Saturday, April 20, 2024

ఎడిటోరియ‌ల్ – బెంబెలెత్తిస్తున్న భ‌గ‌భ‌గ‌లు..

వేసవి గ్రీష్మ ప్రతాపాన్ని చూపుతోంది. సూర్యుని భగభగలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ ఇంటి మీద కాకి, ఆ ఇంటిమీద వాలడం లేదన్న నానుడి అక్షర సత్యం అవుతోంది. పిల్లలు,వృద్ధులు మలమల మాడి పోతున్నారు. తెల్లవారుతుండగానే వేడిగాలులు వీస్తు న్నాయి. సముద్ర తీరాల్లో చల్లగా ఉంటుంద నుకుంటే అక్కడ కూడా ఎండలు మండిపోతున్నాయి. ఎంత ప్రణాళికాబద్ధంగా ఇంటి పనులు చక్కబెట్టుకుం దామ నుకున్నా, ఎండలో బయటికి వెళ్ళక తప్పడం లేదు. వయోజనలు, యువతీ యువకుల పరిస్థితి ఇలా ఉంటే వృద్ధులు, పిల్లల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించవచ్చు. ఎండల్లో పాఠశాలలను మొన్నటి వరకూ నడిపారు. ప్రజాహిత సంస్థలు, తల్లిదండ్రుల సంఘాలు చేసిన విజ్ఞప్తి మేరకు సెలవులు ఇచ్చేశారు. ఈసారి నైరుతి రుతుపవనాల రాక కాస్తంత ఆలస్యం కావచ్చునని భారత వాతావరణశాఖ తెలియజేసింది. సాధారణంగా మన దేశంలోకి నైరుతి రుతుపవనాలు జూన్‌ ఒకట తేదీన ప్రవేశిస్తాయి.ఈసారి నాల్గవ తేదీన కానీ రుతుపవనాల జాడ ఉండదని వాతావరణ అధికా రులు తెలుపుతున్నారు. వాతావరణంలో ఈ మార్పుల కు ఎల్‌ నినో ప్రభావమే కారణమంటున్నారు. ఈ ఏడాది పసిఫిక్‌ సాగర జలాలు వేడెక్కడం వల్ల వేడిగాలుల ప్రభా వం పెరుగుతుందని వాతావరణ శాస్త్రజ్ఞులు పేర్కొంటు న్నారు. ఈనెల 19వ తేదీ నాటికి ఎండలు మరింత తీవ్ర మవుతాయని కూడా వెల్లడించారు. ఇప్పటికే ఎండల ప్రభావం వల్ల పగటి పూట ఇళ్ళల్లోంచి ఎవరూ బయటికి రావడం లేదు. వేసవి ప్రతాపానికి చెరువులు ఎండిపోతు న్నాయి. నీటి ట్యాంకర్లు తెప్పించుకున్నా వాడకానికే నీరు సరిపోవడం లేదు. ఆ మధ్య కొన్ని రోజుల పాటు అకాల వర్షాలు ప్రజల సహనాన్ని పరీక్షించాయి. ఇప్పుడు మండు టెండలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 170 మండలాల్లో వేసవి ప్రతాపం ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. అలాగే, తెలంగాణలో 280 మండలాల్లో ఎండల ప్రభావం ఎక్కువగా ఉంది. వీటిలో కొన్నింటిలో తాగు నీరు సమస్య తీవ్రంగా ఉంది. మంచినీటి సరఫరాకు ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నా, తాగునీరు లేక చాలా గ్రామాల్లో ప్రజలు అల్లా డుతున్నారు. జీవనదులైన కృష్ణ,గోదావరి తీర ప్రాంతా ల్లో కూడా నీటి కొరత ఏర్పడటం దురదృష్టకరం. తెలంగాణలో మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పథకాల ద్వారా నీటి సమస్య చాలా వరకూ పరిష్కారమైంది. ఎల్‌ నినో సంభవిస్తే ఉత్తరప్రదేశ్‌, ఢిల్లిd, చత్తీస్‌గఢ్‌ తదితర ఉత్తరాది రాష్ట్రాల్లో తీవ్రమైన అనావృష్టి పరిస్థితులు ఏర్పడవచ్చని వాతావరణ శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. 1901 తర్వాత అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన సంవత్స రం 2002యేనని వారు పేర్కొంటున్నారు.

ఎల్‌ నినో ప్రభావంతో వచ్చే ఏడాది మరింత తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడవచ్చని వారు హెచ్చరిస్తున్నారు. వేసవి సెలవులకు బంధుమిత్రుల ఇళ్ళకూ, విహార యాత్రలకూ వెళ్ళాలనుకునే వారికి ఈసారి తీవ్రమైన నిరాశ ఎదురవుతోంది. అంతకుముందు కరోనా కారణం గా ఎవరింట్లో వారే గడిపే పరిస్థితిని జనం అనుభవిం చారు. ఇప్పుడు ఎండల వల్ల అనవసరమైన ప్రయాస ఎందుకని తమ కార్యక్రమాలను మార్చుకుంటున్నారు. అలాగే, పెళ్ళిళ్ళు వంటి శుభకార్యాలపై ఎండల ప్రభావం ఎక్కువగా ఉంటున్నాయి. అయితే, రాత్రిళ్ళు, తెల్లవారు జాము ముహూర్తాల కారణంగా కొంత ఊరట లభిస్తోం ది. నగరాలు, పట్ట ణాల్లో ధార్మిక సంస్థలు, సేవా సంస్థలు చలివేంద్రాలు తెరిచి తమ వంతు సేవా కార్యక్రమాలను అందిస్తున్నాయి.

అయితే , ఎండల తీవ్రత కారణంగా ఈ ఉపశమనాలు నామమాత్రమే. చాలా చోట్ల చలువ పంది ళ్ళు వేసి జనానికి ఉపశమనం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏమైనా ఎండల తీవ్రత ముందు ఈ ఉపశ మనాలు, సేవలను అరకొరగానే భావించాల్సి ఉంటుం ది. ఎవరి మటుకు వారు స్వీయ జాగ్రత్తలను తీసుకోవ డం ద్వారా ఎండల ప్రభావం నుంచి బయటపడాలే తప్ప అన్నింటికీ ప్రభుత్వాలపై ఆధారపడితే సాధ్యమ య్యే పని కాదు. చలువ పదార్ధాలను సేవించడం, ఎండల్లో ప్రయాణాలు మానుకోవడం, మంటినీటిని వీలైనంత ఎక్కువగా తాగడం వంటి జాగ్రత్తలు తీసుకోవ డం ఉత్తమం. ఇవి తాత్కాలిక ప్రయత్నాలు. అసలు భూతాపం పెరగడంవల్లే ఇన్ని అనర్థాలు. వాతావరణం లోకి కర్బన ఉద్గారాలను దట్టించడంవల్లే ఈ కష్టాలు. ఇదంతా స్వయంకృతం. మనిషి మేలుకుని పర్యావరణా న్ని కాపాడుకోకపోతే రానురాను ఈ మంటలు మరింత పరుగుతాయే తప్ప తగ్గవు. చిన్నపిల్లలకు వేసవి నుంచి ఉపశమనం కల్పించే గ్లూకోజ్‌ నీరు, నిమ్మరసం, బార్లీ వంటివి పానియాలు పట్టాలి. ఇంటి నుంచి పిల్లలు బయ టకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవి ప్రభావాన్ని తగ్గించే రీతిలో ఇళ్లకు వట్టివేళ్ల తడకలు, తాటాకు ఆచ్ఛాదనలు ఏర్పాటు చేయాలి. ప్రతి ఇంటిలో మట్టి కుండల్లో మజ్జిగ తర్వాణి ఏర్పాటు చేయాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement