Thursday, April 25, 2024

Annual Crime Report: రాష్ట్రంలో 4.4 శాతం పెరిగిన నేరాలు : డీజీపీ మహేందర్ రెడ్డి

రాష్ట్ర పోలీసు వార్షిక నివేదిక‌ను డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి గురువారం విడుద‌ల చేశారు. రాష్ట్రంలో నేరాల శాతం 4.4కు పెరిగింద‌ని పేర్కొన్నారు. మావోయిస్టు రహిత తెలంగాణ లక్ష్యంలో భాగంగా పోలీసులు ఈ ఏడాది విజయవంతమయ్యారని, సరిహద్దు జిల్లాల్లోని పోలీసులు ఎంతో కృషి చేశారని కొనియాడారు. మతపరమైన ఘర్షణలు, ఉగ్రవాద దాడులు కూడా జరగలేదని చెప్పారు. నేరాలు పెర‌గ‌డానికి కార‌ణం.. సైబర్ నేరాలు అన్నారు. 57శాతం సైబ‌ర్ నేరాలు పెరిగాయ‌న్నారు. సైబ‌ర్ నేరాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు కార్య‌క్ర‌మాలు అమ‌లు చేశామ‌ని తెలిపారు. 15 ల‌క్ష‌ల మందికి అవ‌గాహ‌న క‌ల్పించామ‌ని చెప్పారు. రాష్ట్రంలో హత్యలు 12 శాతం.. అత్యాచారాలు 17శాతం తగ్గాయని, దొంగతనాలు 7 శాతం, అపహరణలు 15 శాతం పెరిగాయని పేర్కొన్నారు. మహిళలపై నేరాలు 3.8 శాతం పెరిగాయని చెప్పారు. 152 కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు పడిందని వివరించారు. డయల్ 100 ద్వారా 13 లక్షల ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. సామాజిక మాద్యమాల ద్వారా 1.1 లక్షల ఫిర్యాదులు.. పోలీస్ స్టేషన్లలో 5.5 లక్షల ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించారు.సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టామని డీజీపీ మహేందర్‌రెడ్డి వివరించారు. ఇందులో భాగంగా 15 లక్షల మందికి అవగాహన కల్పించామని తెలిపారు. గస్తీ వాహనాలు 7 నిమిషాల్లో ఘటనాస్థలికి చేరుకుని సేవలు అందించే విధంగా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. హాక్ ఐ ద్వారా ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారని అన్నారు. ప్రజల భాగస్వామ్యంతో 10 లక్షలకుపైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. సీసీ కెమెరాల ద్వారా 18,234 కేసులు ఛేదించామని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. వేలిముద్రల ద్వారా ఎంతో మంది నిందితులను గుర్తించామని పేర్కొన్నారు. 10లక్షల మంది అనుమానితుల వేలిముద్రలను సేకరించామని వివరించారు. కరుడు గట్టిన నిందితులపై పీడీ చట్టం ప్రయోగించి నేరాలు అదుపు చేస్తున్నామని అన్నారు. ఈ ఏడాది 431 మందిపై పీడీ చట్టం ప్రయోగించామని చెప్పారు.‌

Advertisement

తాజా వార్తలు

Advertisement