Friday, April 26, 2024

మంత్రి కేటీఆర్ కు అరుదైన గౌరవం.. టాప్ 100 నాయ‌కుల్లో చోటు

తెలంగాణ మంత్రి కేటీఆర్ కి అరుదైన గౌరవం దక్కింది. జ్యూరిచ్ వేదికగా అక్టోబర్-4న జరగబోతున్న ఆసియా లీడర్స్ సిరీస్ మీటింగ్ కి కేటీఆర్ కు ఆహ్వానం అందింది.. యూరప్, ఆసియా దేశాలకు చెందిన 100మంది అత్యంత ప్రతిభావంతులైన రాజకీయ నాయకులను ఈ మీటింగ్ కి ఆహ్వానిస్తున్నారు. ఆ టాప్ 100 లిస్ట్ లో కేటీఆర్ కు నిర్వాహకులు చోటిచ్చారు. ఈ సమావేశంలో పాల్గొనాలని ఆహ్వానం పంపారు. అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న రాజకీయ అనిశ్చితి, యూరప్-ఆసియా పారిశ్రామిక కారిడార్‌ లో సేవలందిస్తున్న పెద్ద కంపెనీలపై దీని ప్రభావం.. అనే అంశాలపై జ్యూరిచ్ మీటింగ్ లో చర్చ జరుగుతుంది.


”గౌరవప్రదమైన, శక్తిమంతమైన మీ లాంటి నాయకుల మధ్య ఆలోచనాత్మక, అర్థవంతమైన చర్చ జరిగేలా చూడటమే మా లక్ష్యం. బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ రెవెన్యూ కలిగిన కంపెనీల బోర్డు మెంబర్లను కూడా సమావేశానికి ఆహ్వానిస్తున్నాం” అంటూ ఆసియా లీడర్స్ సిరీస్ వ్యవస్థాపకుడు కల్లమ్ ఫ్లెచర్ ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు. ఆసియా లీడర్స్ సిరీస్ సమావేశానికి తనను ఆహ్వానించడం పట్ల కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ నాయకులంతా కలిసి వివిధ అంశాలపై ఆలోచనలు పంచుకోవడానికి ఇది ఒక గొప్ప వేదిక‌ని కేటీఆర్ అన్నారు. అక్టోబర్ 4న జ్యూరిచ్ లో జరిగే ఈ సమావేశంలో బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఎంఐ-6 మాజీ చీఫ్ సర్ జాన్ స్కార్లెట్, ఎల్డీసీ గ్రూప్ చైర్మన్ మార్గరిటా లూయిస్, బ్యాంక్ ఆఫ్ చైనా యూకే బోర్డ్ మెంబర్ డాక్టర్ గెరార్డ్ లియాన్స్, హెచ్‌.ఎస్‌.బి.సి. మాజీ సీఈవో, చైర్మన్ లార్డ్ స్టీఫెన్ గ్రీన్ వంటి ప్రముఖులు పాల్గొంటారు. యూరప్, ఆసియా దేశాలలో అత్యంత ప్రభావవంతమైన లీడర్లుగా ఎదుగుతున్న 100మంది నాయకులు కూడా హాజరవుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement