Wednesday, April 24, 2024

సీఎం జ‌గ‌న్ ట్వీట్ పై అభ్యంత‌రం.. అద్నాన్ స‌మీపై మండిప‌డుతోన్న వైసీపీ నాయ‌కులు

ఆర్ ఆర్ ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ కి ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ‘గోల్డెన్ గ్లోబ్’ పురస్కారాన్ని గెలిచింది. ఉత్తమ ఒరిజినల్ పాట విభాగంలో ఈ అవార్డు అందుకుంది. గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకున్న తొలి భారతీయ చిత్రంగా నిలిచింది. దాంతో ఏపీ సీఎం ఈ చిత్ర బృందాన్ని అభినందించారు. ఆయన చేసిన ట్వీట్ పై ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీ అభ్యంతరం వ్యక్తం చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆర్ ఆర్ ఆర్ ని అభినందిస్తూ.. ‘ప్రపంచ వేదికపై తెలుగు పతాకం రెపరెపలాడుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున చిత్రబృందానికి నా శుభాకాంక్షలు. మిమ్మల్ని చూసి మేం గర్విస్తున్నాం అని జగన్ ట్వీట్ చేశారు. అయితే, ఈ మెసేజ్ లో ఏపీ సీఎం తెలుగు పతాకం అనడంపై అద్నాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

తెలుగు పతాకమా మీరు చెబుతున్నది భారత పతాకమే కదా ..మనమంతా భారతీయులం. కాబట్టి దయచేసి మీరు భారత్ నుంచి వేరుగా ఉండటానికి ప్రయత్నించకండి. ముఖ్యంగా అంతర్జాతీయంగా మనది ఒకే దేశం. మనం 1947లో చూసిన ఇలాంటి వేర్పాటు వాద వైఖరి మంచిది కాద‌ని అద్నాన్ సమీ ట్వీట్ చేశారు. దీనిపై జగన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అద్నాన్ కు కౌంటర్ ఇచ్చారు. అయితే, తన కామెంట్లను అద్నాన్ సమర్థించుకుంటూ మరో ట్వీట్ చేశారు. ‘తెలుగు సినిమా యావత్ భారతదేశాన్ని గర్వించేలా చేసింది అని రాసి ఉంటే బాగుండేది. అదే నిజం అని పేర్కొన్నారు. అయితే, అద్నాన్ పై వైసీపీ నాయకులు, అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement