Friday, April 26, 2024

క‌డుపునొప్పి అని హాస్పిట‌ల్‌కు వెళ్తే.. 187 నాణేలు బ‌య‌ట‌ప‌డ్డ‌య్‌!

చిన్నపిల్లలు డబ్బులు దాచుకునే హుండీలను పగులగొడితే చిల్లర నాణేలు బయటపడినట్లు.. ఓ వ్యక్తి కడుపులో పెద్ద సంఖ్యలో నాణేలు పయటపడ్డాయి. అదెట్లా? అని ఆశ్చర్యపోకండి. అతనికి విచిత్రంగా నాణేలు మింగే అలవాటు ఉంది. మీరు విన్నది నిజమే.. ఇప్పటి దాకా అతను రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయల నాణేలు మింగేశాడు. ఇవన్నీ కడుపులో అలా ఉండిపోయాయి. ఒకటిన్నర కేజీ దాకా చేరుకున్నాయి. చివరికి డాక్టర్లు ఆపరేషన్‌ చేసి అతని కడుపులో నుంచి మొత్తం 187 నాణేలను బయటకి తీశారు. ఈ ఘటన మన పక్క రాష్ట్రం కర్నాటకలో జరిగింది.

కర్నాటకలోని రాయచూర్ జిల్లా లింగసుగూర్‌కు చెందిన 58 ఏళ్ల దయమప్ప హరిజన్‌.. కొన్ని రోజులుగా నాణేలు మింగే డిజార్డర్‌తో బాధపడుతున్నాడు. దీంతో అతని కడుపులోకి పెద్ద‌మొత్తంలో నాణేలు చేరుకున్నాయి. పొత్తికడుపు ప్రాంతంలో విపరీతంగా నొప్పి ఉందని హాస్పిట‌ల్‌కి వెళ్ల‌గా ఎక్స్‌రే, ఎండోస్కోప్‌ చేశారు. మెడిక‌ల్ టెస్ట్‌లలో అతని కడుపులో నాణేలున్నట్లు తెలింది. దీంతో అతన్ని కాపాడేందుకు శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది.

నిజలింగప్ప మెడికల్ కాలేజీ, హనగల్ కుమారేశ్వర్ హాస్పిట‌ల్ డాక్ట‌ర్ల‌ బృదం ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ డాక్టర్ల బృందంలో డాక్టర్ ఈశ్వర్ కల్బుర్గి, డాక్టర్ ప్రకాష్ కట్టి మణితోపాటు అర్చన, రూపల్ హలకుండే అనే ఇద్దరు అనస్తీషియా డాక్టర్లు పాల్గొన్నారు. పొట్టలో నుంచి నాణేలను బయటకు తీసి అవి ఎన్ని ఉన్నయో లెక్క పెట్టారు. ఆ నాణేలలో ఐదు రూపాయల నాణేలు 56, రెండు రూపాయల నాణేలు 51, రూపాయి నాణేలు 80 ఉన్నాయి. ఇవి మొత్తం కలిపి ఒకటిన్నర కిలోల బరువున్నాయని డాక్ట‌ర్లు తెలిపారు. ఈ ఆపరేషన్‌ తర్వాత ఇప్పుడు బాధితుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement