Monday, May 27, 2024

బుద్ధుని ధర్మపథం…!

బుద్ధుడు కేవలం మానవమాత్రుడననే చెప్పుకున్నాడు. ఏ దేవుని ద్వారానో మరే యిత ర బాహ్యశక్తి ద్వారానో, ప్రేరణ పొందానని చెప్పుకోలేదు. మత ప్రవక్తలందరిలోనూ ఒక్క బుద్ధుడు మాత్రమే తానొక సామాన్య మానవుడ్ని అని చెప్పుకున్నాడు.
బుద్ధుడు క్రీ.పూ 6వ శతాబ్దంలో ఉత్తర భారతదేశంలో జీవించాడు. ఆయన తండ్రి శుద్దోదనుడు శాక్యరాజ్యానికి రాజు. ఆయన తల్లి మహారాణి మాయ. బుద్ధుడు గౌతమ గోత్రీయుడు, పదహారు సంవత్సరాల వయసులో సిద్దార్థునికి వివాహం శ్రద్ధా సౌందర్యాల రాశి ‘యశోధర’తో జరిగింది. ఆనాటి ఆచారం ప్రకారం యువరాజు తన ప్రాసాదంలో భోగా లన్నిటి మధ్య నివసించాడు.
అకస్మాత్తుగా జీవిత సత్యాన్ని, మానవ దు:ఖాన్ని తెలుసుకున్నవాడై, ఈ సార్వజనీనమై న దు:ఖం నుండి నివృత్తి కలిగే మార్గాన్ని అన్వేషించాలనుకొన్నాడు. తన ఒక్కగానొక్క బిడ్డ ‘రాహులుడు’ అప్పుడే పుట్టినప్పటికి, తన రాజ్యాన్ని విడచి దు:ఖ నివృత్తి మార్గం అన్వేషించ డానికి పరివ్రాజిక జీవితాన్ని ఇరవై తొమ్మిదేండ్లు వయస్సులో స్వీకరించాడు.
అనేక ఆచార్యులను కలుసుకొంటూ, వారివద్ద విద్య నేర్చుకొంటూ, వారి మతాలనూ సాధనా పద్ధతులను అనుసరిస్తూ గంగా పరివాహ ప్రాంతమంతా తిరిగాడు. వారెవరూ ఆయనను సంతృప్తి పరచలేకపోయారు. ఈ కారణంవల్ల అతడు అన్ని పరంపరాగత ధర్మా లను, వాటి సాధనా పద్ధతులనూ వదలి, తనదైన దారిన ముందుకు సాగాడు. అలా ఒకరోజు రాత్రి బుద్ధగయలో, నేరంజరానది ఒడ్డున, ఒక చెట్టు నీడలో 35వ ఏట సంబోధిని పొందా డు. నాటి నుండి అతను ‘బుద్ధుడు’గా లోక విఖ్యాతి గాంచినాడు. ఆ వృక్షం బోధి వృక్షమైంది.
సంబోధి పొందిన పిదప ఆయన తన ప్రథమ ఉపదేశాన్ని తన పూర్వ సహచరులైన పంచవర్గీయ బిక్షువులకు చేశాడు. నాటి ఉపదేశ స్థలం కాశీ దగ్గరలోని ఋషి పట్టణం (సారనాథ్‌)లోని హరిణవనం (మిగదయ). ఆరోజు మొదలుగా నలభై ఐదు సంవత్సరాలు- రాజులు- రైతులూ, బ్రాహ్మణ- చర్మకారులకు, ధనిక- దరిద్రులూ, సాధువులు- దొంగలూ అనే వ్యత్యాసం చూపక అన్ని వర్గాల స్త్రీ, పురుషులకూ ఆయన ధర్మబోధ చేశాడు. ఆయన ఏ సామాజిక విభాజనలనీ, కులభేదాల్ని పరిగణలోనికి తీసికొనలేదు. ఆయన ఆర్య మార్గానికి ద్వారం. ఆయన బోధనలను అర్థం చేసుకొని, ఆచరించ గలిగిన వారికీ తెరచి ఉంటుంది.
ఈ ప్రపంచంలో పుట్టిన అందరిలోనూ సర్వశ్రేష్ఠుడు అని శ్లాఘించిన విశ్వకవి మాటల్లో నిజం లేకపోలేదు. అంతేగాదు బుద్ధుడే ఈ దేశానికీ, యావత్‌ ప్రపంచానికీ ధార్మిక గురువును చేశాడు. ‘నబూతో న భవిష్యతి’ అనదగిన ఆయన వ్యక్తిత్వమూ, ఏ అసమానతలూ, కార్ప ణ్యాలూ, లేని ఆయన ధర్మమూ 2500 సంవత్సరాలుగా అన్ని జాతుల వారినీ, అన్ని ఖండాల వారిని ఆకర్షిస్తున్నాయి. ఆయన ధర్మంలో కాల్పనిక సిద్ధాంతాల చర్చలకూ మూఢ నమ్మకా లకు తావులేదు. ఆయన ధర్మము వాస్తవికమూ, హేతుబద్దమూ అయింది. విజ్ఞాన వేత్త అయి న ‘ఐన్‌స్టీన్‌’ వైజ్ఞానిక యుగంలో ఆయన ధర్మమే ఆమోదయోగ్యమంటాడు.
అవైదిక పరంపర అయిన శ్రమణ పరంపరకి ఎనలేని గౌరవాన్ని తెచ్చి యావత్‌ భారత దేశానికి, ఆమోద యోగ్యం చేసినవాడూ, వేద బాహ్యమైన పునర్జన్మ సిద్ధాంత వాస్త వి కతను స్పష్టం చేసి కర్మ సిద్ధాంతానికి పూర్తి రూపు కల్పించినవాడూ, నేడు సైతం ఎంతో ప్రాముఖ్యం సంతరించుకొన్న అద్వైత వేదాంతానికి ప్రేరణా స్తోత్రం అయిన బుద్ధుడు, తర్వాత పుట్టుకొ చ్చిన హిందూ మతంపై అత్యున్నత ప్రభావాన్ని కలిగించాడు.
ఒకనాడు భగవానుడు కోసల రాజ్యంలోని కేశపుత్రమనే నిగమానికి వెళ్ళినప్పుడు ఈ క్రింది విధంగా సలహానిస్తాడు. ఇది మతాల చరిత్రలో మరెక్కడ కానరాదు.
”అవును కాలములారా! (నిగమవాసులను ‘కాలాము’లని పిలుస్తారు) మీకు శంకా సం దేహాలు కలగటం సహజమే మీకు అవి కలుగవలసిన విషయంలోనే కలిగాయి. మీరెప్పుడు ‘అను శ్రవణం’ వల్లనో, అనుశ్రుతి వల్లనో నిర్ణయానికి రావొద్దు. శాస్త్రాలు ఉద్ఘోషించాయనో, తార్కికంగా ఉందనో వినడానికి సొంపుగా ఉందనో, ఊహావాదాల పట్ల ఉత్సాహం వల్లనో, ఇతడు నా గురువు అని నమ్మడం వల్లనో, దేనినీ నమ్మవద్దు. కాలాము లారా! ఎప్పుడైతే మీకు మీరే కొన్ని విషయాలు చెడ్డవిగా గుర్తిస్తారో వాటిని వదలివేయండి.
ఏ విషయాలు మంచివిగా గుర్తిస్తారో అప్పుడే వాటిని అంగీకరించి అనుసరించండి. బుద్ధుడొసగిన ఆలోచనా స్వేచ్ఛ మాత్రమే కాక ఆయన ప్రోత్సహించిన పరమత సహనం సైతం చరిత్రాధ్యయన పరులని విస్మయానికి గురిచేస్తుంది. ప్రతి ఒక్కరి మతాన్ని ఆదరించి సహాయం చేయండి. తన ధర్మాన్ని మాత్రమే గౌరవిస్తూ యితర ధర్మాలను తూలనాడటం కూడదు. అనేక కారణాలవల్ల యితర ధర్మాలను సైతం గౌరవించాలి. ఈ విధంగా ప్రవర్తించే వాడు తన ధర్మాన్ని వికసింపజేసుకోవడం మాత్రమే కాక ఇతరుల ధర్మాలకు సైతం సాయ పడతాడు.ఇతరులచే ప్రవచితమైన ధర్మాలను వినడానికి సిద్ధంగా ఉండండి. బుద్ధ తత్వాన్ని కోరుకొని ప్రయత్నించే ప్రతి వారిలోను దాన్ని పొందకలిగే సామర్థ్యం ఉంది. బుద్ధునిలో మహోన్నతమైన మానవత్వం చూడవచ్చు.
అశోక చక్రవర్తి, బుద్ధ ధర్మాన్ని తెలుసుకొని మారినవాడై బౌద్ధుడయ్యాడు. కళింగ యుద్ధం తర్వాత చక్రవర్తి తన పశ్చాతాపాన్ని వెల్లడించాడు. ఆ మానవ సంహారాన్ని గుర్తు చేసుకోవడం తనకత్యంత బాధాకరమని అన్నాడు. తన ఖడ్గాన్ని మరెన్నడూ, పరులను జయించడానికి ఎత్తనని, దానికి బదులుగా తాను ”అన్ని ప్రాణులకై అహింసా, ఆత్మసంయ మూ, సౌమ్యతా, మృదుతలను ఆశిస్తానన్నాడు. యుద్ధాన్ని హింసను త్యజించి శాంతి, హింసల వైపు వచ్చిన ఈ సంఘటన మానవ జాతి చరిత్రలోనే గుర్తుంచుకోదగినది.”
నేటి ప్రపంచానికిదో గొప్పపాఠం. వేర్వేరు భౌగోళిక మహాశక్తుల మధ్య సమతూకాన్ని స్థాపించడం ద్వారానో అణ్వస్త్రాల బూచిని చూపడం ద్వారానో శాంతిని కొనసాగించడం సాధ్యమనే వాదన సరైంది కాదు. అణ్వస్త్రాల శక్తి, భయాన్ని సృష్టించగలదే కానీ శాంతిని కాదు. భయం కేవలం ద్వేషం, దుర్భావన, శతృత్వానికి మాత్రమే జన్మనిస్తుంది. నిజమైన శాంతి భయ సందేహాలూ, ప్రమాదం లేని మైత్రీభావం వలననే సాధ్యం.
అధికారం కొరకు జరిగే విధ్వంసక సంఘర్షణ పరిత్యక్తమైన సమాజం. జయాపజ యాలకు దూరంగా శాంతీ, సౌహార్ద్రతలు పరిఢవిల్లే సమాజం, అమాయకులు అణచివేతకు గురికాని సమాజం, తనను తానే జయించిననాడు, అణ్వస్త్రాలు, ఆర్థిక అస్త్రాలు అపజయా నికి తోడ్పడతాయని భావించే సమాజం మనకు కావాలి.
నేటి ప్రపంచం అనుక్షణం భయ సందేహాలూ, ఒత్తిడుల మధ్య బ్రతుకుతోంది. సైన్సు ఊహాతీతమైన వినాశనాన్ని సృష్టించగల అణ్వస్త్రాలను తయారు చేసింది. ఈ ఆయుధాలను ఝుళిపిస్తూ అణ్వస్త్ర దేశాలు ఒకదాన్నొకటి బెదిరించుకొంటున్నాయి.
ఇతరుల కంటే తామెక్కువ వినాశనాన్ని సృష్టించగలమని, నిస్సిగ్గుగా చెప్పుకొంటు న్నాయి. ఈ పిచ్చితనం ఎంతవరకూ వచ్చిందంటే, ఈ దిశలో మరొక్క అడుగు పరస్పర హాసనమూ, సంపూర్ణ మానవ జాతి నాశనం తప్ప మరేమి కాబోదు. తామే సృష్టించిన ఈ పరిస్థితి చూసి భయబీతులైన మానవులు దీని నుండి బయటపడే దారినీ దీనికొక సమాధా నాన్ని వెతుకుతున్నారు. అయితే బుద్ధుడు సూచించిన దారి తప్ప మరే దారిలేదు. ఆయన సందేశాలైన అహింస, శాంతి, ప్రేమ, కరుణ, సహనము, సానుభూతీ, సత్యమూ, వివేకమూ, అన్ని ప్రాణుల పట్ల గౌరవాదరములూ స్వార్థం నుండీ, ద్వేషం నుండీ, హింస నుండీ విముక్తి పొందడమే ఆ మార్గం. భగవానుడంటాడు వైరభా వం వలన శాంతించదు. కేవలం ప్రేమ వలననే శాంతి లభిస్తుంది. ఇదే మన సనాతన ధర్మం.

Advertisement

తాజా వార్తలు

Advertisement