Friday, March 29, 2024

భారత్‌కు అగ్రరాజ్యం సాయం

భారత్ రుణం తీర్చుకోవాలని అగ్రరాజ్యం నిర్ణయించుకుంది. కరోనా తొలి రోజుల్లో ఇండియా చేసిన మేలు మరిచిపోలేని అమెరికా భారీ సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. భారత్‌ను పట్టిపీడిస్తున్నా కరోనా రక్కసిని అదుపు చేసేందుకు కోవిడ్ సాయం కింద దాదాపు 10 కోట్ల డాలర్ల విలువైన సప్లయ్ అందిస్తోంది. ఇందులో భాగంగా 1000 ఆక్సిజన్ సిలిండర్లు, 1.5 కోట్ల ఎన్ 95 మాస్కులు, 10 లక్షల రాపిడ్ డయాగ్నస్టిక్ టెస్ట్ కిట్‌లను పంపించనుంది. గురువారం నుంచే వీటి సరఫరాను ప్రారంభిస్తామని యూఎస్ ప్రకటించింది.

తాము ఆర్డర్ చేసిన ఆస్ట్రాజెనికా టీకాలను ఇండియాకు పంపాలని కూడా ఇప్పటికే ఆదేశించామని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ జే ఆస్టిన్ తెలిపారు. మొత్తం 2 కోట్ల టీకా డోసులను ఇండియాకు పంపనున్నామని పేర్కొన్నారు. ‘కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చిన తొలి రోజుల్లో ఇండియా మాకు సాయం చేసింది. ఇదే విధంగా ఇప్పుడు మేము ఇండియాకు సాయపడాలని నిర్ణయించాం’ అని వైట్ హౌస్ పేర్కొంది. అమెరికా ప్రకటించిన సాయాన్ని భారత్‌కు చేర్చేందుకు డెల్టా సంస్థ విమానాలను సిద్ధం చేసింది. అలాగే కార్గో విమానాలను కూడా ఆ దేశం రెడీగా ఉంచింది. ఇండియాలో ఖాళీగా ఉన్న తమ కార్యాలయాలను వ్యాక్సిన్ సెంటర్లుగా వినియోగించుకోవడానికి అమెరికాలోని పలు సంస్థలు అనుమతించిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement