Thursday, May 2, 2024

Editorial – ఆక‌లి మంట‌లు త‌గ్గుతున్నాయి….

మన దేశంలో ఆకలి మంటలు తగ్గుతున్నాయి. గడిచిన 15 ఏళ్ళలో 415 మిలియన్‌ ప్రజలు దారిద్య్రం నుంచి బయటపడ్డారని సాక్షాత్తూ ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ప్రైవేటుగా ఎవరో శాస్త్రవేత్తలు, పరిశోధ కులు ఈ విషయం చెప్పారంటే నమ్మశక్యంకాదు కానీ, ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ సంయుక్తంగా సేకరించిన సమాచారం లో ఈ వివరాలు ఉన్నాయి. కనుక అనుమానించాల్సిన పని లేదు. దేశంలో దారిద్య్ర నిర్మూలన కోసం అనేక కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. ముఖ్యంగా, గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం నిర్మూలన కోసం యూపీఏ ప్రభుత్వం అమలు జేసిన మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ కార్యక్రమం గ్రామాల్లో చాలా మార్పు తెచ్చింది. గ్రామాల్లో వ్యవసాయ కూలీలు దొరకడం లేదన్న మాట మొదటిసారి ఈ కార్యక్రమం అమలు తర్వాత వినిపిస్తోంది. అలాగే, భవన నిర్మాణ రంగంలో గతంలో మాదిరి కూలీల కోసం వెతుక్కునే పరిస్థితి ఇప్పుడు లేదు. అయితే, వారికి ఇచ్చే వేతనాల్లో తేడాలుంటున్న మాట వాస్తవమే. ఉపాధి హామీ పథకం గతంలో మాదిరిగా పటిష్టంగా అమలు జరగడం లేద న్న విమర్శలు ఉన్న మాట నిజమే. కేంద్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఈ పథకానికి తగినన్ని నిధులు కేటా యించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.

దారిద్య్ర నిర్మూలనకు ఈ పథకం శ్రీరామరక్ష అని పూర్వపు యూపీఏ ప్రభుత్వం భావించడమే కాకుండా, చిత్తశుద్ధి తో అమలు జరిపింది. ఆనాటి యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ పట్టుదల కారణంగా ఆహార భద్రతా పథకాన్ని కూడా ఆనాటి ప్రభుత్వం తీసుకుని వచ్చింది. ఆహార భద్రత, గ్రామీణ ఉపాధి పథకాలతో దారిద్య్రాన్ని పారద్రోలవచ్చని యూపీఏ ప్రభుత్వం త్రికరణ శుద్ధిగా విశ్వసించింది. ఆ పథకాల ప్రభావం దారిద్య్ర నిర్మూలన కు తోడ్పడిందని నిస్సందేహంగా చెప్పవచ్చు. అసలు పనులు లేకుండా ఎవరూ లేరనేది యధార్థం. గ్రామాల్లో కులవృత్తుల పునరుద్ధరణకు తెలంగాణ వంటి రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. కులవృత్తులను నమ్ముకున్న వారికి తిండికి లోటుండ దనేది పాత కాలపు సామెత. జనాభా పెరుగుదల విషయంలో కూడా మన దేశం చైనాను దాటిపోయింది. గత ఏప్రిల్‌లో మన దేశ జనాభా 142.86 కోట్లకు చేరు కుంది. దారిద్య్రాన్ని లెక్క తేల్చేందుకు కొలవదగిన వివిధ ప్రమాణాలను బట్టి పరిశీలన జరిపి 25 దేశాల్లో దారిద్య్రం తగ్గుముఖం పట్టినట్టు సమితి అభివృద్ధి కార్యక్రమం, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ బృందం తేల్చింది. ఈ ఇరవై ఐదు దేశాల్లోభారత్‌ కూడా ఉంది. మంచినీరు, ఆహారం, ఆవాసం, ఆహార్యం వంటి అంశాలను పరిగణ నలోకి తీసుకుని ఈ లెక్కలు తెెల్చారు. ఈ దేశాల్లో చైనా, కాంగో, హుండారాస్‌, ఇండోనేషియా, మొరాకో, సెర్బి యా, వియత్నామ్‌ ఉన్నాయి.

మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌, తదితర చిన్న దేశాలు అభివృద్ధిని సాధిస్తుంటే మన దేశంలో ప్రగతి విషయంలో వెనకబడుతోందని ప్రతిపక్షాలు తరచూ చేసే విమర్శల్లో నిజం లేదని ఈ అధ్యయన నివేదిక తెలియజేస్తోంది. గ్రామాల్లో ప్రజల జీవన ప్రమాణాలు క్రమంగా పెరుగుతున్నాయి. మంచి నీటి కోసం గతంలో మాదిరిగా ఇప్పుడు అవస్థలు పడటం లేదు. అలాగే, స్వచ్ఛభారత్‌ కింద పారిశుద్ధ్య కార్యక్రమాలను అమలు జేస్తుండటం వల్ల ప్రజల ఆరోగ్యం కూడా క్రమంగా మెరుగవుతోంది. గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న క్లినిక్‌ల ద్వారా పేదలకు వైద్య సౌకర్యం అందుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రవేశపెట్టి న గ్రామీణ మహిళలకు ఉజ్వల పథకం ద్వారా వంట గ్యాస్‌ కనెక్షన్లు లభిస్తున్నాయి. వంటగ్యాస్‌ కనెక్షన్లు లేని వారి శాతం 52.9 నుంచి 13.9 శాతానికి తగ్గింది. మంచి నీరు, విద్యుత్‌ వంటి మౌలిక సదుపాయాలు కూడా గ్రామీణ ప్రజలకు అందుతున్నాయి. పేదవారు మధ్య తరగతి వారిగానూ, మధ్యతరగతివారు ఎగువ మధ్య తరగతి వారిగానూ ఎదుగుతున్నారు.

గ్రామాల్లో ఇంట ర్నెట్‌ కనెక్షన్లు కల్పించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తు న్నాయి. వీటి ద్వారా ప్రపంచంలోఏ మూల ఏం జరిగినా మారుమూల గ్రామాల ప్రజలకు తెలిసే సౌలభ్యం లభిస్తోంది. కరోనా వంటి వ్యాధులను అరిక ట్టేందుకు భారత్‌ ఇతర దేశాలకు ఎంతో సాయపడింది. ముఖ్యంగా వ్యాక్సిన్ల ఉత్పత్తిలో మన దేశం అగ్రగామిగా నిలవడం వల్ల పేద వర్గాలకు ఉచితంగా వ్యాక్సిన్లు అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం విజయవంతంగా అమలుజే సింది. అంతర్జాతీయ సంస్థలు నిర్దేశించిన జీవన ప్రమా ణ సూచికలన్నింటినీ దాటుకుని ముందుకు సాగుతోంది. దారిద్య్ర నిర్మూలనకు ఇది ఎంతో తోడ్పడుతున్నది. వివిధ రాష్ట్రాల్లో దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తున్న నిరుపేదల కోసం ఇప్పటికే పథకాలు అమలులో ఉన్నా యి. అయితే సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల వాటి ఫలితాలు లబ్ధిదారులకు చేరడం లేదు. దేశంలో దారిద్ర నిర్మూలనకు అడ్డుపడుతున్న కారణాలు ఎన్నో.

Advertisement

తాజా వార్తలు

Advertisement