Friday, May 17, 2024

Transgender – లోక్‌సభ బ‌రిలో థర్డ్‌ జెండర్‌ … దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ

తొలి థర్డ్‌ జెండర్ వ్యక్తి లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్‌ దాఖలు చేశాడు. 26 ఏళ్ల రాజన్ సింగ్ దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ కోసం శుక్రవారం నామినేషన్ వేశాడు. ధోతీ, టోపీ, ఆభరణాలు ధరించిన అతడు ఒంటరిగా వచ్చి సాకేత్‌లోని దక్షిణ ఢిల్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించాడు. చేతిలో లక్ష నగదు, 200 గ్రాముల బంగారం, బ్యాంకు ఖాతాలో రూ.10,000 కుపైగా డబ్బు కలిపి సుమారు రూ.15.10 లక్షల చరాస్తులున్నట్లు అఫిడవిట్‌లో ప్రకటించాడు. అయితే ఎలాంటి స్థిరాస్తులు లేవని పేర్కొన్నాడు.

కాగా, 2010లో బీహార్‌ నుంచి వలస వచ్చి ఢిల్లీలోని సంగమ్ విహార్ ప్రాంతంలో నివసిస్తున్నట్లు రాజన్ సింగ్ తెలిపాడు. థర్డ్ జెండర్ వ్యక్తులకు ప్రత్యేక సౌకర్యాలు లేకపోవడం, సామాజిక అంగీకారం, హక్కుల కోసం వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజలతో పాటు అధికారుల దృష్టిని ఆకర్షించేందుకు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు చెప్పాడు. సుధీర్ఘ ప్రక్రియ వల్ల థర్డ్ జెండర్‌గా ధృవీకరణ ప్రతాలు పొందేందుకు మూడేళ్లకుపైగా పట్టిందని అన్నాడు. మరోవైపు థర్డ్ జెండర్ వ్యక్తుల కోసం ప్రభుత్వ కార్యాలయాలు, సర్వీస్ ప్రొవైడర్ల వద్ద ప్రత్యేక వాష్‌రూమ్‌లు, క్యూలైన్లు వంటి ప్రాథమిక అవసరాలను ప్రభుత్వం కల్పించాలని రాజన్‌ సింగ్‌ కోరాడు. విద్యా, ఉద్యోగాల్లో ఒక శాతం రిజర్వేషన్లు కల్పించడంతోపాటు జాతీయ ట్రాన్స్ జెండర్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశాడు. ఎన్నికల్లో గెలిస్తే థర్డ్‌ జండర్‌ వ్యక్తులకు సంబంధించిన ప్రాథమిక అవసరాలు తీరుస్తానని, వారి సమస్యలను పరిష్కరిస్తానన్నాడు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement