Monday, April 29, 2024

తిరుప్పావై – పాశురము-2

ఆండాళ్‌ తిరువడిగలే శరణం

వై యత్తు వాళ్ల వీర్‌ గాళ్‌! నాముమ్‌ నమ్బావై క్కు
చ్చయ్యుఙ్గిరిశైగళ్‌ కేళిరో, పాఱ్కడలుళ్‌
పైయ త్తుయిన్ఱ పరమ నడిపాడి
నెయ్యుణ్ణోమ్‌ పాలుణ్ణోమ్‌ నాట్కాలే నీరాడి
మై యిట్టే ళుదోమ్‌ మలరిట్టు నామ్‌ ముడియోమ్‌
శెయ్యదన శెయ్యామ్‌ తీక్కుఱళై చ్చెన్ఱోదోమ్‌
ఐయమమ్‌ పిచ్చైయు మాన్దనైయు ఙ్గైకాట్టి
ఉయ్యు మాఱణ్ణి యుగన్దేలో రెమ్బావాయ్‌.

ఆండాళ్‌ తిరువడిగలే శరణం

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌ స్వామి వారి మంగళశాసనములతో…

తాత్పర్యము :
శ్రీకృష్ణ భగవానుడవతరించిన కాలమున ఈ భూలోకమున పుట్టి దు:ఖమయమగు సంసారమున ఆనందము ననుభవించుచున్న అదృష్టవంతులారా! మేము మా వ్రతమును ఆచరించు విధానమును తెలిపెదము. తెల్లవారుఝామున లేచి, స్నానమాడి, క్షీరసాగరమున మెల్లగా పడుకొనియున్న పరమ పురుషుని పాదములను కీర్తించెదము. నేతిని భుజింపము. పాలను ఆరగింపము. కంటికి కాటుక పెట్టుకొనము. పూలను ముడువము. పెద్దలు చేయని వానిని చేయము. ఇతరులపై చాడీలు చెప్పము. దానమును భిక్షమును పుచ్చుకొను వారికి తృప్తి కలుగునంత వరకు ఇచ్చి ఉజ్జీవించు విధమున అరయుదుము.

- Advertisement -

మొదటి పాశురమున రేపల్లెలోని పడుచులను మాత్రమే పిలిచిరి. కాని ఈ పాశురమున భూమండలములో నున్న వారందరిని ఆహ్వానించుచున్నారు. దీని వలన ఈ వ్రతము ఒక్కరేపల్లెలోని వారికే కాక ఈ ప్రపంచమున భగవదనుభవరుచి గలిగి తరింప దలచిన వారందరికి సంబంధించినది అని తెలియదగును. ‘భగవద్గుణములందు వ్యామోహము కలిగిన మీవంటి వారు చెప్పు హరికథా శ్రవణమే పురుషార్థము. ఈ పాలు పెరుగు నేయి యుండగా ఇతరములగు పాలు పెరుగు నేయి మాకు వలదు. ఇంద్రియనిగ్రహమును మనో నిగ్రహమును అలవరుచుకొనుటకు ఈ నియమములను ఆచరింతుము’ అని, అన్ని శుభములకు ఆనందములకు భగవానుని నామ సంకీర్తనమే ఉత్తమ సాధనమని తెలుపగోరిరి.

డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు

Advertisement

తాజా వార్తలు

Advertisement