Monday, May 20, 2024

హరిహరమూర్తి

పరమశివుని లీలామూర్తులలో పదమూడవ మూర్తి హరిహర మూర్తి. అనగా ఆయన శరీరంలో సగభాగం శ్రీ మహావిష్ణువు స్వీకరించారు. అలా పరమశివుణ్ణి ప్రసన్నుడిని చేసుకొని శరీరంలో సగభాగమును స్వీకరించిన మూర్తిని హరిహరమూర్తి అంటారు.
”నీవు ఎటువంటి భక్తితో ఎటువంటి ఉపాసన చేసి శంకరుని అర్ధ భాగమును పొందావో ఆ ఉపాయమును నాకు చెప్పవలసినది” అని పార్వతీదేవి నారాయణుణ్ణి ప్రార్థన చేస్తే, శ్రీమన్నారాయణుడు పార్వతీదేవికి ఉపదేశం చేసిన స్తోత్రమే శివాష్టోత్తర శతనామ స్తోత్ర ము. ఈ శివాష్టోత్తర శతనామ స్తోత్రమును ఆధారము చేసుకొని పార్వతీదేవి శంకరుని శరీరంలో అర్థ భాగమును పొందింది. అది పదునాల్గవ స్వరూపము. దానిని అర్ధనారీశ్వర స్వరూపము అని పిలుస్తారు. మనుష్య జన్మ ప్రయోజనం భగవంతునితో ఐక్యమే కనుక శివాష్టోత్తర శతనామ స్తోత్రమును ప్రదోష వేళలో చదవడం ఇహమునందు సమస్త కోరికలు తీరుస్తుంది. పరలోక సుఖాన్ని, భగవంతుని అనుగ్రహాన్ని మనయందు ప్రసరింపజేస్తుంది.
‘శివో మహేశ్వర:’ అని పిలుస్తారు.
‘మహేశ్వర:’ అనబడే నామము చిత్రమయిన నామము. మంత్రపుష్పం చెప్పినప్పుడు-
ఈశానస్సర్వవిద్యానా మీశ్వరస్సర్వభూతానాంబ్రహ్మాధిపతిర్‌!
బ్ర#హ్మణోధిపతిర్‌! బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం!!
అని చెపుతాము. సర్వమంగళములకు కారణం అయినవాడు, సర్వ జగన్నిమాయకుడు, సృష్టి స్థితి లయలు చేసేవాడు తానొక్కడే అయివుండి, కాని సృష్టి చేసినప్పుడు ఒకడిగా, స్థితి కారకుడిగా ఉన్న ప్పుడు ఒకడిగా, లయకారకుడిగా ఉన్నప్పుడు ఒకడిగా, మూడుగా కనపడుతూ ఆయన అనుగ్రహము చేత జ్ఞానము కలిగినప్పుడు అవి మూడు కావు ఒక్కటే అన్న జ్ఞానము ఎవరి నుంచి ప్రసరిస్తుందో ఆయ న మహేశ్వరుడు. ఆయనే మూడుగా కనపడే ఒక్కడు. అందుకే పోతనగారు భాగవతంలో ఒకచోట ఒకమాట అంటారు-
”ఆ మూఁడు మూర్తులకును మూఁడు లోకములకు,
మూఁడు కాలములకు మూలమగుచు
భేద మగుచుఁ దుది కభేదమై యొప్పారు,
బ్ర#హ్మమనఁగ నీవే ఫాలనయనా! (భాగ- 8-227)
మనము సృష్టి స్థితి లయ అని మూడు మాటలు వాడుతుంటా ము. మనలో చాలామందికి ఒక తప్పు అభిప్రాయం ఉంటుంది. రుద్రుడు లేదా శివుడు అనేసరికి ఆయన సంహారకర్త, లయకారుడు, ఆయన సంహేరిస్తాడు అని అనుకుంటారు. అన్నివేళలా లయము అనే శబ్దమునకు అర్థం కేవలం చంపివేయడం కాదు. పరమశివుడు చాలా ఉదారుడై ఉంటాడు. మనకు లయమునందు ‘స్వల్పకాలిక లయం’ అని ఒకమాట ఉన్నది. గాఢనిద్ర పట్టినట్లయితే ఆ నిద్రలో దు:ఖం తెలియదు. హాయిగా నిద్ర పట్టింది అంటాడు. ఆ హాయి అనే ది ఏమిటి? మనస్సు లేకపోవడమే హాయి. గాఢనిద్రలో ఉన్న స్థితిలో మనస్సు ఆత్మలోకి వెళ్ళిపోయి ఆత్మగా ఉండిపోతే ఎంతో సంతోషం గా ఎంతో హాయిగా ఉంటుంది. ఆ స్థితిలో బాహ్యమునకు సంబంధిం చిన ఎరుక అంతా ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు గొప్ప ఆనం దాన్ని పొందుతాడు. ఇలా ఆనందమును పొందిన స్వరూపంఏదైతే ఉన్నదో ఆ ఆనందమే పరమశివుడు. పొందిన ఆ నిద్రను స్వల్పకాలిక లయం అని పిలుస్తారు. తెల్లవారి నిద్రలేవగానే మనస్సు మేల్కొనడం అనగా ఆత్మ నుంచి విడివడుతుంది. యథార్థానికి సృష్టి స్థితి లయ అనేవాటిని ఇక్కడే దర్శనం చెయ్యాలి. అది మహేశ్వర స్వరూప దర్శ నం అవుతుంది. తెలివి రాగానే మనం చేయవలసిన పనులకు సంబం ధించి ఏదో ఒక ఆలోచన వస్తుంది. ఆలోచన అనేది మనస్సు స్వరూ పం. ఆత్మగా ఉండి మొదటి ఆలోచనను చూసినట్లయితే దాని ఆలోచ నలను చూడడం అలవాటు అవుతుంది. ఇదే సృష్టి. చతుర్ముఖ బ్రహ్మ దర్శనం. బ్రహ్మకి పూజలేదు. సంకల్ప దర్శనం చేత మాత్రమే బ్ర#హ్మ దర్శనం చేస్తారు. సృష్టి ప్రారంభం అయింది. అనగా మనస్సు బయ టకు వచ్చింది. ఇప్పుడు స్థితి కావాలి. స్థితి అంటే నిర్వహణ శక్తి. మనస్సు కొన్ని సంకల్పములను చేస్తుంది. వీటిని విడగొట్టగలిగిన ప్రజ్ఞ కావాలి. ఇలా చేయాలంటే సమర్థత కావాలి. ఇది నిర్వహణ సమర్థత. అటువంటి శక్తిని పొంది ఉన్నవాడు స్థితికారకుడు. అటు వంటి శక్తిని స్త్రీగా చెప్తే నారాయణి అమ్మవారు. పురుషుడిగా చెప్తే శ్రీ మహావిష్ణువు. తప్పకుండా ప్రాత:కాలమునందు విష్ణునామం చెప్పా లి. విష్ణుశక్తి మీయందు ప్రసరిస్తే సాయంకాలం వరకు ఆ ప్రజ్ఞ అలా వెడుతుంది. విష్ణుపూజతో, విష్ణు నామంతో రోజు ప్రారంభం కావాలి. తరువాత అభిషేకం చేసుకోవచ్చు, శివార్చన చేసుకోవచ్చు. కానీ విష్ణు నామంతో ప్రార్థించాలి. భగవంతుడు ఒక్కడే. కానీ ప్రయోజనం చేకూర్చడానికి అన్ని రూపములను పొందాడు. రాత్రి నిద్రపోయే ముందు 11మార్లు శివనామం జపించి విశ్రాంతి స్థానానికి శరీరాన్ని చేర్చాలి. ఇప్పుడు ఈ శివానుగ్రహం స్వల్పకాలిక లయం. శివనామం చెప్పి నిద్రపోతే ‘నిద్రాసమాధి స్థితి’- అది సమాధి స్థితి అవుతుంది. తొలి తలంపు ఏది వస్తుందో దానిని ఈశ్వరుని వైపు తిప్పడం మనస్సు కు అలవాటు చెయ్యాలి. అప్పుడు కాలమునందు ఒకరోజు అనబడే విభాగమును మహేశ్వరుడిగా మారుస్తున్నా రు. ఇది మహేశ్వరార్చ నము.ఈ మహేశ్వరా ర్చన చేత మహేశ్వరు డుగా మారడము జరు గుతుంది. ఎలా? మన స్సుకి ఒక అలవాటు ఉండాలి. మనస్సుకు తర్ఫీదు ఇవ్వడం రావాలి. నిద్రలేవగానే దృష్టి తిన్నగా ఆరాధించే దేవ తా స్వరూపం మీద పడాలి. అలా దేవతా స్వరూపం చూడడం మన స్సుకు అలవాటు చేయాలి. అంతేకానీ, టైం అయిపోతోందని గడి యారం వంక చూస్తూ కంగారుగాలేవడం అలవాటు కాకూడదు.
నిద్రలేవగానే కళ్ళు విప్పితే మొట్టమొదటి దృష్టి పరమేశ్వర మూర్తి మీద పడడం చేత పరావర్తనం చెంది ఆ పార్వతీ పరమేశ్వరు లు లేక లక్ష్మీనారాయణులను చూసి లేచిన తర్వాత మనస్సునందు మరల ‘సముద్రవసనే దేవి పర్వత స్తనమండలే’ అని శ్లోకం చెప్పి క్రిం దకి దిగాలి. తర్వాత ”గురువుగారూ- మీరు చెప్పిన బుద్ధితో ఈరోజు నారోజు గడుచుగాక’ అని నేలమీద గురువుగారి పాదములను ఒక్క సారి మనస్సులో ధ్యానం చేసి, నమస్కరించాలి. ఇది అలవాటు అయితే తెలియకుండా మొదటి ఆలోచన రావడానికి సాక్షి అవు తుంది. ఈ ఆలోచన్ని దిశానిర్దేశం చేస్తున్నారు.ఇదీ స్థితి కారకత్వం.
లలితాసహస్రంలో అమ్మవారికి ‘భావనామాత్ర సంతుష్టాయై నమ:’ అని ఒక నామం ఉన్నది. భావన చేత ఆవిడ సంతుష్టురాలవు తుంది. మనస్సులో మంచి భావన చేస్తుంటే అక్కడ ఆమె ఆనంది స్తుంది. లోపల ఉన్న శక్తి అంతా ఆవిడే! ఇక్కడవున్న ప్రకృతి వికారమ యిన శరీరము ఆవిడ. ఇది ఆయనను కోరుతోంది. దీనిని దానితో కల పాలని ఆవిడ తెరపైకెత్తుతుంది.ఇది మాయ అన్న యవనికను ఒక రోజున పైకి ఎత్తేస్తుంది. దానితో కలిస్తే అది జీవితంలో అనుసంధాన ప్రక్రియగా వెళ్ళవలసిన మహేశ్వర స్వరూపము. అంతేకాని- మహేశ్వర స్వరూపమనగా ఏదో దేవతలందరి చేత పూజించబడేవాడని అనుకోకూడదు. అది దోషం కాకపోవచ్చు. కాని అలా అనుసంధానం చేసుకుంటే అది భక్తికి బాగా పనికొస్తుంది. కాని ఇది నిత్యజీవితము నందు అలవాటులోకి తెచ్చుకోవలసిన ప్రక్రియ. ఇలా దర్శనం చేస్తూ వెడుతున్నట్లయితే లయ పరమశివుడు. నిద్రలేవగానే మిమ్మల్ని ఎవ రయినా ‘మీరు ఇప్పటిదాకా ఎవరితో కలిసి ఉన్నారు’ అని అడిగి నట్లయితే అపుడు మీరు ధైర్యంగా ‘నేను ఇప్పటివరకు కైలాసము నందు పార్వతీ పరమేశ్వరులతో కలిసి వున్నాను- అదీ నా నిద్ర’ అని చెప్పగలగాలి. ఎందుచేత? నేను నిద్రను పడుకోబోయే ముందు అలా స్వీకరించాను. నా పూజామందిర ప్రవేశము స్థితికర్త ప్రార్థన. నా నిన్న టిరోజు సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తల సమాహారము. అది మహేశ్వర స్వరూపముగా నాచేత ఉపాసన చేయబడినకాలము. కనుక నేను మహేశ్వరోపాసన చేత మరొక మాహేశ్వరుడను అయ్యానని చెప్ప గలరు. ఇది జీవితంలో రావలసిన ప్రక్రియ.ఇలా చెయ్యగా చెయ్యగా భ్రమర కీటక న్యాయంలో ఒకనాడు ఆ స్వరూపమును పొందుతారు.
మహేశ్వర శబ్దం గురించి-
‘తమీశ్వరాణాం పరమం మహేశ్వరం తమ్‌ దేవతానాం పర మం చ దైవతం’ దేవతలు అందరూ కూడా ఎవరికీ ప్రార్థన చేసి నమస్కరిస్తారో, సర్వ జగత్తును ఎవరు నియమించి, పోషించి రక్షిస్తు న్నాడో, ఎవడు దీనిని నిలబెడుతున్నాడో, తనలోకి తీసుకుంటున్నాడో వాడే మహేశ్వరుడు. వాడు సర్వ జగన్నియామకుడు. వాడు పర బ్రహ్మమయి ఉన్నాడు. ఇటువంటి పరబ్రహ్మము ఎక్కడ దర్శనం అవుతుంది? దానిని చూడగలమా? అంటే దీనికి శాస్త్రం సమాధానం చెప్పింది. మహేశ్వర దర్శనం చేయడానికి ముందుగా మీకు మహేశ్వర దర్శనం చేయాలన్న తాపత్రయం కలగాలని చెప్పింది. ఒక్కొక్క రు చాలా పెద్ద చదువులు చదువుకుంటారు. అలా చదువుకోవడం గొప్పకాదు. ఆ చదువును నిరంతరం ఎవరైతే అనుష్ఠానంలోకి తెచ్చు కుంటారో వారు గొప్పవారు. మహాపురుషులు అవుతారు. చదివిన విషయాన్ని ఆచరణలో పెట్టడానికి శ్రద్ధ కావాలి. ఈశ్వరుడు సర్వ సాక్షి. ఆయన చూస్తున్నాడనే బెరుకు ఉన్నట్లయితే, ఒకడు చూసి మెచ్చుకోవాలని పనులు చేయరు. పనులు చేయడం విధిగా భావించి చేస్తారు. శివ పురాణాన్ని ఒక కథగా వినే ప్రయత్నం చేయకూడదు. అలా చేస్తే అది జీవితమును అభ్యున్నతి మార్గం వైపు తీసుకువెళ్ళదు. శివపురాణం మన నిత్యజీవితంలో ఎలా ఉపయోగపడుతుందో ఆలోచించాలి. ఈశ్వరుడిని చూడాలనే తాపత్రయం, సృష్ఠి, స్థితి, లయానుసంధానం నిరంతర ప్రక్రియగా చెయ్యడంలో ఉంటుంది. ఆయన-
‘సర్వజ్ఞాతా తృప్తి రనాది బోధ: స్వతంత్రతా నిత్యమలుప్త శక్తి:
అనంత శక్తిశ్చ విభోర్విధిజ్ఞాత షడాహురంగాని మహశ్వరస్య’ అని శాస్త్రము అంది. కొన్ని విషయములను కన్ను చూసినా మనస్సు వాటిని పట్టుకోదు. ఒకచోట కూర్చుని కంటితో అన్నిటినీ చూస్తున్నా అలా చూస్తున్నవాటిలో కొన్నిటిని మాత్రమే గుర్తు పెట్టుకోగలము. కానీ ఈశ్వరుడు అలాకాదు. మహేశ్వరుడు సమస్త ప్రాణుల హృద య గతమయిన అభిప్రాయములను కూడా తెలుసుకోగలడు.
మనస్సును ఈశ్వరుని పాదముల మీద పెట్టగలిగితే ఈశ్వరుడు వెంటపడి పరుగెడతాడు. మనస్సు అక్కడ పెట్టడానికి చేస్తున్న పరిశ్ర మకు ‘పూజ’ అని పేరు. అలా పూజ చేయడం అలవాటు చేసు కోవాలి. అది అలవాటు అయితే ఏ ప్రదేశంలో ఉన్నా పూజ చేసుకోగలుగుతా రు. పరమేశ్వరుడు హృదయ గతాభిప్రాయమును పట్టగలిగినవా డు. దీనినే సర్వజ్ఞత అంటారు. సర్వజ్ఞత, స్వతంత్రత అనేవి రెండూ ఈశ్వరుడితో ముడి పడి ఉంటాయి. ఏకకాలమునందు సమస్త చరాచర జగత్తులో ఉన్నప్రాణుల హృదయాంతర్గత భాగములను తాను చూస్తాడు. చూసి ఆ భావముల పరిపుష్టి చేత మోక్షమును కూడా అనుగ్రహస్తాడు.

– డా. చదలవాడ హరిబాబు
9849500354

Advertisement

తాజా వార్తలు

Advertisement