Thursday, July 25, 2024

శ్రీకృష్ణుని మురళీగానం…గోపికల తాదాత్మ్యం

గోపికలు శ్రీ కృష్ణ పరమాత్మ పట్ల చూపిన భక్తి సర్వోత్కృష్టమైనది. వారు ఏ లౌకిక, పారలౌకిక, ఫలాలను ఆపేక్షించక శ్రీ కృష్ణుని ప్రేమించారు. ఆరాధించారు. సర్వము అర్పించారు అందుకే వారి అనన్యభక్తి యుగాలైనా స్థిరంగా ప్రసిద్ధి పొందింది.
శరధాత్రి చల్లని వెన్నెల పుడమి తల్లినంతటా కప్పేసింది. ఆ రోజు శ్రీకృష్ణుడు యమునా నదీతీరంలో బృందావనం వచ్చి, లోకా న్ని సమ్మోహంప చేయడానికి, మోహన గీతాన్ని మురళిపై ఆలాపిస్తు న్నాడు. ఆ మధుర గానానికి పరవసించి దాలిపై కాగుతున్న పాలు దించకుండానే, దూడలను విడిచి పాలు పితకడానికి సిద్ధమై కూడా పాలు పిండకుండానే, భర్తలకు సేవచేయకుండా నిలువలేక, పూలు ధరించకుండానే కేశములు సవరించుకోకుండానే, కాటుక చక్కగా దిద్ధుకోకుండానే, స్తనములపై చందన లేపనం చేయకుండానే, భర్త, అత్తమామలు, సవితులు, తోబు ట్టువులు, అందరూ అడ్డము వచ్చి వారించినా, వినకుండా, మబ్బు ల నుండి వెలువ డే మెరుపు లాగ, ఆ మురళీ గానానికి ముగ్దులై, శ్రీ కృష్ణ తాదాత్మ్యాన్ని పొందడానికి బయలుదేరి ఆ గోపికలు అందరూ బృందావనం చేరారు. శ్రీ కృష్ణుడు వాళ్ళకు కనప డలేదు. ఆయన తక్కువ వాడా? అపుడు కనపడుతున్న మల్లె తీగలతో —
”నల్లని వాడు, కమలములు వంటి కన్నులు కలవాడు,
కరుణా రసము చిందించెడి వాడు, సిగపై నెమలిఫించము
కలవాడు, చిరునగవుల మోము వాడు, అయిన ఒక పురుష
పుంగవుడు మానినుల మానధనం దోచి ఇటువచ్చాడమ్మా!
మల్లి తీగలారా! మీ పొదల మాటున లేడు గదా! ఉన్నట్లౖౖెతే
కొంచెం చెప్పండమ్మా!” అంటూ కొందరు గోపికలు వెదుకుతూ ఉంటే, మరి కొందరు ”కృష్ణా! నీ చరణ పద్మాలను సంప్రీతితో చేరడానికే తప్ప, మరలి పోవడానికి కాళ్ళు రావు. నీ #హస్త కమలాలను పట్టుకోవడానికే తప్ప, వేరే పనులకు మా చేతులు పూనుకోవు. నీ వచన, గాన సుధారసం ఆప్యాయంగా ఆస్వాదించడానికే తప్ప ఇతర మాటలు వినడానికి మా చెవులు ఇష్టపడవు. నీ మనోహరాకారం ఎల్లప్పుడూ దర్శించడానికే తప్ప మా కళ్ళు మరి దేనిని చూడవు. నీ నామ గుణాలనే తప్ప మరేదీ మా నాలుక ఉచ్చరించదు కదా! మరి నీవో మా మనస్సులను మురిపించి అపహ రించే వాడవు. మేము ఏమి చేయగలం? అంటూ అక్కడా, ఇక్కడా వెతుకుతూ, మరి కొందరు, కొంతమంది గోపికలు ”ఓ! లవంగ వృక్షము లారా! మాధీఫల తరువులా రా! చూసినంత మాత్రంగానే మన్మథుని కూడా కరిగించేవాడు, మోహనరూపుడు, తన మురళీగానంతో ఆకట్టుకొనేవాడు, అయిన నందగోప బాలకుడు ఇటు వెళ్ళా డామ్మా! దయతో ఆయన జాడ తెలపండమ్మా! అంటూ కనపడిన చెట్లను, మొక్కల ను అడుగుతుంటే, మరికొందరు ”ఓ! తులసీ! నీవు గోవింద చరణారవింద ప్రియురా లవు కదా మాధవుడు ఆదరింపగా, నువ్వు శుభాలు, మన్ననలు పొందుచున్నావు. ఒ కవేళ శ్రీకృష్ణుడు నీ చెంతకు చేరేడా ఏమి? వస్తే మా మనోవ్యధ ఆయనకు చెప్పి, మా వద్దకు పంపడమ్మా! ఇలా తనువులు మరచి, గోపాంగనలు, బృందావనంలోని అన్నింటినీ అడుగుతూ, చొరరాని దారుల్లో కమలం, ధ్వజం, నాగలి, వజ్రం, కలశం, అంకుశం మొదలగు శుభలక్షణాలచే మనోజ్ఞములైన గోవిందుని అడుగు జాడలు గుర్తించి, ముందుకు సాగుతూ, తమలో తాము ఇలా మదన పడుతున్నారు.
”నాథా ! నీవు జన్మించిన కారణంగానే గోకులంలో సిరి సంపదలు పొంగుతు న్నాయి కదా! మేము నీ కోసం పరితపిస్తూ కనపడిన వృక్షాలను, తీగలను, అన్నింటినీ నీ జాడ అడుగుతూ, నీ కోసం వెదుకుతున్నాము. నీ మనోహర రూపం ఒకసారి చూప రాదా! అందగాడా! శరత్కాలపు కమలగర్భంలోని జిగినిని దొంగలించిన నీ చూపుల వల్ల నిన్ను వలచి జీతబత్తెములేని దాసీలమయ్యాము. అటువంటి మమ్ము ధీరుడవై ఇలా బాధపెట్టడం సమంజసమేనా? కమలాక్షా! నీవు కేవలం యశోద కుమారుడవే కాదయ్యా! నిఖిల దేహదారుల బుద్ధికి సాక్షీభూతుడవైన అంతరాత్మవు. పరమేశ్వ రుడవు. పూర్వం విరంచి (బ్రహ్మ) నిన్ను స్మరించి విశ్వరక్షణ గావించమని వేడుకోగా, ఈ జగత్తు అంతా ఉద్ధరించేందుకు ఇలా మనోజ్ఞ రూపంతో యదువంశంలో పుట్టి కీర్తి ని తెచ్చావు కదా! నీ పాదాలను కొలిచే వారికి సంసారం వల్ల కలిగే భయాన్ని తొలగించే ది, లక్ష్మీ అనుగ్రహం కలిగించేది, అభీష్టాలను అందించేది అయిన నీ కరకమలాలల ను మా శిరస్సులపై ఉంచి మాకు శాంతి చేకూర్చు స్వామి! లక్ష్మీ వల్లభా! పండితుల కు ఇంపుకూర్చునది, చక్కగా ఉచ్చరించునది, మధురమైనది, అయిన నీ మాటలు మమ్ములను వెంటాడుతూనే ఉన్నాయి. కమలాక్షా! మా విరహాన్ని చూసైనా, మాకు కనపడవా? అయ్యో! ఆడవారి పట్ల ఇంతటి క్రూరత్వము చూపదగునా? నీ దరహా సాలు, నీ ఓరుగంటి చూపులు, పలువిధాలైన నీ విహారాలు, నీ ధ్యానము, మా హృద యాలలో నాటుకొని మర్చిపోలేకున్నాము.
గొప్ప సిరితో కూడుకొన్నదై, శ్రవణ మాత్రముననే శుభములను ఇచ్చేది, మాలో ని కామ, క్రోధాదులను నశింపచేసేది, సనకసనందనాది యోగీశ్వరులు చేత కొనియా డబడినది, ఘోరమైన తపస్సులతో నిన్ను ఆరాధించే పురుష పుంగవులకు ఆనందా న్నిచ్చేది, ఎంతో మధురంగా ఉన్న నీ కథాసుథామృతం కేవలం దానాలు చేసేవారికి, నామ మాత్రపు భక్తిని కలిగి ఉన్న వారికి ఏమంత రుచింపదు కదా. దానిలోని మథు రానుభూతి వారు పొందలేరు సుమా! కృష్ణా! నీ నవ్వులు, నీ చూపులు, పలువిధము లైన నీ విహారాలు, పరహాస వచనాలు, మా హృదయాలలో నాటుకొని ఉన్నాయి సు మా! నీ పిల్లనగ్రోవి ముద్దులందుకొనేది, ఇతర అనురాగాలను అతిశయించునది, అయిన, నీ తీయని కెమ్మోవి (పెదవులు) పానకముచే మా తాపం చల్లార్చవా! రమా నాయకా! నువ్వు పగటిపూట బృందావనంలో తిరగడం వల్ల, ఉంగరాలు తిరిగిన నీ ముంగురులు వల్ల మరింత ప్రకాశించే నీ మోము తృప్తి తీరే వరకు తిలకించలేక పోతు న్నాము. అందువల్ల క్షణం ఒక యుగంగా గడుస్తోంది.
మాధవా! మన్మథుని బాణాలు నివారింపరాని వైనందున, మమ్ములను బాధపె డుతూంటే, భయపడి నీ కాళ్ళు పట్టుకోవడానికి వచ్చాము. ఇలాంటి మమ్ములను ఈ నట్టడవిలో వదిలేసి వెళ్ళడం నీకు న్యాయమా? ధర్మమా! గోవిందా, ముకుందా, మా మనోహతాన్ని గ్రహంచి, కనపడవా? అంటూ ఆ గోపికలు శ్రీ కృష్ణుని గుణగణా లను స్తుతిస్తూంటే మన్మథుడై, త్రిజగన్మోహనారూపుడు, అందాన్నిచ్చే హారములను ధరించి శ్రీ కృష్ణ పరమాత్మ వారి ముందు సాక్షాత్కరించాడు. గోపికలు అనన్య భక్తితో ఉండబట్టే శ్రీకృష్ణుడుతో అంతటి అనుబంధం కలిగి, ప్రత్యక్షానుభవం పొందారు. ఇలాగే కృష్ణ భక్తులు శ్రీ చైతన్య మహా ప్రభువు, శ్రీ వల్లభాచార్యులు వంటి వారు కూడా శ్రీ కృష్ణ పరమాత్మతో స్వీయానుభవాన్ని పొందగలిగారు. మనం మనశక్తి మేరకు శ్రీకృష్ణుడునే శరణు వేడదాం! ఆయన ఆశీస్సులు పొందుదాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement