Thursday, April 25, 2024

Its A Murder | సజీవ దహనానికి సుపారి.. రూ.15 లక్షల భూమికి ఒప్పందం!

మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గుడిపల్లిలో ఆరుగురు సజీవ దహనం సుపారి హత్యగా పోలీసులు తేల్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుడిపల్లి లోని ఓ గృహంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి అందులో ఉన్న ఆరుగురు సజీవ దహనం అయ్యారు. గ్రామానికి చెందిన మాసు శివయ్య, రాజ్యలక్ష్మి, మౌనిక, శాంతయ్య, హిమబిందు, స్వీటీలు మృతి చెందిన విషయం విదితమే. సమాచారం అందుకున్న మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్, ఏసీపీ ఎడ్ల మహేష్, మందమర్రి సీఐ ప్రమోద్ రావు లతోపాటు పలువురు పోలీసు అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

కేసు నమోదు చేసి ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయా లేదా ఎవరైనా ఈ ఘాతుకానికి పాల్పడ్డారా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. మృతి చెందిన శాంతయ్య సింగరేణి ఉద్యోగి గత కొంతకాలంగా కుటుంబ సభ్యులను కాదని శివయ్య నివాసంలో ఉంటున్నట్లు, వివాహేతర సంబంధం పై గత కొంతకాలంగా గొడవలు నడుస్తున్నాయనే సమాచారం మేరకు ఆ దిశగా శాంతయ్య కుటుంబ సభ్యులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయగా ఆసక్తికరమైన విషయం బయట పడింది.

మృతుడు శాంతయ్య భార్య లక్షెట్టిపేటకు చెందిన పలువురికి హత్య కోసం 15 లక్షల రూపాయల విలువ గల భూమి సుపారిగా ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. దీంతో వారు శుక్రవారం రాత్రి 50 లీటర్ల డీజిల్ కొనుగోలు చేసి గుడిపల్లిలోని సంఘటన స్థలానికి చేరుకొని ఇంట్లోకి డీజిల్ పోసి నిప్పంటించినట్లు గుర్తించారు. వివాహేతర సంబంధం ఆరుగురి సజీవ దహనమైన ఘటనకు కారణమయింది. దారుణ ఘాతుకానికి పాల్పడ్డ వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement