Friday, July 26, 2024

TS | అలెర్ట్ గా ఉండండి.. భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ సమీక్ష

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం సమీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాతో పాటు పలు జిల్లాల పరిధిలో గాలి వాన, పిడుగులు పడి సంభవించిన నష్టంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు.

భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ సూచనలు ఉన్నందున జిల్లాల్లో కలెక్టర్లు, రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎక్కడ ఎలాంటి ఆపద వచ్చినా సంబంధిత శాఖ‌ల అధికారులు, సిబ్బంది తగిన స‌హాయ‌క చ‌ర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎక్కడైనా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోతే, రైతులు ఆందోళన చెందవద్దని అండగా ఉంటామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. కొనుగోలు కేంద్రాల్లోని తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.

పిడుగు పాటు మృతుల‌పై సీఎం రేవంత్ విచార‌ణ‌

మెదక్ జిల్లాలో పెద్ద శంకరంపేట మండలంలో పిడుగు పడి ఇద్దరు మృతి చెందిన ఘటనపై సీఎం రేవంత్ విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన ఇద్దరి కుటుంబాలను ఆదుకుంటామని అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మండలంలోని గిమ్మగ్రామంలో పిడుగుపాటుకు ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయని, వారికి తగిన వైద్య సాయం అందేలా చూడాలని అక్కడి అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement