Monday, June 17, 2024

Big story | అంతా రామమయం! అందరి దృష్టీ అయోధ్యపైనే

ఔను.. ఇప్పుడు దేశమంతటా అయోధ్య రామందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. ఆ మాటకొస్తే విదేశాల్లోనూ అదే జపం. ఈనెల 22న ఈ పవిత్ర కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. ఏడువేల మంది అతిథులు హాజరయ్యే ఈ వేడుకకు అయోధ్య ముస్తాబవుతోంది. అక్కడి రైల్వేస్టేషన్‌ ఆధునిక హంగులతో అలరిస్తోంది. సరికొత్త అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధమైంది. ఏడువేల అతిథులను ఆహ్వానిస్తున్నారు. రామమందిరంలోనూ, బయట… ఎక్కడికక్కడ రామాయణ చరిత్రను తెలిపే కుడ్య చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. రామజన్మభూమి ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన కరసేవకులు, శతాబ్దాల తరబడి ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖుల బొమ్మలను అయోధ్య నగరంలోని గోడలపై చిత్రించే పని వేగంగా సాగుతోంది.

ఇక దేశవ్యాప్తంగా ఇంటింటింకి రామయ్య అక్షతలు చేరుతున్నాయి. ఇంటికొచ్చి అక్షతలు ఇస్తున్నవారికి భక్తులు హారతులు పడుతున్నారు. రామవిగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నారు. ప్రతిష్ఠాపన కార్యక్రమం సందర్భంగా అతిథులకు రామజన్మభూమిలోని గర్భగుడివద్ద తీసిన మట్టిని కానుకగా ఇవ్వబోతున్నారు. ఆలయ ప్రారంభం, విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం స్వయంగా ప్రధాని మోడీ చేతుల మీదుగా సాగుతుంది. ఆ పవిత్ర కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న నేపథ్యంలో ప్రధాని మోడీ 11 రోజుల దీక్షను చేపట్టారు. జనవరి 22న ప్రతి ఇంటిలోనూ రామజ్యోతిని వెలిగించమని ఆయన దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. రాజకీయ సిద్ధాంత రాద్ధాంతాల మాట ఎలా ఉన్నా… సామాన్యుడి మనసులో మాత్రం రామజపం వినిపిస్తోంది. ఇక్కడ ఒక విశేషం చెప్పుకోవాలి.

అయోధ్య రామమందిరం గర్భగుడితో సహా ఆలయంలో అమర్చే అతి భారీ తలుపులను హైదరాబాద్‌లో తయారు చేస్తున్నారు. గర్భగుడికి అమర్చే 18 తలుపులు (బంగారు తాపడం) ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నాయి. కొన్నింటిని బిగించారు కూడా. హైదరాబాద్‌లోని అనూరాధ టింబర కంపెనీ ఈ తలుపుల తయారీ బాధ్యతను తీసుకుంది. మొత్తం 118 తలుపులను తయారు చేశారు. వీటిలో ఇప్పటికే 100 పూర్తయ్యాయి. ఈ టింబర్‌ కంపెనీ ఏర్పాటై వందేళ్లు దాటింది. తమిళనాడు నుంచి వచ్చి కళాకారులు ఈ తలుపులను రమణీయంగా తీర్చిదిద్దుతున్నారు. వీటిని నగర శైలిలో రూపొందిస్తున్నారు. మూడవ శతాబ్దంలోని గుప్తులు ఈ శైలిని అనుసరించారు. ఉత్తరాదిలో ఎక్కువగా ఈ శైలినే అనుసరిస్తారు. ఆలయంలోని ప్రధానమైన అయిదు మండపాలకు సంబంధించిన తలుపు పూర్తయ్యాయని ఆ సంస్థ ఎండీ శరత్‌ బాబు చెప్పరు.

ఒక్కో తలుపు 8 అడుగుల ఎత్తు, 12 అడుగుల వెడల్పు, ఆరంగుళాల మందంతో చెక్కారు. ఇవి కనీసం వెయ్యేళ్లపాటు చెక్కుచెదరవు. ప్రతి తలుపై కలువపూలు, నెమళ్లు, ఇతర పక్షులు, అందమైన లతలు వంటివి చెక్కేరు. ఈ తలుపుల తయారీకి ఉపయోగించిన టేకు కల మహారాష్ట్రలోని బల్లార్ష నుంచి సేకరించారు. మరోవైపు అయోధ్యలో ఆ ఉత్సవానికి వెళ్లేందుకు దేశ ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారు. కానీ అతిధులు తప్ప మరెవ్వరూ రావొద్దని అయోధ్య తీర్థ ట్రస్ట్‌ విజ్ఞప్తి చేస్తోంది. రామజన్మభూమి ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన అద్వానీ, మురళీమనోహర్‌ జోషీలకు ఆహ్వానం పంపినప్పటికీ.. ఇతర కారణాలవల్ల కార్యక్రమానికి దూరంగా ఉండమని విన్నవించారు. కాగా, సాక్షాత్తు ఆ రామచంద్రుడే ఆలయాన్ని మోడీ ద్వారా కట్టించుకున్నాడని అద్వానీ కితాబివ్వడం విశేషం.

ఆ రోజు కోసం వేయి కనులతో…

- Advertisement -

కోట్లాది మంది భారతీయుల కల ఈ నెల 22న నెరవేరబోతోంది. ఆరోజు అయోధ్యలో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం జరగబోతోంది. 22వ తేదీ ఎప్పుడొస్తుందా అని దేశవ్యాప్తంగా భక్తులు వేయి కనులతో ఎదురుచూస్తున్నారు. 2019 నవంబర్‌లో అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సుప్రీమ్‌ కోర్టు అనుమతించింది. అప్పటి నుంచి రామాలయ నిర్మాణం మొదలైంది. ఇందుకు రూ.3,500 కోట్ల రూపాయిల విరాళాలు దాదాపు 12.5 కోట్ల మంది భక్తులు ప్రపం చవ్యాప్తంగా అందించారు. ఈ ఆలయ నిర్మాణంలో తెలుగువారి కీర్తి ముఖ్యంగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోతోంది. మొత్తం ఆలయ ద్వారాలు, తలుపులను నిర్మించే బాధ్యత తెలంగాణ దక్కించుకోవడం విశేషం.

ఆలయ వైభవం

రామ్‌లల్లా విగ్రహం 51 అంగుళాల ఎత్తు ఉంటుంది. బరువు సుమారు 1.5 టన్నుల బరువు ఉంటుంది. కాగా, ఈ విశేష కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా దేశ, విదేశాల్లో భక్తులు వీక్షించేలా చర్యలు తీసుకుంటున్నారు. మూడు అంతస్తుల ఎత్తులో ఉండే రామాలయం ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తు ఉంటుంది. మొత్తం 302 పిల్లర్లతో 44 ప్రవేశద్వారాలను కలిగిఉంటుంది. గర్భగుడిలో బాల రాముడి విగ్రహానికి 22న ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు. అలాగే, శ్రీరాముడి దర్బారు మొదటి అంతస్తులో ఉంటుంది. మొత్తం అయిదు మండపాలు రామాలయంలో ఉంటాయి. రంగ మండపం, సభా మండపం, కీర్తన మండపం, నృత్య మండపం, ప్రార్ధనా మండపాలు ఇందులో ఉంటాయి. ఆలయం చుట్టూ 732 మీటర్ల ప్రహరీ ఉంటుంది. దీని వెడల్పు 14 మీటర్లు. కాగా, ఆలయ కాంప్లెక్స్‌ నలుమూలల మరో నాలుగు ప్రార్ధనా మందిరాలు ఉంటాయి. సూర్యదేవుడు, దేవీ భగవతి, గణేశుడు, శివుని ఆలయాలు నిర్మించారు.

ఉత్తరం వైపు అన్నపూర్ణాదేవీ ఆలయం, దక్షిణాన ఆంజనేయస్వామి ఆలయం నిర్మించారు. ప్రధాన మందరానికి సమీపంలో సీతాకూపం పేరుతో ఉన్న పురాతన బావిని పునరుద్ధరించారు. అదేవిధంగా, మహర్షి వాల్మీకి, మహర్షి వశిష్ట, మహర్షి విశ్వామిత్ర, మహర్షి అగస్త్య, తదితర చిన్న ఆలయాలు కూడా కాంప్లెక్స్‌లో నిర్మించారు. దక్షిణ భాగంలో పురాతన శివాలయాన్ని పునరుద్ధరించారు. ఇందులోనే జటాయువు ప్రతిమ కూడా ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణంలో ఎటువంటి స్టీల్‌ను వాడలేదు. వెయ్యేళ్లు సురక్షితంగా ఉండేలా డిజైన్‌ చేశారు. ఆలయం మొత్తం 4.7 లక్షల క్యూబిక్‌ అడుగుల పింక్‌ శాండ్‌స్టోన్‌ను వాడారు. రాజస్తాన్‌లోన భరత్‌పుర ప్రాంతం నుంచి ఈ స్టోన్‌ తరలించారు. మొత్తం 161 అడుగుల ఎత్తు, 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు ఉండే ఈ చారిత్రక ఆలయం పునాది నుంచి ఎటువంటి తేమ రాకుండా గ్రానైట్‌ రాయి 21 అడుగుల మందంతో పరిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement