల్ గాంధీ

ఆ పార్టీ గ్రాఫ్ రోజు రోజుకి ప‌డిపోతుంది..
మొన్న 180 సీట్లు అన్న క‌మ‌ల‌నాధులు
ఇప్ప‌డు 150 మీద ఊగిస‌లాడుతున్నారు
కూట‌మి బ‌లం పెరుగుతున్న‌ది..
అవినీతికి ఛాంపియన్ మోడీ..
బాండ్ల కుంభకోణం ప్రధాని సృష్టే

లక్నో: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కేవలం 150 సీట్లు మాత్రమే గెలుస్తుందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. ఘ‌జియాబాద్ లో ఎస్పీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తో క‌లిసి ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… అసలు సమస్యలపై ప్రధాని మాట్లాడరని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

‘ఎన్ని గెలుస్తామో ముందే జోష్యం చెప్పలేన‌ని, 15-20 రోజుల క్రితం బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో 180సీట్లు గెలుస్తుందని అనుకున్నాన‌ని, అయితే బీజేపీ గ్రాఫ్‌ రోజురోజుకి పడిపోతుంద‌ని రిపోర్ట్ లు వ‌చ్చాయ‌న్నారు… బీజేపీ కేవలం 150 సీట్లలో మాత్రమే గెలుస్తుంద‌నే అన్ని రాష్ట్రాల నుంచి రిపోర్టులు అందాయ‌న్నారు. కాంగ్రెస్‌ గ్రాఫ్‌ పెరుగుతోంద‌ని అంటూ ఉత్తరప్రదేశ్‌లో త‌మ‌ కూటమి మంచి ఫలితాలు సాధిస్తుంద‌నే ధీమా వ్య‌క్తం చేశారు..

- Advertisement -

కార్పొరేట్ల కోస‌మే మోడీ…
గత పదేళ్లలో ప్రధాని మోడీ నోట్ల రద్దు చేశార‌న్నారు. బడా వ్యాపారవేత్తల కోసం తప్పుడు జీఎస్టీ అమలు చేసి ఉపాధి తగ్గించార‌ని మండి ప‌డ్డారు. యువతకు ఉపాధి కోసం తాము 23 విప్లవాత్మకమైన ఆలోచనలు చేశామ‌న్నారు రాహుల్. ఉత్తరప్రదేశ్‌లోని గ్రాడ్యుయేట్లు, డిప్లొమా చేసిన వారికి అప్రెంటిస్‌షిప్ హక్కును కల్పిస్తామ‌ని భ‌రోసా ఇచ్చారు.. యువత బ్యాంకు ఖాతాలో ఏడాదికి లక్ష రూపాయలు జమ చేస్తామ‌ని హామీ ఇచ్చారు. కోట్లాది మంది యువతకు ఈ హక్కులు కల్పిస్తామ‌న్నారు.. పేపర్ లీకులు జరగకుండా చట్టం చేస్తాం’ అని తెలిపారు.

ప్రధాని మోడీ అవినీతికి ఛాంపీయన్‌…
ఎలక్టోరల్‌ బాండ్ల స్కీమ్‌ ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడి పథకమని అన్నారు రాహుల్. అదేవిధంగా అవినీతిలో ప్రధాని మోడీ ఒక ఛాంపీయన్‌ అని మండిపడ్డారు. ప్రధాని స్క్రిప్ట్‌ ఆధారంగా ఇంటర్వ్యూలో మాట్లాడారని ఎద్దేవా చేశారు. ‘కొన్ని రోజుల కిత్రం ఓ ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ మాట్లాడుతూ… అందులో ఎన్నికల బాండ్ల గురించి ప్రస్తావించారు. ఎ‍న్నికల బాండ్లు రాజకీయాల్లో పారదర్శకత కోసం తీసుకువచ్చామని సమర్థించుకున్నారు. అలాంటప్పుడు సుప్రీంకోర్టు ఎందుకు రద్దు చేసింది. పారదర్శకత కోసమే అయితే బీజేపీకి విరాళాలు ఇచ్చిన వారి పేర్లు ఎందుకు దాచారు. ఏయే తేదీల్లో విరాళాలు అందజేశారో ఎందుకు దాచారు’ అని నిలదీశారు.

రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నారు..
‘ఈ ఎన్నికలు భావజాలానికి సంబంధించిన ఎన్నికలు. ఒకవైపు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ ప్రయత్నిస్తుండగా, మరోవైపు భారత కూటమి, కాంగ్రెస్‌ పార్టీలు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాయని రాహుల్ గాంధీ వివ‌రించారు.. ఎన్నికల్లో 2-3 పెద్ద సమస్యలు ఉన్నాయి. నిరుద్యోగం అతిపెద్దది.. ద్రవ్యోల్బణం రెండవది, కానీ బీజేపీ దృష్టిని మళ్లించడంలో బిజీగా ఉంది. సమస్యలపై ప్రధాని కానీ, బీజేపీ కానీ మాట్లాడడం లేద‌న్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో అమేథీ, రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తారా అన్న ప్రశ్నకు కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ, ‘ఇది బీజేపీ వ్యక్తి నుంచి వచ్చిన ప్రశ్న, చాలా బాగుంది.. నేను ఏ ఆదేశాన్ని ఇచ్చినా పాటిస్తాను’ అని అన్నారు. మా పార్టీలో ఈ (అభ్యర్థుల ఎంపిక) నిర్ణయాలన్నీ సీఈసీ తీసుకుంటాయని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement