Friday, April 26, 2024

IPL మెగావేలానికి 1214మంది క్రికెటర్లు..

ఐపీఎల్‌ 2022 మెగావేలం ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది. ఈక్రమంలో మెగావేలానికి రిజిస్టర్‌ చేసుకున్న ఆటగాళ్ల వివరాలను పాలకమండలి వెల్లడించింది. ఐపీఎల్‌ 15వ సీజన్‌లో ఆడేందుకు మొత్తం 1214మంది క్రికెటర్లు తమ పేర్లును రిజిస్టర్‌ చేసుకున్నారు. వీరిలో 896మంది భారత ఆటగాళ్లుండగా 318మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. మొత్తం క్యాప్‌డ్‌ భారత ఆటగాళ్లు 61మంది, అదేవిధంగా క్యాప్‌డ్‌ అంతర్జాతీయ ఆటగాళ్లు 209మంది ఉన్నారు. గత సీజన్లలో పాల్గొన్న అన్‌క్యాప్డ్‌ భారత ఆటగాళ్లు 143మంది, గత సీజన్లలో పాల్గొన్న అన్‌క్యాప్డ్‌ విదేశీ ఆటగాళ్లు 6మంది, అన్‌క్యాప్డ్‌ భారత ఆటగాళ్లు 692మంది, అన్‌క్యాప్డ్‌ విదేశీ ఆటగాళ్లు 62మంది మెగావేలానికి అందుబాటులో ఉండనున్నారు.

కాగా ప్రతిజట్టులో 25మంది ఆటగాళ్లను తీసుకునే వీలుంది. దీంతో మొత్తం 217మంది ఆటగాళ్లను వేలంద్వారా ఆయా ఫ్రాంచైజీలు తీసుకుంటారు. 217మందిలో 70మంది విదేశీ క్రికెటర్లు ఉంటారు. విదేశీ ఆటగాళ్లలో ఎక్కువగా ఆస్ట్రేలియాకు చెందిన 59మంది తమపేర్లను రిజిస్టర్‌ చేయించుకున్నారని ఐపీఎల్‌ పాలకమండలి తెలిపింది. మెగా వేలానికి బెన్‌స్టోక్స్‌, జోఫ్రా ఆర్చర్‌, జోరూట్‌, మిచెల్‌ స్టార్క్‌, క్రిస్‌గేల్‌ దూరంగా ఉండనున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన కమిన్స్‌, డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌స్మిత్‌తోపాటు దక్షిణాఫ్రికాకు చెందిన డికాక్‌, డుప్లెసిస్‌, కగిసో రబాడ, ఇంగ్లండ్‌ పేసర్‌ మార్క్‌వుడ్‌ కనీస ధర రూ.2కోట్లుగా పేర్కొన్నారు. కాగా సఫారీ పేసర్లు ఎంగిడి, మార్కో జాన్సన్‌ కనీస ధర రూ.50లక్షలుగా పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement