Sunday, March 24, 2024

15శాతం పెరిగిన గోధుమ సాగు విస్తీర్ణం

వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఇవ్వాల (శుక్రవారం) విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ప్రస్తుత రబీ (శీతాకాలం) సీజన్‌లో ఇప్పటివరకు గోధుమల సాగు విస్తీర్ణం 15 శాతం పెరిగి 101.49 లక్షల హెక్టార్లకు చేరుకుంది. ప్రధాన రబీ పంట అయిన గోధుమలను విత్తడం అక్టోబర్‌లో ప్రారంభమవుతుంది. మార్చి-ఏప్రిల్‌లో కోత మొదలవుతుంది. 2022-23 రబీ సీజన్‌లో గోధుమలతో పాటు, శనగ, ఆవాలు ప్రధాన పంటలుగా ఉన్నాయి. తాజా విత్తన గణాంకాల ప్రకారం, ఈ రబీ సీజన్‌లో నవంబర్‌ 18 వరకు 101.49 లక్షల హెక్టార్లలో గోధుమలు సాగయ్యాయి, గత ఏడాది ఇదే కాలంలో ఇది 88.46 లక్షల హెక్టార్లలో సాగైంది.

గోధుమల సాగు విస్తీర్ణంలో పంజాబ్‌ (7.18 లక్షల హెక్టార్లు),రాజస్థాన్‌ (4.24 లక్షల హెక్టార్లు), ఉత్తరప్రదేశ్‌ (2.59 లక్షల హెక్టార్లు), మహారాష్ట్ర (1.05 లక్షల హెక్టార్లు), గుజరాత్‌ (0.67 లక్షల హెక్టార్లు) రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి.

- Advertisement -

  • అయితే, పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం ఈ రబీ సీజన్‌లో 76.08 లక్షల హెక్టార్ల నుంచి ఇప్పటివరకు 73.25 లక్షల హెక్టార్లకు తగ్గింది. పప్పు దినుసుల్లో 52.83 లక్షల హెక్టార్లకు గాను 52.57 లక్షల హెక్టార్లలో మినుము సాగు చేశారు.
  • నూనెగింజల విషయానికొస్తే, ఆరు రకాల నూనెగింజలు సుమారు 66.81 లక్షల హెక్టార్లలో సాగయ్యాయి, అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంలో 59.22 లక్షల హెక్టార్ల కంటే ఎక్కువ.
  • ముతక తృణధాన్యాలు 19.80 లక్షల హెక్టార్లకు గాను 19.24 లక్షల హెక్టార్లలో, వరి 7.21 లక్షల హెక్టార్లకు గాను 8.03 లక్షల హెక్టార్లలో సాగైనట్లు గణాంకాలు చెబుతున్నాయి.
  • అన్ని రబీ పంటల సాగు 268.80 లక్షల హెక్టార్లలో ఉంది. ఇది గతేడాది 250.76 లక్షల హెక్టార్ల కంటే ఎక్కువ.
Advertisement

తాజా వార్తలు

Advertisement