Saturday, May 18, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 8, శ్లోకం 17

17.
సహస్రయుగపర్యంతమ్‌
అహర్యద్బ్రహ్మణో విదు: |
రాత్రిం యుగసహస్రాంతాం
తే హోరాత్రవిదో జనా: ||

తాత్పర్యము : మానవపరిగణనము ననుసరించి వేయియుగముల కాలము బ్రహ్మదేవునికి ఒక పగలు కాగలదు. అతని రాత్రి సైతము అంతే పరిమాణమును కలిగి యుండును.

భాష్యము : ఎంత కాదన్నా భౌతిక ప్రపంచము యొక్క కాలము పరిమితమైనది. అది బ్రహ్మ యొక్క వంద సంవత్సరములు ఉంటుంది. బ్రహ్మ యొక్క పగలు వెయ్యి చతుష్యుగాలను కలిగి ఉంటుంది, అనగా సత్య యుగము (17,28,000 సం||), ద్వాపర యుగము (12,96,000 సం||), త్రేతా యుగము (8,64,000 సం||) కలియుగము (4,32,000సం||) అనగా బ్రహ్మ యొక్క 12గం||లు గడిచే సరికి 43,20,000సంవత్సరములు గడుచును. అలా ఆయన వంద సంవత్సరములు గడిచే సరికి మన ప్రకారము 311 ట్రిలియన్ల 40 బిలియన్ల సంవత్సరాలన్న మాట. మనకు ఇది ఎంతో ఆశ్చర్యాన్ని ఇవ్వవచ్చునేమోగాని, కారణోదకశాయి విష్ణువుతో పోల్చుకుంటే ఇటువంటి బ్రహ్మలు సముద్రములో నీటి బడుగలవలె అనేకమంది వస్తూ పోతూ ఉంటారు. ఎన్నో జన్మలు సన్యాసమును నిక్కచ్చిగా పాటిస్తే గానీ బ్రహ్మలోకవాసులు కాలేరు. అయితే ఆ బ్రహ్మ, ఆయన లోకవాసులకే జన్మమృత్యు జరా వ్యాధి తప్పదు. ఇది భౌతిక ప్రకృతి యొక్క నియమము.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement