Thursday, April 25, 2024

ధర్మం మర్మం (ఆడియోతో..)

శ్రీరామనవరాత్రులలో చైత్రశుద్ధ విదియ యొక్క విశిష్టత గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

చైత్ర శుద్ధ విదియ నాడు ప్రపాదానం చేయాలి అంటే చలివేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. చైత్రశుద్ధ విదియ నుం డి శ్రావణ శుద్ధ విదియ వరకు అనగా నాలుగు నెలలు ప్రపాదాన వ్రతము ఆచరించాలి.
తమ శక్త్యానుసారంగా 12,8,6,4 లేదా 2 ఘటములలో నీరు నింపి నాలుగు దారుల కూడలిలో, జనసంచారం, సూర్యుని ప్ర తాపం అధికంగా ఉన్నచోట నీరు దొరకని చోట చలివేంద్రమును ఏర్పాటు చేయాలి. మానవులకే కాక వేసవి తాపాన్ని తట్టుకోలేని పశుపక్ష్యాదుల కోసం వెడల్పాటి మట్టి పాత్రలో నీటిని నింపి చెట్టు నీడలో ఉంచాలి.

సహస్రం అశ్వమేధానాం పరమాప్నోతి మానవ:
ప్రపాదానం నర: కృత్వ ఇహాముత్రచ పుణ్యభాక్‌

అని శివపురాణం ఉవాచ. అనగా ప్రపాదానము చేసిన వారు వెయ్యి అశ్వమేధ యాగముల ఫలం పొంది ఇహపరములలో పుణ్యం పొందుదురు. అధేవిధంగా పితృదేవతలు కూడా తృప్తి చెందుతారు.

ప్రపేయం సర్వసామాన్య భూతేభ్య: ప్రతిపాదితా
అస్యా: ప్రదానాత్‌ పితర: తృప్యంతిచ పితామహా:

- Advertisement -

ప్రపాదానము చేసినప్పుడు పై మంత్రమును పఠించాలి.
అనగా ఈ ప్రప సకల ప్రాణులకు సామాన్యమైనది. ఈ ప్రపాదానము వలన పితరులు, పితామహులు తృప్తి పొందుదురుగాక. ప్రపాదానము చేయలేని వారు ఒక్క కుండెడు పరిశుభ్రమైన చల్లని నీటిని సద్బ్రాహ్మణుని ఇంట దానమీయాలి. దీనిని ‘ధర్మఘటం’ అని అంటారు. ఈ ధర్మఘట దానము వలన సకల కోరికలు తీరును. ఈ విధంగా నాలుగు నెలలు చేయాలి. శక్తి లేని వారు చేయగలిగిన న్ని రోజులు చేయాలి. ఈ రీతిలో ధర్మఘటము దానము చేసినవారు కూడా ప్రపాదాన ఫలితము పొందుతారు.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement