Sunday, April 28, 2024

TS | డిమాండ్‌కు త‌గ్గ‌ట్టు తాగునీటి సరఫరాకు ఏర్పాట్లు చేయాలి : సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో తాగునీటికి ఇబ్బంది తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పెరుగుతున్న ఎండల కారణంగా రాబోయే రెండు నెలలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కృత్రిమ నీటి కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని ఆయన చెప్పారు. ఎక్కడైనా ఫిర్యాదు వచ్చినా వెంటనే అక్కడ తాగునీటి సరఫరాను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని సీఎం సూచించారు.

గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎక్కువ నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ…. పెరిగిన అవసరాలకు సరిపోవటం లేదని, భూగర్భ జల మట్టం పడిపోవటంతో ప్రజలు కేవలం నల్లా నీటిపైనే ఆధారపడటంతో ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. తాగునీటి సరఫరాపై ఏ రోజుకారోజు తెలంగాణ సీఎస్ సారధ్యంలో మిషన్ భగీరథ, మున్సిపల్, ఇరిగేషన్, విద్యుత్తు శాఖ అధికారులు తాగునీటి సరఫరాపై సమీక్ష జరపాలని సూచించారు.

- Advertisement -

ఉమ్మడి జిల్లాలకు నియమించిన ప్రత్యేక అధికారులు తాగునీటి ఇబ్బందులున్న చోటికి స్వయంగా వెళ్లి పరిశీలించాలని, అక్కడ సమస్యను పరిష్కరించే చర్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఆదేశించారు. హైదరాబాద్‌లో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా, డిమాండ్ పెరిగినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలన్నారు. అవసరమైతే నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజీ నుంచి నీటిని హైదరాబాద్‌కు తరలించాలని, అందుకు తగిన ఏర్పాట్లు వెంటనే చేయాలని ఆదేశించారు. ఇటు సింగూర్ నుంచి నీటి సరఫరా చేసేందుకు సన్నద్ధంగా ఉండాలన్నారు.

కృష్ణా బేసిన్‌లో నీటి లభ్యత లేనందున ఎగువన నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి తాగునీటిని తెచ్చుకునేలా కర్ణాటక ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని సీఎం చెప్పారు. హైద‌రాబాద్ ‌లో ఇటీవల కొందరు సిబ్బంది అత్యుత్సాహంతో ఒకచోట తాగునీటి సరఫరా నిలిచిపోయిందని ఈ సందర్భంగా సీఎం దృష్టికి వచ్చింది. ఉద్దేశ పూర్వకంగా తాగునీటి సరఫరాకు ఆటంకం కల్పించిన వారిని వెంటనే ఉద్యోగాల నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement